Telugu Global
NEWS

టీ20 కెప్టెన్ గా కేఎల్ రాహుల్..!

వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే టీ20 క్రికెట్ సిరీస్ కు భారత కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. కొద్ది రోజులుగా భారత సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా వరుస సిరీస్ లలో పాల్గొన్న సంగతి తెలిసిందే. వారు ముగ్గురికీ దక్షిణాఫ్రికా సిరీస్ కు విశ్రాంతి ఇస్తారని మొదటి నుంచి ప్రచారం జరుగగా ఇప్పుడు అదే నిజమైంది. ఆదివారం బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ నేతృత్వంలో […]

KL Rahul
X

వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే టీ20 క్రికెట్ సిరీస్ కు భారత కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. కొద్ది రోజులుగా భారత సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా వరుస సిరీస్ లలో పాల్గొన్న సంగతి తెలిసిందే. వారు ముగ్గురికీ దక్షిణాఫ్రికా సిరీస్ కు విశ్రాంతి ఇస్తారని మొదటి నుంచి ప్రచారం జరుగగా ఇప్పుడు అదే నిజమైంది. ఆదివారం బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ నేతృత్వంలో ముంబయిలో సెలక్షన్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ కి, అనంతరం ఇంగ్లాండ్ లో జరిగే ఒక టెస్ట్ మ్యాచ్ కి జట్లను ఎంపిక చేశారు.

కెప్టెన్ రోహిత్ శర్మ కు విశ్రాంతి ఇవ్వడంతో రాహుల్ కు గానీ, సీనియర్ బ్యాట్స్ మెన్ ధావన్ కు గానీ టీ20 పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అయితే ధావన్ కు జట్టులో చోటు కూడా దక్కకపోగా రాహుల్ కు కెప్టెన్సీ అప్పగించారు. ఇప్పటికే రాహుల్ భారత క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉండడంతో అతడికే కెప్టెన్ గా అవకాశం ఇచ్చారు.

ప్రస్తుతం ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్న సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కు తిరిగి జట్టులో స్థానం కల్పించారు. కొన్ని నెలలుగా జట్టులో స్థానం కోల్పోయిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కు జట్టులో మళ్లీ చోటు లభించింది. పంత్ కు తోడుగా సెకండ్ వికెట్ కీపర్ గా ఎంపిక అవుతూ వస్తున్న సంజు శాంసన్ కు మొండిచేయి ఎదురైంది.

హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, అర్ష దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ పేస్ విభాగం బాధ్యతలు తీసుకుంటారు. చాహల్, కుల్దీప్, బిష్ణోయ్, అక్షర్ పటేల్ స్పిన్ విభాగం బాధ్యతలు తీసుకోనున్నారు. పంత్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. దక్షిణాఫ్రికా తన పర్యటనలో ఇండియాతో ఐదు టీ20లు ఆడనుంది. జూన్ 9వ తేదీన ఢిల్లీ, 12వ తేదీన కటక్, 14వ తేదీన వైజాగ్, 17వ తేదీన రాజ్ కోట్, 19వ తేదీన బెంగళూరులో మ్యాచ్ లు జరగనున్నాయి.

ఈ సిరీస్ ముగిసిన తర్వాత జూలై 1న ఇంగ్లాండ్ పర్యటన మొదలు కానుంది. అక్కడ టీమిండియా ఒక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అలాగే ఐర్లాండ్ తో కూడా అక్కడ భారత్ రెండు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇక టెస్ట్ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్ బ్యాట్స్ మెన్ పూజారా కౌంటీల్లో పరుగుల వరద పారించడంతో మళ్లీ జట్టులోకి వచ్చాడు. మరో సీనియర్ బ్యాట్స్ మెన్ రహానేకు జట్టులో స్థానం దక్కలేదు.

టీ20 జట్టు: కేఎల్‌ రాహుల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హుడా, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్య, వెంకటేశ్‌ అయ్యర్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌, భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌, అవేశ్‌ ఖాన్‌, అర్షదీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌

టెస్టు జట్టు: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, హనుమ విహారి, చెతేశ్వర్‌ పుజారా, రిషభ్‌ పంత్‌, కేఎస్‌ భరత్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ

First Published:  22 May 2022 8:20 AM GMT
Next Story