Telugu Global
National

వచ్చే ఎన్నికల్లో ఓటమి గ్యారెంటీ.. కాంగ్రెస్ పార్టీకి పీకే శాపాలు

ఆ మధ్య కాంగ్రెస్ పార్టీకి దగ్గరైపోయి, ప్రక్షాళణ మొదలుపెట్టినంత పని చేశారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. కానీ చివరి నిమిషంలో ఎక్కడో వ్యవహారం బెడిసికొట్టింది. పీకే కండిషన్లని ఒప్పుకోలేక కాంగ్రెస్ వెనక్కి తగ్గింది, ఒకరకంగా ఆయన ఎంట్రీని తిరస్కరించింది. దీంతో ఆయన ఇగో కూడా హర్ట్ అయింది. కొత్త పార్టీకి సన్నాహాలు చేస్తున్నట్టు కనిపించారు. అక్టోబర్-2 నుంచి పాదయాత్ర మొదలు పెడతానని కూడా చెప్పారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు […]

వచ్చే ఎన్నికల్లో ఓటమి గ్యారెంటీ.. కాంగ్రెస్ పార్టీకి పీకే శాపాలు
X

ఆ మధ్య కాంగ్రెస్ పార్టీకి దగ్గరైపోయి, ప్రక్షాళణ మొదలుపెట్టినంత పని చేశారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. కానీ చివరి నిమిషంలో ఎక్కడో వ్యవహారం బెడిసికొట్టింది. పీకే కండిషన్లని ఒప్పుకోలేక కాంగ్రెస్ వెనక్కి తగ్గింది, ఒకరకంగా ఆయన ఎంట్రీని తిరస్కరించింది.

దీంతో ఆయన ఇగో కూడా హర్ట్ అయింది. కొత్త పార్టీకి సన్నాహాలు చేస్తున్నట్టు కనిపించారు. అక్టోబర్-2 నుంచి పాదయాత్ర మొదలు పెడతానని కూడా చెప్పారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఓడిపోతుందని జోస్యం చెప్పారు.

చింతన్ శిబిర్ తో ప్రయోజనం లేదు..

ఇటీవల ఉదయ్ పూర్ లో నిర్వహించిన చింతన్ శిబిర్ వల్ల కాంగ్రెస్ కి ఎలాంటి ప్రయోజనం లేదని అంటున్నారు ప్రశాంత్ కిషోర్. కేవలం తీర్మానాలు తప్ప సాధించిందేమీ లేదని అన్నారు. పార్టీకోసం పనిచేసిన వారికే టికెట్లు, ఒకే కుటుంబానికి ఒకే టికెట్ సహా.. రాజ్యసభ సభ్యత్వాలపై కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ.

అయితే సంస్థాగత నిర్మాణంలో మాత్రం ఎలాంటి మార్పులేదు. దీనిపై పీకే మొదటినుంచీ అభ్యంతరం చెబుతున్నారు. సీనియర్లని ఏరిపారేయాలనేది ఆయన ఆలోచన. అక్కడే పార్టీ అధిష్టానానికి, ఆయనకు తేడా వచ్చి.. సయోధ్య కుదర్లేదు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ పార్టీ భవిష్యత్ ఎన్నికల్లో గెలవలేదని శాపాలు పెడుతున్నారు.

కాంగ్రెస్ ని బలహీనపరుస్తారా..?

దేశ ఆర్థిక పరిస్థితులు నానాటికీ దిగజారిపోతుండటంతో బీజేపీకి భవిష్యత్ పై భయం పట్టుకుందనేమాట వాస్తవం. ఎన్నికలు తరుముకొస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఇప్పటినుంచే కేఏ పాల్ వంటి వారిని పెంచి పోషిస్తోంది బీజేపీ. ఇటు కేంద్రంలో కాంగ్రెస్ ని సాధ్యమైనంత వరకు బలహీనపరిచేందుకు కుట్రలు చేస్తోంది.

పీకేలాంటివారు బీజేపీకి సాయం చేస్తున్నారని చెప్పలేం కానీ.. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉండేవారిని వీలైనంతమేర బీజేపీ ప్రోత్సహిస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. రాజకీయ వ్యూహకర్తగా పార్టీల తరపున పనిచేయడమే కానీ, గతంలో ఎప్పుడూ ఇలా రాజకీయ జోస్యం చెప్పలేదు ప్రశాంత్ కిషోర్. తొలిసారిగా ఆయన కాంగ్రెస్ పై విమర్శలు ఎక్కుపెట్టడం, ఫలానా ఎన్నికల్లో ఆ పార్టీ గెలవదు అంటూ ముందుగానే తేల్చి చెప్పడంతో ఇప్పుడు కలకలం రేగింది.

First Published:  20 May 2022 8:37 PM GMT
Next Story