Telugu Global
National

ఓట్ల రాజకీయంలో 'జ్ఞానవాపి'

అయోద్య బాబ్రీ మసీదు వివాదం ఎంత సంచలనం సృష్టించిందో ఇప్పుడు వారణాసిలోని జ్ఞానవాపి మసీదు అదేవిధమైన వివాదాన్ని, సంచలనాన్ని రాజేస్తోంది. అక్కడున్నది కాశీ విశ్వనాథ ఆలయమని దానిని కూలగొట్టి ఔరంగజేబు మసీదును నిర్మించారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టు, వారణాసి కోర్టుల్లో గతంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో విచారించిన జిల్లా సివిల్‌ కోర్టు ఆ ప్రాంతంలో వీడియోగ్రఫీ, సర్వే నిర్వహించేందుకు ఒక కమిటీని, అడ్వొకేట్‌ కమిషనర్‌ను నియమించారు. మే 3 నుంచి సర్వే, వీడియోగ్రఫీ […]

జ్ఞాన్‌వాపి మసీదు
X

అయోద్య బాబ్రీ మసీదు వివాదం ఎంత సంచలనం సృష్టించిందో ఇప్పుడు వారణాసిలోని జ్ఞానవాపి మసీదు అదేవిధమైన వివాదాన్ని, సంచలనాన్ని రాజేస్తోంది. అక్కడున్నది కాశీ విశ్వనాథ ఆలయమని దానిని కూలగొట్టి ఔరంగజేబు మసీదును నిర్మించారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టు, వారణాసి కోర్టుల్లో గతంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో విచారించిన జిల్లా సివిల్‌ కోర్టు ఆ ప్రాంతంలో వీడియోగ్రఫీ, సర్వే నిర్వహించేందుకు ఒక కమిటీని, అడ్వొకేట్‌ కమిషనర్‌ను నియమించారు. మే 3 నుంచి సర్వే, వీడియోగ్రఫీ ప్రారంభించి మే 10 నాటికి నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. ఈ సర్వేలోనే జ్ఞానవాపిలో శివలింగం బయటపడిందంటూ పిటిషన్‌దారుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆ ప్రాంతాన్ని సీల్ చేసి శివలింగానికి భద్రత కల్పించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

ఇప్పుడు ఈ విషయంపై వివాదం రాజకీయ రంగు పులుముకుంది. నిజం చెప్పాలంటే ఈ అంశాన్ని రాజకీయ సమీకరణలకు వాడుకోవడానికి బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అయోధ్య లో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పుడే నాటి యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఈ జ్ఞానవాపి మసీదు, మథురలో కృష్ణుడు జన్మించినట్టుగా చెప్పే స్థలంలో ఉన్న షాహీ ఈద్గా మసీదు ల గురించి మాట్లాడారు. ఈ రెండి‍ంటిని తిరిగి సాధిస్తామని ఆయన ఆనాడే ప్రకటించారు.

కాగాఈ 1669లో, ఔరంగజేబు ఆలయాన్ని కూల్చివేయమని ఆదేశించాడని, దాని స్థానంలో జ్ఞాన్ వాపి మసీదును నిర్మించాలని ఆదేశించాడని చెబుతారు. అయితే ఔరంగజేబు సైన్యం ఆలయంలోకి రాకముందే ఆలయ పూజారి శివలింగాన్ని పెకిలించి పక్కనే ఉన్న జ్ఞానవాపి అనే బావిలో ఆ శివలింగాన్ని పడేసి తానూ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని ప్రచారంలో ఉన్న కథలు.

ఈ విషయంపై1991లో వారణాసి కోర్టులో పిటీషన్ దాఖలైంది, అక్కడ పిటిషనర్లు, స్థానిక పూజారులు, జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో పూజలు చేసేందుకు అనుమతి కోరారు. అయితే మసీదు తరఫున ‘అంజుమన్‌ ఇంతెజామియా మస్జిద్‌’ స్టే కోరుతూ హైకోర్టుకు వెళ్ళింది. 1998 నుంచి ఆ కేసు పెండింగ్‌లో ఉంది. ఇదిలా కొనసాగుతుండగా.. మళ్ళీ ఇదే విషయంపై విశ్వ వేదిక్‌ సనాతన్‌ సంఘ్‌ అనే సంస్థకు చెందిన ఐదుగురు ఢిల్లీ మహిళలు 2021లో కోర్టులో పిటిషన్‌ వేశారు. విచారించిన జిల్లా సివిల్‌ కోర్టు ఆ ప్రాంతంలో వీడియోగ్రఫీ, సర్వే నిర్వహించేందుకు ఒక కమిటీని, అడ్వొకేట్‌ కమిషనర్‌ను నియమించారు. మే 3 నుంచి సర్వే, వీడియోగ్రఫీ ప్రారంభించి మే 10 నాటికి నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు.

అయితే 1991 లో అప్పటి పీవీ నర్సింహారావు ప్రభుత్వం తెచ్చిన ఓ చట్టం కారణంగా అయోద్య తప్ప మరే కేసు కూడా ముందుకు కదలడం లేదు. ఆ చట్టం ఏం చెబుతోందంటే…. అన్ని మతాలకు చెందిన మందిరాల్లో, ప్రార్ధనా స్థలాల్లో 1947 ఆగస్టు 15 కు పూర్వం ఉన్న పరిస్థితులనే కొనసాగించాలి. అనేది ఆ చట్టం ఉద్దేశ్యం.

మరి మోడీ ప్రభుత్వం ఆ చట్టాన్ని మారుస్తుందా లేదా మరో కొత్త చట్టమేదైనా తీసుకవస్తుందా తెలియదు కానీ ప్రస్తితానికైతే జ్ఞానవాపి మసీదు వివాదాన్ని రాజకీయం చేయడంలో మాత్రం విజయం సాధించింది. ఈ అంశంపై అధికార ప్రతిపక్షాలు అప్పుడే రగడ ప్రారంభించాయి. కర్నాటక బీజేపీ నేత ఈశ్వరప్ప ఒక అడుగు ముందుకేసి ఒక్క జ్ఞానవాపి మసీదు మాత్రమే కాక మొఘలులు ధ్వంస౦మ్ చేసి మసీదులు నిర్మించిన 36 వేల ఆలయాలను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు.

మరో వైపు ఎమ్ ఐ ఎమ్ అధినేత అసదుద్దీన్ ఓ వైసీ ఈ అంశంపై స్పందిస్తూ బాబ్రీ మసీదు కోల్పోయినట్టు ఈ మసీదు కూడా కోల్పోవడానికి తాము సిద్దంగా లేమంటూ వ్యాఖ్యానించారు.

ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో ఇప్పుడే చెప్పలేం కానీ అయోధ్య లాగే జ్ఞానవాపి కూడా తమకు ఓట్లు కురిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు బీజేపీ నాయకులు.

First Published:  17 May 2022 4:35 AM GMT
Next Story