Telugu Global
International

సంక్షోభ సమయంలో సీనియర్ కి పగ్గాలు.. శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే..

పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. కానీ ఆ పార్టీ అధినేత ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. విధి విచిత్రం. 73ఏళ్ల వయసులో రాజకీయాలనుంచి వైదొలగాలనుకుంటున్న ఆ మాజీ ప్రధాని తిరిగి దేశానికి నాయకుడు కావాల్సి వచ్చింది. ఆ విచిత్రం శ్రీలంకలో జరిగింది. ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్సే వైదొలగిన తర్వాత శ్రీలంక రాజకీయ సంక్షోభాన్ని గట్టెక్కించేందుకు రణిల్ విక్రమ సింఘేని తెరపైకి తెచ్చారు అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే. ప్రస్తుత ఆర్థిక […]

సంక్షోభ సమయంలో సీనియర్ కి పగ్గాలు.. శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే..
X

పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. కానీ ఆ పార్టీ అధినేత ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. విధి విచిత్రం. 73ఏళ్ల వయసులో రాజకీయాలనుంచి వైదొలగాలనుకుంటున్న ఆ మాజీ ప్రధాని తిరిగి దేశానికి నాయకుడు కావాల్సి వచ్చింది. ఆ విచిత్రం శ్రీలంకలో జరిగింది. ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్సే వైదొలగిన తర్వాత శ్రీలంక రాజకీయ సంక్షోభాన్ని గట్టెక్కించేందుకు రణిల్ విక్రమ సింఘేని తెరపైకి తెచ్చారు అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే. ప్రస్తుత ఆర్థిక వైపరీత్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఆయన అనుభవాన్ని రంగరించి ఉపాయాన్ని కనిపెట్టాలని సూచించారు. దీంతో శ్రీలంక ప్రధానిగా ఐదోసారి పగ్గాలు చేపట్టారు రణిల్ విక్రమ సింఘే. 2020లో జరిగిన ఎన్నికల్లో రణిల్ నేతృత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. కానీ ఓట్ల ఆధారంగా ఓ సీటు కేటాయించడం ఇప్పుడు ఆయనకు కలిసొచ్చింది. ఆ ఒక్క సీటుతోనే ఆయన ప్రధాని కాగలిగారు. వారంలో నూతన కేబినెట్ ఏర్పాటు చేసుకుని పాలన మొదలు పెట్టబోతున్నారు.

రణిల్ ప్రత్యేకతలివే..
నాలుగుసార్లు ప్రధానిగా, పలుమార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన రణిల్ విక్రమ సింఘే.. శ్రీలంక ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలరనే నమ్మకం అధ్యక్షుడు గొటబాయతోపాటు, ప్రజలకు కూడా ఉంది. అందుకే కొత్త ప్రభుత్వంపై వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ సహకారాన్ని పొందడంలోనూ రణిల్ నేర్పరి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. దీంతో ఆయన ఐదోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టారు.

73 ఏళ్ల రణిల్‌ విక్రమ సింఘే గత 45ఏళ్లుగా పార్లమెంట్‌ సభ్యుడిగా కొనసాగుతున్నారు. లాయర్ గా తన కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత రాజకీయ నాయకుడయ్యారు. 1977లో తొలిసారి శ్రీలంక పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1993లో తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. చివరిగా 2019లో ఆయన ప్రధానిగా ఉన్నారు. 2019లో శ్రీలంకలో ఈస్టర్ రోజున చర్చిపై దాడి జరిగిన సమయంలో రణిల్ ఆ దేశ ప్రధానిగా ఉన్నారు. ఆ తర్వాత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఓట్ల సంఖ్య ఆధారంగా కేవలం రణిల్ మాత్రమే పార్లమెంట్ కి ఎంపికయ్యారు. ఇప్పుడు ప్రధాని అయ్యారు.

First Published:  12 May 2022 11:57 AM GMT
Next Story