Telugu Global
NEWS

ఏపీలో మలి కేబినెట్ తొలి భేటీ.. కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం..

ఏపీలో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ అనంతరం తొలిసారి కేబినెట్ భేటీ జరిగింది. సంక్షేమ పథకాల అమలు క్యాలెండ‌ర్‌ని ఆమోదించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ మంత్రిమండలి. గడప గడపకు ప్రభుత్వం పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని కొనసాగించాలని, తమ తమ నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికి శాసన సభ్యులు, మంత్రులు వెళ్లాలని మరోసారి సూచించారు సీఎం జగన్. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని, చెప్పిందే చేశామన్న అంశాన్ని వారికి […]

ఏపీలో మలి కేబినెట్ తొలి భేటీ.. కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం..
X

ఏపీలో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ అనంతరం తొలిసారి కేబినెట్ భేటీ జరిగింది. సంక్షేమ పథకాల అమలు క్యాలెండ‌ర్‌ని ఆమోదించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ మంత్రిమండలి. గడప గడపకు ప్రభుత్వం పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని కొనసాగించాలని, తమ తమ నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికి శాసన సభ్యులు, మంత్రులు వెళ్లాలని మరోసారి సూచించారు సీఎం జగన్. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని, చెప్పిందే చేశామన్న అంశాన్ని వారికి గుర్తుచేయాల‌ని, ఈ విషయంలో అలసత్వం వద్దని సీఎం జగన్ మంత్రులకు సూచించారు.

వ్యవసాయానికి సంబంధించి కీలక మార్పు..
ప్రతి ఏటా తుపానుల వల్ల రైతులు నష్టపోతూనే ఉన్నారు. అయితే దీనికి పరిష్కారం కనుగొనే దిశగా వైసీపీ ప్రభుత్వం ఓ వినూత్న ఆలోచన చేసింది. వ్యవసాయ సీజన్ ని కాస్త ముందుకు జరిపింది. గోదావరి డెల్టాకు జూన్‌ 1న, కృష్ణా డెల్టాకు జూన్‌ 10న, రాయలసీమ ప్రాజెక్టుల నుంచి జూలై 30న సాగునీరు విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైతులు ఖరీఫ్ సీజన్‌ ను ముందే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల నవంబర్‌ లో తుపానులు వచ్చేనాటికి పంట చేతికందే అవకాశముంటుందనేది ప్రభుత్వ ఆలోచన. .

కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలు..
మే 13న కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మత్స్యకార భరోసా పథకం ప్రారంభించేందుకు కేబినెట్ నిర్ణయించింది. మే 16న రైతు భరోసా, జూన్ 19న యానిమల్ అంబులెన్సుల ప్రారంభోత్సవం, జూన్ 6న కమ్యూనిటీ హైరింగ్ పథకం కింద ట్రాక్టర్లు, హార్వెస్టర్ల పంపిణీ, జూన్ 14న పంట నష్టపోయిన రైతులకు బీమా చెల్లింపు, జూన్ 21న అమ్మ ఒడి ప్రారంభించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జిల్లా కేంద్రాల్లో కార్పొరేషన్‌ లలో అత్యాధునిక వైద్య సౌకర్యాల కోసం మెడికల్ హబ్‌ల ఏర్పాటు, ప్రైవేటు రంగంలో కనీసం 100 పడకలతో ఆస్పత్రుల నిర్మాణం, నెల్లూరు జిల్లాలో టెక్స్ టైల్ పార్కు కోసం భూ కేటాయింపు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు.

First Published:  12 May 2022 11:05 AM GMT
Next Story