Telugu Global
NEWS

ఏపీ ప్రభుత్వానికి రవాణాశాఖ లేఖ కలకలం..

ఇటీవల ఒంగోలులో సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ కోసం తిరుమల వెళ్లే కుటుంబం నుంచి బలవంతంగా ఓ కారు తీసుకున్నారు పోలీసులు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ హోమ్ గార్డ్, రవాణాశాఖ అధికారిణిపై ప్రభుత్వం వేటు వేసింది. వీఐపీల పర్యటనల్లో భాగంగా ఈ తంతు జరిగేదే అయినా తిరుమల భక్తుల్ని అడ్డుకోవడం, అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వేటు పడింది. అయితే రవాణాశాఖ అధికారులకు అంతకు మించి ప్రత్యామ్నాయం లేదు. నీతిగా, […]

ఏపీ ప్రభుత్వానికి రవాణాశాఖ లేఖ కలకలం..
X

ఇటీవల ఒంగోలులో సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ కోసం తిరుమల వెళ్లే కుటుంబం నుంచి బలవంతంగా ఓ కారు తీసుకున్నారు పోలీసులు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ హోమ్ గార్డ్, రవాణాశాఖ అధికారిణిపై ప్రభుత్వం వేటు వేసింది. వీఐపీల పర్యటనల్లో భాగంగా ఈ తంతు జరిగేదే అయినా తిరుమల భక్తుల్ని అడ్డుకోవడం, అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వేటు పడింది. అయితే రవాణాశాఖ అధికారులకు అంతకు మించి ప్రత్యామ్నాయం లేదు. నీతిగా, నిజాయితీగా కాన్వాయ్ లో వాహనాలు సమకూర్చాలంటే చేతి చమురు వదిలించుకోవాల్సిందే. పోనీ బిల్లులు పెడతామా అంటే.. కోట్ల రూపాయల బకాయిలు ఇంకా వసూలు కాని పరిస్థితి. దీంతో ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో ఎక్కడికక్కడ వాహనాలను నయానో భయానో తెప్పిస్తుంటారు. పెట్రోల్ ఖర్చులు భరించి పంపించేస్తుంటారు. తాజాగా ఈ వ్యవహారంపై రవాణాశాఖ మౌనాన్ని వీడింది. మూడేళ్లుగా పేరుకుపోయిన పాత బకాయిలు వెంటనే చెల్లించాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది.

బకాయిల మొత్తం రూ.17.5కోట్లు..
సీఎం, వీఐపీల కాన్వాయ్‌ ల బిల్లుల బకాయిలు మూడేళ్లుగా రూ.17.5 కోట్లు పేరుకుపోయాయని వాటిని వెంటనే చెల్లించాలంటూ ప్రభుత్వానికి రవాణా శాఖ లేఖ రాసింది. బకాయిలు చెల్లిస్తేనే తాము కాన్వాయ్ లు సమకూర్చగలమని, లేకపోతే అది తలకు మించిన భారమవుతోందని, కొన్నిసార్లు ప్రైవేట్ వాహనాలను తీసుకొచ్చే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ లేఖలో తెలిపారు అధికారులు.

ఏటా రూ.4.5 కోట్లు..
ఇటీవలే రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా కాన్వాయ్ బిల్లుల విషయం కూడా చర్చకు వచ్చింది. కాన్వాయ్ ల బిల్లులు వెంటనే చెల్లించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు అధికారులు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలలో సీఎం పర్యటనలు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తమ సంగతేంటని రవాణా శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వీఐపీల కాన్వాయ్‌ ల కోసం ప్రతి ఏడాది కనీసం రూ. 4.5కోట్లు అవసరమని రవాణా శాఖ అధికారులు లెక్క వేశారు. ముఖ్యంగా తిరుమల దర్శనాల విషయంలో రేణిగుంటనుంచి కాన్వాయ్ మొదలు కావాల్సి ఉంటుంది. తిరుమలకు వీఐపీల తాకిడి ఎక్కువ. వారికి ప్రొటోకాల్ ప్రకారం కాన్వాయ్ లో వాహనాలు సమకూర్చాల్సిన బాధ్యత రవాణా శాఖ అధికారులపై ఉంటుంది. మొత్తంగా ప్రతి ఏటా 4.5 కోట్ల రూపాయలు కాన్వాయ్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఈమేరకు ముందుగానే బడ్జెట్ లో కేటాయింపులు జరపాలని, ప్రత్యేక ఖాతా ద్వారా ఆ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి రాసిన లేఖలో అభ్యర్థించారు రవాణా శాఖ అధికారులు.

First Published:  12 May 2022 7:06 AM GMT
Next Story