Telugu Global
NEWS

చికెన్ ధరలకు రెక్కలు.. కిలో రూ. 300 పైనే.. బెంబేలెత్తుతున్న వినియోగదారులు

రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ వినియోగదారులు కోట్లాది మంది ఉంటారు. తెలంగాణ, ఆంధ్రాలో నాన్-వెజ్ తినే వాళ్ల సంఖ్య జనాభాలో 90 శాతానికి పైగానే ఉంటుందని ఈ మధ్య కాలంలో ఒక సర్వే చెప్పింది. అయితే నాన్-వెజ్ ప్రియుల్లో ఎక్కువ మంది కొనుగోలు చేసేది చికెన్. వారానికి కనీసం ఒక్క సారైనా చికెన్‌తో భోజనం చేసే కుటుంబాలు ఎక్కువగానే ఉంటాయి. అలాంటి చికెన్ ప్రియులకు ధరలు షాక్ ఇస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు రంజాన్ మాసం కదా అందుకే […]

చికెన్ ధరలకు రెక్కలు.. కిలో రూ. 300 పైనే.. బెంబేలెత్తుతున్న వినియోగదారులు
X

రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ వినియోగదారులు కోట్లాది మంది ఉంటారు. తెలంగాణ, ఆంధ్రాలో నాన్-వెజ్ తినే వాళ్ల సంఖ్య జనాభాలో 90 శాతానికి పైగానే ఉంటుందని ఈ మధ్య కాలంలో ఒక సర్వే చెప్పింది. అయితే నాన్-వెజ్ ప్రియుల్లో ఎక్కువ మంది కొనుగోలు చేసేది చికెన్. వారానికి కనీసం ఒక్క సారైనా చికెన్‌తో భోజనం చేసే కుటుంబాలు ఎక్కువగానే ఉంటాయి. అలాంటి చికెన్ ప్రియులకు ధరలు షాక్ ఇస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు రంజాన్ మాసం కదా అందుకే ధరలు పెరిగాయని అనుకుంటే.. పండగ తర్వాత రేటు మరో రూ.20 పెరిగిందే తప్ప తగ్గడం లేదు. ఇప్పుడు కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర హైదరాబాద్‌లో రూ. 300 పలుకుతున్నది.

గత ఎండాకాలంలో కూడా కేజీ చికెన్ రూ. 280 వరకు పెరిగింది. ఈ సారి దాన్ని మించిపోవడంతో వినియోగదారులు చికెన్ అంటేనే ఆందోళన చెందుతున్నారు. ఈ సారి ఎండల తీవ్రత కాస్త ఎక్కువగా ఉండటంతో కోళ్ల పెంపకం తగ్గిపోయిందని, దీంతో మార్కెట్‌లో డిమాండ్‌కు తగినన్ని కోళ్లు రేటు కూడా పెరిగినట్లు చెప్తున్నారు. కోళ్ల పెంపకం తగ్గడం వల్లే దాని ప్రభావం ధరలపై పడిందని పౌల్ట్రీ రైతులు అంటున్నారు.

గత రెండు రోజుల్లో కిలో చికెన్ రూ. 300కు, లైవ్ బర్త్ కిలో రూ. 180కి అమ్మారు. గత వారం రూ. 260 ఉన్న ధర క్రమంగా పెరుగుతూ మూడు వందలకు చేరుకున్నది. మరో వారం రోజుల్లో ఈ ధర మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు చికెన్ వ్యాపారులు చెప్తున్నారు. డిసెంబర్, జనవరి నెలల్లో కోడి పిల్లను పెంచడం మొదలు పెడితే ఫిబ్రవరి నెలకు అమ్మకానికి రెడీగా ఉంటాయి. అయితే ఈ సారి ఎండలు పెరగడంతో కోడి ఎదగడానికి చాలా సమయం తీసుకున్నది. దీంతో గత నెలన్నరగా మార్కెట్‌లో కోళ్ల లభ్యత తగ్గిందని పౌల్ట్రీ రైతులు చెప్తున్నారు.

ప్రతీ వేసవిలో ఇదే పరిస్థితి నెలకొంటున్నదని రైతులు చెప్తున్నారు. మరోవైపు పౌల్ట్రీ వ్యాపారంలోకి కార్పొరేట్ కంపెనీలు ప్రవేశించిన తర్వాత ధరలు మొత్తం వారి నియంత్రణలోనే ఉంటున్నాయని, వాళ్లు నిర్ణయించిన ధరకే విక్రయించడం వల్ల కూడా ధరలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

First Published:  9 May 2022 11:36 PM GMT
Next Story