Telugu Global
NEWS

బండి సంజయ్ యాత్రతో బీజేపీ లాభపడిందా? జూపల్లి పార్టీలో చేరబోతున్నారా?

తెలంగాణలో బీజేపీకి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో స్టేట్ చీఫ్ బండి సంజయ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అధిష్టానం ఆశీస్సులు ఉండటంతో ఆయన రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రారంభించారు. ఆయన యాత్రకు భారీ స్పందన ఖాయమని.. టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు భారీగా బీజేపీలో చేరతారని అందరూ భావించారు. తీరా ప్రస్తుతం పరిస్థితి చూస్తే యాత్రకు పెద్దగా స్పందన లేకుండా పోయింది. మీడియాలో కూడా సంజయ్ యాత్రపై పెద్దగా చర్చ కూడా జరగడం లేదు. […]

బండి సంజయ్ యాత్రతో బీజేపీ లాభపడిందా? జూపల్లి పార్టీలో చేరబోతున్నారా?
X

తెలంగాణలో బీజేపీకి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో స్టేట్ చీఫ్ బండి సంజయ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అధిష్టానం ఆశీస్సులు ఉండటంతో ఆయన రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రారంభించారు. ఆయన యాత్రకు భారీ స్పందన ఖాయమని.. టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు భారీగా బీజేపీలో చేరతారని అందరూ భావించారు. తీరా ప్రస్తుతం పరిస్థితి చూస్తే యాత్రకు పెద్దగా స్పందన లేకుండా పోయింది. మీడియాలో కూడా సంజయ్ యాత్రపై పెద్దగా చర్చ కూడా జరగడం లేదు.

తెలంగాణలో సమస్యలను ఎత్తి చూపుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బండి సంజయ్ చాలా ప్రయత్నిస్తున్నారు. రైతులతో సమావేశం అవుతూ వారి బాధలు తెలుసుకుంటున్నారు. అయితే ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేస్తామని, కేంద్రం హ్యాండ్ ఇవ్వడంతో రాష్ట్రమే ప్రతీ గింజా కొంటుందని కేసీఆర్ చెప్పారు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీది అప్పర్ హ్యాండ్ అవడంతో బీజేపీ ఆ విషయంలో రైతుల వద్ద ముఖం చూపించలేక పోతున్నది. ఇది బండి సంజయ్ యాత్ర సమయంలో స్పష్టంగా కనిపించింది. యాత్ర ప్రారంభంలో ధాన్యం గురించి మాట్లాడిన సంజయ్.. ఆ తర్వాత ఆ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు.

మరోవైపు సంజయ్ యాత్ర సందర్భంగా భారీగా చేరికలు ఉంటాయని భావించారు. టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి జూపల్లి కృష్టారావు పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే తన ప్రత్యర్థి డీకే అరుణ ఇప్పటికే బీజేపీలో ఉండటంతో ఆయన చేరిక కష్టమే అని తెలుస్తున్నది. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవ‌డు చల్లా వెంకట్రామిరెడ్డి కూడా మొదట బీజేపీలో చేరికపై ఆసక్తి చూపించినా.. తర్వాత దూరం జరిగినట్లు సమాచారం.

అయితే, రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక.. ఇలాంటి అసంతృప్త, న్యూట్రల్ నేతలతో మంతనాలు జరిపినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ రాష్ట్రంలో బలమైన క్యాడర్ ఉండటంతో.. ఆ పార్టీలో చేరడం మంచిదనే అభిప్రాయానికి కొంత మంది నాయకులు వచ్చినట్లు తెలుస్తున్నది. జూపల్లి త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటాడని సమాచారం. మహబూబ్‌నగర్ రాజకీయాలలో పట్టున్న రేవంత్ వల్లే బీజేపీలో చేరికలు ఆగిపోయాయని తెలుస్తున్నది. అయితే బండి సంజయ్ యాత్ర మాత్రం బీజేపీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నది.

First Published:  3 May 2022 2:26 AM GMT
Next Story