Telugu Global
NEWS

విరాట్ కోహ్లీ మెడపై విచ్చుకత్తులు! టీ-20 ప్రపంచకప్ జట్టులో చోటు అనుమానమే?

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ నుంచి జరిగే 2022 టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో సూపర్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చోటు అనుమానమేనన్న ప్రచారం జోరందుకొంది. గత రండేళ్లుగా టెస్ట్, వన్డే ఫార్మాట్లలో స్థాయికి తగ్గట్టుగా రాణించడంలో విఫలమవుతూ వస్తున్న విరాట్ ..ప్రస్తుత ఐపీఎల్ లో మరిన్ని వైఫల్యాలతో పాతాళానికి పడిపోయాడు. చివరకు తనజట్టుకే భారంగా, అలంకరణప్రాయంగా మారిపోయాడు. 9 మ్యాచ్ ల్లో 127 పరుగులే..! ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో.. ప్రధానంగా ఐపీఎల్ లో […]

విరాట్ కోహ్లీ మెడపై విచ్చుకత్తులు!  టీ-20 ప్రపంచకప్ జట్టులో చోటు అనుమానమే?
X

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ నుంచి జరిగే 2022 టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో సూపర్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చోటు అనుమానమేనన్న ప్రచారం జోరందుకొంది. గత రండేళ్లుగా టెస్ట్, వన్డే ఫార్మాట్లలో స్థాయికి తగ్గట్టుగా రాణించడంలో విఫలమవుతూ వస్తున్న విరాట్ ..ప్రస్తుత ఐపీఎల్ లో మరిన్ని వైఫల్యాలతో పాతాళానికి పడిపోయాడు. చివరకు తనజట్టుకే భారంగా, అలంకరణప్రాయంగా మారిపోయాడు.

9 మ్యాచ్ ల్లో 127 పరుగులే..!
ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో.. ప్రధానంగా ఐపీఎల్ లో అత్యున్నత ప్రమాణాలకు మరో పేరైన విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం అత్యంత చెత్తరికార్డులకు చిరునామాగా మిగిలాడు. ప్రస్తుత సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు ఆడిన మొత్తం 9 రౌండ్ల మ్యాచ్ ల్లో కోహ్లీ కనీసం ఒక్క అర్థశతకమూ సాధించలేకపోయాడు. మొత్తం 9 ఇన్నింగ్స్ లో 48 పరుగులు అత్యధిక స్కోరుతో 127 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. 16 సగటుతో కోహ్లీ వెలవెలబోతున్నాడు. 2017 తర్వాత.. రెండుసార్లు గోల్డెన్ డకౌట్లుగా వెనుదిరిగాడు. కోహ్లీ దారుణవైఫల్యాలు చూసి భరించలేని మాజీ చీఫ్ కోచ్ రవి శాస్త్రి.. ఆట నుంచి విశ్రాంతి తీసుకోమంటూ సలహా ఇచ్చారు. వరుస వైఫల్యాలతో ఐపీఎల్ లో కొనసాగటంలో అర్థంలేదని తేల్చి చెప్పారు. మరోవైపు..కోహ్లీ గొప్పఆటగాడే అయినా..అతని ప్రస్తుత ఫామ్ స్థాయికి తగ్గట్టుగా లేదని, అతని స్థానాన్ని భర్తీ చేయగల మెరికల్లాంటి ఆటగాళ్లు పలువురు అందుబాటులో ఉన్నారంటూ బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించడంతో..ప్రపంచకప్ జట్టులో విరాట్ కు చోటు అనుమానమేనన్న ప్రచారం ఊపందుకొంది.

రేసులో ఐదుగురు బ్యాటర్లు!
ప్రపంచకప్ లో పాల్గొనే భారత టీ-20 జట్టులో విరాట్ కోహ్లీ వన్ డౌన్ స్థానంలో ఆడుతూ వస్తున్నాడు. అయితే.. కొహ్లీకి ప్రత్యామ్నాయంగా..ఆ స్థానాన్ని భర్తీ చేయగల నవతరం ఆటగాళ్లలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, గుజరాత్ టైటాన్స్ సారధి హార్థిక్ పాండ్యా, యువఓపెనర్ శుభ్ మన్ గిల్, చెన్నై డాషింగ్ ఆల్ రౌండర్ శివమ్ దుబే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత సీజన్ లీగ్ లో ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ ల్లో పై ఐదుగురు ఆటగాళ్లు తమతమ జట్ల తరఫున మెరుపులు మెరిపించినవారే. అయితే..ఫామ్ ఈజ్ టెంపరరీ.. క్లాస్ ఈజ్ పెర్మనెంట్ అన్న క్రికెట్ నానుడిని అనుసరించి.. విరాట్ కోహ్లీ లాంటి మేరునగధీర ఆటగాడిని పక్కనపెట్టే సాహసం బీసీసీఐ ఎంపిక సంఘం చేయగలుగుతుందా?..అనుమానమే..!

First Published:  30 April 2022 12:33 AM GMT
Next Story