ఏపీలో అధికారికంగా కొత్త జిల్లాలు.. ఘనంగా ప్రారంభోత్సవం..
ఏపీలో ఉన్న 13 జిల్లాలకు తోడు కొత్తగా మరో 13 జిల్లాలు ఆవిష్కృతమయ్యాయి. ఇప్పుడు నవ్యాంధ్ర 26 జిల్లాల రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది. సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో కొత్త జిల్లాలను ప్రారంభించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లోని కలెక్టర్ల కార్యాలయాల్లో స్థానిక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు లాంఛనంగా బాధ్యతలు స్వీకరించి పనులు ప్రారంభించారు. ఈరోజు మంచి […]
ఏపీలో ఉన్న 13 జిల్లాలకు తోడు కొత్తగా మరో 13 జిల్లాలు ఆవిష్కృతమయ్యాయి. ఇప్పుడు నవ్యాంధ్ర 26 జిల్లాల రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది. సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో కొత్త జిల్లాలను ప్రారంభించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లోని కలెక్టర్ల కార్యాలయాల్లో స్థానిక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు లాంఛనంగా బాధ్యతలు స్వీకరించి పనులు ప్రారంభించారు.
ఈరోజు మంచి పనికి శ్రీకారం చుట్టామని, రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరిగే గొప్ప రోజు ఇదని అన్నారు సీఎం జగన్. గతంలో ఉన్న 13 జిల్లాల ఉనికిని అలాగే కాపాడుకుంటూ.. కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు జగన్. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలనే ఈ మార్పులు చేసినట్టు తెలిపారు. కలెక్టర్లకు అధికారంతో పాటు ప్రజల పట్ల బాధ్యత మరింత పెరుగుతుందని, ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు జరుగుతాయని చెప్పారు.
ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా జరిగే మంచిని గ్రామస్థాయిలో సచివాలయాల ద్వారా చూశామని, ఇప్పుడు జిల్లా స్థాయిలో కూడా వికేంద్రీకరణ చేస్తున్నామని అన్నారు సీఎం జగన్. కొత్త జిల్లాల్లో బాధ్యతలు చేపట్టిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.
రేపు ఢిల్లీకి సీఎం జగన్..
సీఎం జగన్ రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. రేపు సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో సీఎం జగన్ భేటీ అవుతారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగే అవకాశముంది.