Telugu Global
NEWS

ఏపీలో అట్టహాసంగా కొత్త జిల్లాల ప్రారంభం..!

ఆంధ్రప్రదేశ్ లో నవ శకం మొదలైంది. రాష్ట్రంలో నూతన జిల్లాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 కు చేరుకుంది. ముఖ్యమంత్రి జగన్ అమరావతి నుంచి వర్చువల్ గా కొత్త జిల్లాలను ప్రారంభించారు. జగన్ ఎలక్ట్రానిక్ బటన్ నొక్కి నూతన జిల్లాలను ప్రారంభించారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ముఖ్య అధికారులు నూతన జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగన్ […]

ఏపీలో అట్టహాసంగా కొత్త జిల్లాల ప్రారంభం..!
X

ఆంధ్రప్రదేశ్ లో నవ శకం మొదలైంది. రాష్ట్రంలో నూతన జిల్లాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 కు చేరుకుంది. ముఖ్యమంత్రి జగన్ అమరావతి నుంచి వర్చువల్ గా కొత్త జిల్లాలను ప్రారంభించారు. జగన్ ఎలక్ట్రానిక్ బటన్ నొక్కి నూతన జిల్లాలను ప్రారంభించారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ముఖ్య అధికారులు నూతన జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

జగన్ పాదయాత్ర సమయంలో వైసీపీ అధికారంలోకి వస్తే కొత్తగా జిల్లాల సంఖ్య పెంచుతామని హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా పార్లమెంటు నియోజకవర్గ ప్రాతిపదికన కొత్త జిల్లాలను విభజించారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనతో సరికొత్త భౌగోళిక ముఖచిత్రం ఆవిష్కృతం అయింది. నైసర్గిక స్వరూపాలతో కొత్త జిల్లాల ఉనికి నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు ఏపీలో 13 జిల్లాలు ఉండగా, కొత్తగా అమల్లోకి వచ్చిన మరో 13 జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాల్లో పాలన మొదలైంది.

అలాగే పాలనకు అనుగుణంగా 73 రెవెన్యూ డివిజన్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఆయా జిల్లాల్లో, రెవెన్యూ డివిజన్లలో కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోల నియామకాన్ని కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో డీఎంహెచ్వో వంటి పదవులకు సంబంధించి నియామకాల ప్రక్రియ చేపట్టాల్సి ఉంది.

అతి పెద్ద జిల్లాగా ప్రకాశం

గతంలో రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా అనంతపురం ఉండగా, జిల్లాల పునర్విభజనతో 14322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అతి పెద్ద జిల్లాగా ప్రకాశం అవతరించింది. అతి చిన్న జిల్లాగా విశాఖ ఉంది. అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా కర్నూలు నిలిచింది.

మొత్తం 26 జిల్లాలు ఇవే..

రాష్ట్రంలోని 26 జిల్లాలో ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఆరు జిల్లాలుగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఉన్నాయి. కోస్తా ల 12 జిల్లాలు.. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. రాయలసీమలో 8 జిల్లాలు.. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైయస్సార్, అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాలు ఉన్నాయి.

First Published:  4 April 2022 1:14 AM GMT
Next Story