Telugu Global
Sports

ఐపీఎల్ లో కోల్‌క‌తా టాప్ గేర్

టాటా ఐపీఎల్ 15వ సీజన్ గ్రూపులీగ్ లో మాజీ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తిరుగులేని విజయం సాధించింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ముగిసిన లోస్కోరింగ్ పోరులో కింగ్స్ పంజాబ్ ను 6 వికెట్లతో చిత్తు చేసింది. బ్యాటింగ్ కు అంతగా అనువుగా లేని వాంఖడే వికెట్ పై కోల్ కతా కెప్టెన్ అయ్యర్ ముందుగా కీలక టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకొన్నాడు. నిప్పులు చెరిగిన ఉమేశ్.. ముందుగా బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ తొలి […]

ఐపీఎల్ లో కోల్‌క‌తా టాప్ గేర్
X

టాటా ఐపీఎల్ 15వ సీజన్ గ్రూపులీగ్ లో మాజీ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తిరుగులేని విజయం సాధించింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ముగిసిన లోస్కోరింగ్ పోరులో కింగ్స్ పంజాబ్ ను 6 వికెట్లతో చిత్తు చేసింది. బ్యాటింగ్ కు అంతగా అనువుగా లేని వాంఖడే వికెట్ పై కోల్ కతా కెప్టెన్ అయ్యర్ ముందుగా కీలక టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకొన్నాడు.

నిప్పులు చెరిగిన ఉమేశ్..
ముందుగా బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ తొలి ఓవర్ నుంచే కోల్ కతా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ప్రతాపం చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుత సీజన్లో అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్న ఉమేశ్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో పంజాబ్ ను దెబ్బ మీద దెబ్బ కొడుతూ కోలుకోనివ్వకుండా చేశాడు. కెప్టెన్ కమ్ డాషింగ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఒక్క పరుగుకే పెవీలియన్ దారి పట్టాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 16, లివింగ్ స్టోన్ 19, హర్ ప్రీత్ బ్రార్ 14 పరుగులకు అవుట్ కాగా.. రాజపక్సా 31 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రబాడా 16 బాల్స్ లో 25 పరుగులు సాధించడంతో పంజాబ్ నామమాత్రపు స్కోరైనా సాధించగలిగింది. ఉమేశ్ యాదవ్ తన కోటా 4 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టడంతో పంజాబ్ ఇన్నింగ్స్ 18.2 ఓవర్లలో కేవలం 137 పరుగులకే ముగిసింది.

యాండ్రీ రసెల్ బాదుడే బాదుడు..
పంజాబ్ ను 137 పరుగులకే కుప్పకూల్చిన కోల్ కతా..138 పరుగుల స్వల్పలక్ష్యంతో చేజింగ్ కు దిగింది. ఓపెనర్లు అజింక్యా రహానే, వెంకటేశ్ అయ్యర్ చక్కటి ఆరంభాన్ని ఇవ్వడంలో విఫలమయ్యారు. అయితే.. వన్ డౌన్లో బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 26, సామ్ బిల్లింగ్ జట్టును ఆదుకొన్నారు. పంజాబ్ లెగ్ స్పిన్నర్ రాహుల్ చహార్ మేడిన్ ఓవర్ తో పాటు వెంట వెంటనే 2 కీలక వికెట్లు పడగొట్టడంతో కోల్ కతా 61 పరుగులకే 4 వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది. ఇదే సమయంలో క్రీజులోకి అడుగుపెట్టిన డాషింగ్ ఆల్ రౌండర్ యాండ్రీ రస్సెల్ తన వీరబాదుడు బ్యాటింగ్ తో శివమెత్తిపోయాడు. తాను ఎదుర్కొన్న తొలిబంతి నుంచే తగ్గేదే లేదు అన్నట్లుగా బ్యాట్ ఝళిపించాడు.

కేవలం 31 బాల్స్ లోనే 2 బౌండ్రీలు, 8 సిక్సర్లతో 70 పరుగుల నాటౌట్ స్కోరుతో మ్యాచ్ ను ఏకపక్షంగా మార్చాడు. రస్సెల్ గ్రౌండ్ నలుమూలలకూ అలవోకగా సిక్సర్లు బాదుతుంటే.. వాంఖడే స్టేడియం చిన్నదిగా మారిపోయింది. కోల్ కతా జట్టు 14.3 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికే విజేత నిలిచింది. పంజాబ్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ 2 వికెట్లు, రబాడా, స్మిత్ చెరో వికెట్ పడగొట్టారు. కోల్ కతా విజయంలో ప్రధానపాత్ర వహించిన రస్సెల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ప్రస్తుత సీజన్ లో పంజాబ్ కు రెండురౌండ్లలో ఇది తొలి ఓటమి కాగా..కోల్ కతాకు రెండో గెలుపు కావడం విశేషం. రెండునెలలపాటు సాగే ఐపీఎల్ లీగ్ దశలో ప్రతి జట్టు 14 మ్యాచ్ ల చొప్పున ఆడాల్సి ఉంది.

First Published:  1 April 2022 9:23 PM GMT
Next Story