Telugu Global
National

జంబో కేబినెట్ తోపాటు సీఎంగా యోగి ప్రమాణ స్వీకారం..

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి వరుసగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లక్నోలోని అటల్‌ బిహారీ వాజ్‌ పేయి స్టేడియంలో జరిగిన యోగి పట్టాభిషేక కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌ నాథ్‌ సింగ్‌.. తదితరులు హాజరయ్యారు. యూపీ రాజకీయ చరిత్రలో ఒక సీఎం అధికారం నిలబెట్టుకుని రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడం 37 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి […]

జంబో కేబినెట్ తోపాటు సీఎంగా యోగి ప్రమాణ స్వీకారం..
X

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి వరుసగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లక్నోలోని అటల్‌ బిహారీ వాజ్‌ పేయి స్టేడియంలో జరిగిన యోగి పట్టాభిషేక కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌ నాథ్‌ సింగ్‌.. తదితరులు హాజరయ్యారు. యూపీ రాజకీయ చరిత్రలో ఒక సీఎం అధికారం నిలబెట్టుకుని రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడం 37 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇద్దరు డిప్యూటీ సీఎంలు..
గతంలో మాదిరిగానే ఈ సారి కూడా ఇద్దరికి ఉపముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు యోగి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. కేశవ్‌ ప్రసాద్ మౌర్య కు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు. బ్రిజేశ్‌ పాఠక్‌ కూడా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

జంబో కేబినెట్..
గత కేబినెట్ లో ఉన్న 24 మందిని యోగి పక్కనపెట్టారు. తాజాగా 52 మంది మంత్రులతో యోగి జంబో కేబినెట్‌ ఏర్పాటు చేసుకున్నారు. వీరిలో 18 మందికి కేబినెట్‌ హోదా, 14 మందికి స‍్వతంత్ర హోదా కల్పించారు. 20 మంది సహాయ మంత్రులకు కేబినెట్ లో చోటిచ్చారు. ప్రధాన మంత్రి కార్యాలయంలో పనిచేసిన ఏకే శర్మకు యోగి కేబినెట్ లో చోటు దక్కింది. ఈ మాజీ ఐఏఎస్ కి మంత్రి పదవి ఇచ్చారు యోగీ. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జితిన్ ప్ర‌సాదకు కేబినెట్ హోదా ద‌క్కింది. బీజేపీకి సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలమున్నా కూడా.. మిత్ర పక్షాలకు ప్రాధాన్యతనిచ్చింది. అప్నా ద‌ళ్ (సోనేలాల్‌) పార్టీ నేత ఆశిష్ ప‌టేల్‌, నిషాద్ పార్టీ అధినేత సంజ‌య్ నిషాద్‌ ల‌కు కేబినెట్ లో చోటిచ్చారు యోగి. మైనార్టీ వర్గం నుంచి ఒకరికి చోటు దక్కింది. దానిష్ అజాద్ యోగి కేబినెట్ లో ఉన్న ఏకైక మైనార్టీ మంత్రి. గతంలో ఉత్తరాఖండ్ గవర్నర్ గా పనిచేసిన బేబి రాణి మౌర్య కూడా యోగి కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

First Published:  25 March 2022 11:13 AM GMT
Next Story