Telugu Global
National

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎమ్మెల్యేల తనిఖీలు..

సహజంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు చేస్తుంది, తనిఖీలు చేసి అవినీతి అధికారుల భరతం పడుతుంది. కానీ పంజాబ్ లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఆ బాధ్యత భుజానికెత్తుకున్నారు. సీఎం ప్రమాణ స్వీకారానికి ముందే వారు రంగంలోకి దిగారు. నలుగురు ఎమ్మెల్యేలు అప్పుడే హడావిడి మొదలు పెట్టారు. మన్జిత్ సింగ్, దేవేందర్ జిత్ సింగ్, అమ్రిత్ పాల్ సింగ్, అమన్ దీప్ కౌర్ అరోరా.. వీరంతా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి అక్కడ […]

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎమ్మెల్యేల తనిఖీలు..
X

సహజంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు చేస్తుంది, తనిఖీలు చేసి అవినీతి అధికారుల భరతం పడుతుంది. కానీ పంజాబ్ లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఆ బాధ్యత భుజానికెత్తుకున్నారు. సీఎం ప్రమాణ స్వీకారానికి ముందే వారు రంగంలోకి దిగారు. నలుగురు ఎమ్మెల్యేలు అప్పుడే హడావిడి మొదలు పెట్టారు. మన్జిత్ సింగ్, దేవేందర్ జిత్ సింగ్, అమ్రిత్ పాల్ సింగ్, అమన్ దీప్ కౌర్ అరోరా.. వీరంతా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి అక్కడ తనిఖీలు చేపడుతున్నారు. అవినీతి అధికారుల భరతం పడతామంటూ హెచ్చరిస్తున్నారు. పంజాబ్ లో ప్రభుత్వం మారింది, పద్ధతులు మార్చుకోవాలంటూ అధికారులకు హితబోధ చేస్తున్నారు.

మార్పు కోసమా..? అత్యుత్సాహమా..?
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం తర్వాత అక్కడ కొత్తరకం పాలనను ప్రజలు గమనిస్తారని అధినేత కేజ్రీవాల్ ప్రకటించారు. భగవంత్ సింగ్ మన్ నేతృత్వంలో సమర్థవంతమైన కేబినెట్ ఏర్పాటు చేస్తామన్నారు. అయితే అప్పుడే ఎమ్మెల్యేలు ఇలా రంగంలోకి దిగి ఆఫీసుల్లో తనిఖీలు చేయడం కొంతమందికి నచ్చడంలేదు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం దీన్ని సమర్థించుకుంటోంది. మార్పు కావాలంటోంది. తనిఖీలకు వెళ్లిన ఎమ్మెల్యేలు అవినీతి అధికారుల భరతం పడతామంటున్నారు. ఏళ్లతరబడి ఒకేచోట తిష్టవేసుకున్నవారిని వెంటనే బదిలీ చేస్తామని హెచ్చరిస్తున్నారు.

నెక్స్ట్ టార్గెట్ వాళ్లే..
ప్రస్తుతం అవినీతి అధికారుల్ని టార్గెట్ చేసిన ఎమ్మెల్యేలు.. తమ నెక్స్ట్ టార్గెట్ కాంట్రాక్టర్లేనంటున్నారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ వర్క్ లు చేసేవారు అవినీతికి పాల్పడుతున్న ఉదాహరణలు పంజాబ్ లో కోకొల్లలు అంటున్నారు ఆప్ ఎమ్మెల్యేలు. పనుల్లో నాణ్యత ఉండటం లేదని, ప్రతి పనిలోనూ అవినీతి మేత మేసేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ నెక్స్ట్ టార్గెట్ కాంట్రాక్టర్లేనని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టబోమని, ప్రభుత్వ కార్యాలయాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, అదే సమయంలో అవినీతిపరుల భరతం పడతామంటున్నారు ఎమ్మెల్యేలు.

First Published:  16 March 2022 12:43 AM GMT
Next Story