Telugu Global
NEWS

పొత్తుకి సిద్ధమన్న జనసేన.. విమర్శలతో విరుచుకుపడ్డ వైసీపీ..

2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తే లేదంటూ జనసేన ఆవిర్భావ సభలో ప్రకటించారు పవన్ కల్యాణ్. బీజేపీ తనకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని, ఆ ప్రకారం తాను రాజకీయ రణరంగంలో ముందుకెళ్తానని అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేస్తాయని పరోక్షంగా హింట్ ఇచ్చేశారు పవన్ కల్యాణ్. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలన్న పవన్ కల్యాణ్, […]

పొత్తుకి సిద్ధమన్న జనసేన.. విమర్శలతో విరుచుకుపడ్డ వైసీపీ..
X

2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తే లేదంటూ జనసేన ఆవిర్భావ సభలో ప్రకటించారు పవన్ కల్యాణ్. బీజేపీ తనకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని, ఆ ప్రకారం తాను రాజకీయ రణరంగంలో ముందుకెళ్తానని అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేస్తాయని పరోక్షంగా హింట్ ఇచ్చేశారు పవన్ కల్యాణ్. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలన్న పవన్ కల్యాణ్, ఏపీలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని, ఎండోమెంట్ చట్టంలో మార్పులు తీసుకురావాలన్నారు.

మినీ మేనిఫెస్టో..
పార్టీ ఆవిర్భావ సభే అయినా, ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నా కూడా ఇప్పటం సభలో పవన్ ఓ మినీ మేనిఫెస్టో ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే అన్ని కులాలు, వర్గాలకు ఆశ్రయమిచ్చే అభ్యుదయ రాజధానిగా అమరావతిని తీర్చి దిద్దుతామన్నారు. అప్పుల ఊబిలో ఉన్న ఏపీకి రుణ విముక్తి కల్పించి, ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెడతామన్నారు. అల్పాదాయ వర్గాలు, తెల్ల రేషన్‌ కార్డుదారులకు ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు. జనసేన సౌభాగ్య పథకం పేరిట, నిరుద్యోగులు కలసి ప్రారంభించే వ్యాపారాలకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని కొనసాగిస్తామన్నారు. ప్రైవేటు రంగంతో కలిపి ఏటా 5 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.

జనసైనికులకు ఓ దండం..
జనసేన ఆవిర్భావ సభ పూర్తవగానే వైసీపీనుంచి కూడా గట్టిగా కౌంటర్లు పడ్డారు. మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్.. ప్రెస్ మీట్లు పెట్టి పవన్ పై ధ్వజమెత్తారు. జనసైనికులకు ఓ దండం అని, మరోసారి కమ్మల్ని భుజాన మోసేందుకు సిద్ధమయ్యారని అన్నారు మంత్రి పేర్ని నాని. కేవలం చంద్రబాబుని అధికారంలోకి తెచ్చేందుకే పవన్ కల్యాణ్ పనిచేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీలో జరిగిన అభివృద్ధి ఆయనకు కనపడలేదా అని ప్రశ్నించారు. ఆయన సింగిల్ కాదని, మింగిల్ అని సెటైర్లు వేశారు.

మంత్రి వెల్లంపల్లిని వెల్లుల్లి అంటూ పవన్ తన సభలో సెటైర్లు వేశారు. దీంతో వెల్లంపల్లి కూడా పవన్ కి ఘాటుగా బదులిచ్చారు. పవన్ కల్యాణ్, గబ్బర్ సింగ్ కాదని రబ్బర్ సింగ్ అని మండిపడ్డారు. తన చుట్టూ ఏముందో ఆయనకు తెలియడంలేదని కళ్లకు గంతలు కట్టుకున్న గాంధారి పవన్ అంటూ విమర్శించారు. పవన్ రాజకీయాల్లో ఊసరవెల్లి లాంటివారని, అలాంటి కమెడియన్లను తాము పట్టించుకోమన్నారు. జగన్ జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.

First Published:  14 March 2022 9:21 PM GMT
Next Story