Telugu Global
Cinema & Entertainment

జాన‌ప‌ద‌, సినీ గేయ‌ర‌చ‌యిత కందికొండ క‌న్నుమూత‌

ప్రముఖ జాన‌ప‌ద‌, సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి(49) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్స‌ర్‌తో బాధప‌డుతున్న కందికొండ ఈ రోజు సాయంత్రం మృతి చెందారు. కందికొండ స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామం. చదువుకునే రోజుల నుంచే జాన‌ప‌ద గేయాలు, క‌విత‌లు రాయడం నేర్చుకున్న కందికొండకు ఇంట‌ర్‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. చక్రి సాన్నిహిత్యంతో సినిమా సాహిత్యం వైపు మ‌ళ్లారు. తొలిసారిగా `ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం` సినిమాలో మళ్లి కూయవే గువ్వా పాటతో త‌న […]

జాన‌ప‌ద‌, సినీ గేయ‌ర‌చ‌యిత కందికొండ క‌న్నుమూత‌
X

ప్రముఖ జాన‌ప‌ద‌, సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి(49) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్స‌ర్‌తో బాధప‌డుతున్న కందికొండ ఈ రోజు సాయంత్రం మృతి చెందారు. కందికొండ స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామం. చదువుకునే రోజుల నుంచే జాన‌ప‌ద గేయాలు, క‌విత‌లు రాయడం నేర్చుకున్న కందికొండకు ఇంట‌ర్‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. చక్రి సాన్నిహిత్యంతో సినిమా సాహిత్యం వైపు మ‌ళ్లారు. తొలిసారిగా 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' సినిమాలో మళ్లి కూయవే గువ్వా పాటతో త‌న ప్ర‌స్థానాన్ని మొద‌లుపెట్టారు.

దర్శకుడు పూరీ జగన్నాథ్ చిత్రాల‌కు ఎక్కువ‌గా పాట‌లు రాశారు కందికొండ‌. సినీరంగంలో అడుగుపెట్టిన నాటి నుంచి 12 ఏళ్ల‌లో 13 వంద‌ల‌కు పైగా పాట‌లు రాశారు. తెలంగాణ మాండ‌లికంపై కందికొండ‌కు ప‌ట్టు ఎక్కువ‌. రాష్ట్రంలోని వృత్తులు, ప్ర‌దేశాలు గురించి బాగా తెలిసిన వ్య‌క్తి. కందికొండ రాసిన బతుకమ్మ పాటలు ప్రతి గ్రామంలోనూ మార్మోగాయి. తెలంగాణ యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయటం ఆయన దిట్ట‌. మట్టిమనుషుల వెతలను, పల్లె బతుకు చిత్రాన్ని అద్దంప‌ట్టేలా ప‌దాలు రాసి దాన్ని పాట‌గా మలిచి.. అంద‌రి మ‌న్న‌న‌లు పొందారు కందికొండ‌.

కందికొండ రాసిన అసైదులా హార‌తీ నుంచి బోనాలు, బ‌తుక‌మ్మ పాటలు ఎంతో ఫేమ‌స్‌. పాటలు రాయ‌డంలో, ప‌దప్ర‌యోగంలో కందికొండ దిట్ట అయినా.. ఆర్థికంగా మాత్రం వెన‌కే ఉన్నారు. గ‌త కొంత‌కాలంగా క్యాన్స‌ర్ వ్యాధితో కందికొండ బాధ‌ప‌డుతున్నారు. ఆస్ప‌త్రి ఖర్చులు భారీగా చెల్లించాల్సి వస్తుండటంతో ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవలే కుటుంబానికి ఆర్థిక భరోసా అందించారు.

కందికొండ యాద‌గిరి మృతిపై సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నేత‌లు సంతాపం తెలిపారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కందికొండ మృతికి సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు.

First Published:  12 March 2022 8:27 AM GMT
Next Story