Telugu Global
NEWS

పోలవరానికి మరో కొత్త డెడ్ లైన్.. ఏడాదిలోపు పూర్తి చేస్తామన్న కేంద్ర మంత్రి..

పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కేంద్రం మరో కొత్త డెడ్ లైన్ పెట్టింది. ఏడాది లోపు ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్. ఏపీ సీఎం జగన్ తో కలసి ఆయన పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించారు. పునరావాస పనుల్ని స్వయంగా పరిశీలించారు. నిర్వాసితులతో స్వయంగా మాట్లాడారు. వారికి పునరావాసంతోపాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి పైసా కేంద్రానిదే.. పోలవరం నిర్మాణానికి అవసరమైన ప్రతి పైసా కేంద్రమే […]

పోలవరానికి మరో కొత్త డెడ్ లైన్.. ఏడాదిలోపు పూర్తి చేస్తామన్న కేంద్ర మంత్రి..
X

పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కేంద్రం మరో కొత్త డెడ్ లైన్ పెట్టింది. ఏడాది లోపు ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్. ఏపీ సీఎం జగన్ తో కలసి ఆయన పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించారు. పునరావాస పనుల్ని స్వయంగా పరిశీలించారు. నిర్వాసితులతో స్వయంగా మాట్లాడారు. వారికి పునరావాసంతోపాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి పైసా కేంద్రానిదే..
పోలవరం నిర్మాణానికి అవసరమైన ప్రతి పైసా కేంద్రమే ఇస్తుందని, ప్రాజెక్ట్ ని కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని అన్నారు గజేంద్ర షెకావత్. పోలవరం నిర్వాసితులకు నేరుగా నగదు బదిలీ చేయాలన్న ముఖ్యమంత్రి అభ్యర్థన ప్రకారమే చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై 15 రోజులకోసారి 3నెలల పాటు ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తానని హామీ ఇచ్చారు. పీపీఏ అధికారులతో పాటు పోలవరం అధికారులంతా సమీక్షలకు హాజరు కావాలన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రికి తరలిస్తామన్నారు. ప్రాజెక్టుపై ఒక డ్యాష్‌బోర్డు ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు.

సకాలంలో బిల్లులు చెల్లించాలి..
పోలవరం ప్రాజెక్టు మొత్తాన్ని ఒకే కాంపొనెంట్‌ గా పరిగణించి ప్రతి 15 రోజులకోసారి బిల్లులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం జగన్. చేసిన పనులకు కూడా బిల్లులు రావడంలేదని చెప్పారు. పోలవరం అథారిటీ బిల్లులను సరిగా అప్ లోడ్ చేయకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుకు, కేంద్రం రీయింబర్సుమెంట్ కి భారీ వ్యత్యాసం ఉంటోందని అన్నారాయన. తాగునీటి విభాగం ఖర్చులనూ ప్రాజెక్టులో భాగంగా పరిగణించాలని కోరారు జగన్.

లక్ష్యం సాకారమయ్యేనా..?
పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకూ పరస్పర ఆరోపణలకు దిగిన విషయం తెలిసిందే. నిధులు సకాలంలో రావడంలేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తే.. సరైన అంచనాలు ఇవ్వడంలేదని, సహకారం లేదని కేంద్రం తాత్సారం చేస్తూ వచ్చింది. ప్రస్తుతం గజేంద్ర షెకావత్ పర్యటనతో ప్రాజెక్ట్ పనులపై తిరిగి ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే చాలా డెడ్ లైన్లకు కాలపరిమితి తీరిపోగా.. సరికొత్తగా కేంద్ర మంత్రి నోటివెంట మరో డెడ్ లైన్ వినిపిస్తోంది. దీనికయినా కేంద్రం కట్టుబడి ఉంటుందా..? కట్టడం పూర్తవుతుందా..? వేచి చూడాలి.

First Published:  4 March 2022 9:49 PM GMT
Next Story