Telugu Global
National

అక్కడ యుద్ధ విమానాల క్యూ.. ఇక్కడ పెట్రోల్ బంకుల ముందు క్యూ..

ప్రపంచంలో ఏ దేశానికి జలుబు చేసినా.. భారత్ కి తుమ్ములు రావడం గ్యారెంటీ. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలు భారత్ ని అంతలా ప్రభావితం చేస్తుంటాయని అంటారు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా భారత్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆమాటకొస్తే ఐరోపా దేశాలు కూడా చమురు, గ్యాస్ కొరతతో అల్లాడిపోతున్నాయి. ఇటు భారత్ లో కూడా ఇంధన ధరలు భారీగా పెరుగుతాయన్న వార్తల నేపథ్యంలో వినియోగదారులు పెట్రోల్ బంకుల ముందు క్యూ కడుతున్నారు. సహజంగా ప్రభుత్వం […]

అక్కడ యుద్ధ విమానాల క్యూ.. ఇక్కడ పెట్రోల్ బంకుల ముందు క్యూ..
X

ప్రపంచంలో ఏ దేశానికి జలుబు చేసినా.. భారత్ కి తుమ్ములు రావడం గ్యారెంటీ. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలు భారత్ ని అంతలా ప్రభావితం చేస్తుంటాయని అంటారు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా భారత్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆమాటకొస్తే ఐరోపా దేశాలు కూడా చమురు, గ్యాస్ కొరతతో అల్లాడిపోతున్నాయి. ఇటు భారత్ లో కూడా ఇంధన ధరలు భారీగా పెరుగుతాయన్న వార్తల నేపథ్యంలో వినియోగదారులు పెట్రోల్ బంకుల ముందు క్యూ కడుతున్నారు.

సహజంగా ప్రభుత్వం పెట్రోల్ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటిస్తే ముందు రోజు భారత్ లో పెట్రోల్ బంకుల ముందు పెద్ద పెద్ద క్యూలు కనపడతాయి. కానీ ఈసారి పెట్రోల్ రేటు పెరుగుతుందన్న వార్తలతోనే క్యూలు మొదలయ్యాయి. ఓవైపు రష్యా నుంచి ఉక్రెయిన్ కి యుద్ధవిమానాలు వరుస కడితే.. భారత్ లో పెట్రోల్ బంకుల ముందు క్యూలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి రష్యానుంచి మనకు క్రూడ్ ఆయిల్ సరఫరా కాదు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ సరఫరాకు వచ్చే ఆటంకం కూడా లేదు. కానీ యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధర పెరగడంతో భారత్ లో కూడా ఆందోళన మొదలైంది.

ఏడేళ్ల గరిష్టానికి క్రూడ్ ఆయిల్..
ఉక్రెయిన్‌ పై రష్యా దాడులతో క్రూడ్ ఆయిల్‌ ధరలు ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. బ్యారెల్‌ రేటు 104 డాలర్లపైకి చేరింది. 2014 ఆగస్టు 14 తర్వాత ఈ స్థాయికి పెరగడం ఇదే మొదలు. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే క్రూడ్ ఆయిల్‌ రేటు 150 డాలర్లకు చేరే అవకాశముందని అంటున్నారు. రెండేళ్ల క్రితం.. 2020 ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య ముడిచమురు రేటు బ్యారెల్‌ కు 39.3 డాలర్లుగా ఉంది. బ్యారెల్ రేటు భారీగా తగ్గినా.. భారత్ లో మాత్రం పెట్రోల్ రేట్లు తగ్గలేదు. ఆ లాభాన్నంతా కేంద్రం తన జేబులో వేసుకుంది. తీరా ఇప్పుడు బ్యారెల్ రేట్లు పెరిగే సరికి మాత్రం రేట్లు పెంచే ఆలోచనలో ఉంది కేంద్రం.

ఎన్నికల తర్వాతే అన్నీ..
ప్రస్తుతానికి ఎంత వత్తిడి వచ్చినా ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు పూర్తయ్యే వరకు కేంద్రం పెట్రోల్ రేట్లు పెంచే సాహసం చేయదనే విషయం మాత్రం వాస్తవం. అలా ఎన్నికల పోలింగ్ ముగియడం, ఇలా రేట్లు పెంచడం రెండూ ఒకేసారి జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే భారత్ లో బల్క్ ఇంధనం ధరలు భారీగా పెరిగాయి. రిటైల్ లో మాత్రం ఆ రేటు ఇంకా పెరగలేదు. బల్క్ రేట్లు పెంచారు కాబట్టి, కచ్చితంగా రాబోయే రోజుల్లో రిటైల్ రేట్లు కూడా పెంచుతారనే అనుమానం బలపడుతోంది.

First Published:  24 Feb 2022 9:30 PM GMT
Next Story