Telugu Global
NEWS

ఏప్రిల్ 2నుంచి కొత్త జిల్లాల పేరుతో పాలన.. అభ్యంతరాలపై కలెక్టర్లదే తుది నిర్ణయం..

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకోసం ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల అభ్యంతరాలు, అసంతృప్తులు పెల్లుబికినా.. ఎక్కడా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఏప్రిల్ 2నుంచి కొత్త జిల్లాల పేరుతోనే పాలన మొదలవుతుందని మరోసారి స్పష్టం చేశారు అధికారులు. ఇప్పటి వరకు వచ్చిన అభ్యంతరాలపై సమీక్ష నిర్వహించిన అధికారులు.. మార్చి 3 వరకు ఫిర్యాదులు, సూచనలు స్వీకరిస్తామన్నారు. అభ్యంతరాల పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీ.. తొలిసారిగా 4 జిల్లాల కలెక్టర్లతో విజయవాడలో సమావేశమైంది. కలెక్టర్లదే తుది […]

ఏప్రిల్ 2నుంచి కొత్త జిల్లాల పేరుతో పాలన.. అభ్యంతరాలపై కలెక్టర్లదే తుది నిర్ణయం..
X

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకోసం ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల అభ్యంతరాలు, అసంతృప్తులు పెల్లుబికినా.. ఎక్కడా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఏప్రిల్ 2నుంచి కొత్త జిల్లాల పేరుతోనే పాలన మొదలవుతుందని మరోసారి స్పష్టం చేశారు అధికారులు. ఇప్పటి వరకు వచ్చిన అభ్యంతరాలపై సమీక్ష నిర్వహించిన అధికారులు.. మార్చి 3 వరకు ఫిర్యాదులు, సూచనలు స్వీకరిస్తామన్నారు. అభ్యంతరాల పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీ.. తొలిసారిగా 4 జిల్లాల కలెక్టర్లతో విజయవాడలో సమావేశమైంది.

కలెక్టర్లదే తుది నిర్ణయం..
ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై 1400 అభ్యంతరాలు జిల్లా కలెక్టర్ల వద్దకు చేరాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలో ఉంచాలని, నర్సాపురాన్ని జిల్లాగా ఉంచాలని కోరుతూ ఎక్కువ సూచనలు వచ్చాయి. పేర్లు, జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ల గురించి ఎక్కువ అభ్యంతరాలు వచ్చాయన్నారు అధికారులు. సహేతుక కారణాలుంటే రెవెన్యూ డివిజన్లను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మార్చి 3వరకు వచ్చే ఫిర్యాదులను స్వీకరించి వాటిని వడపోసి, ప్రభుత్వానికి చేర్చే బాధ్యత పూర్తిగా కలెక్టర్లపైనే ఉంది. మార్చి 10లోపు కలెక్టర్లు వీటిపై నిర్ణయం తీసుకుని, సహేతుకంగా ఉన్నవాటిని ప్రభుత్వానికి తెలుపుతారు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ విడుదలవుతుంది.

కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు..
ఇప్పటి వరకు జిల్లాల్లో కలెక్టరేట్ భవన సముదాయాల్లో కాకుండా మిగతా చోట్ల కూడా కొన్ని కార్యాలయాలున్నాయి. అలా కాకుండా.. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లా కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా ఇంటిగ్రేడెట్ కలెక్టరేట్ భవనాలను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆ ఆదేశాల ప్రకారం ప్రత్యేక డిజైన్‌ తో 3 నుంచి 4 లక్షల చదరపు అడుగుల్లో వీటిని నిర్మించబోతున్నట్టు తెలిపారు కలెక్టర్లు. ఆర్కిటెక్చర్‌ కన్సల్టెంట్‌ ను నియమించి నిర్మాణాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వ భవనాలు, భూముల్లోనే కొత్త కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటవుతాయన్నారు అధికారులు. తప్పనిసరైతేనే ప్రైవేటు భవనాలు చూస్తున్నామని చెప్పారు.

First Published:  23 Feb 2022 9:48 PM GMT
Next Story