Telugu Global
National

వ్యవసాయ భూమి తగ్గుతోంది.. ఉత్పత్తి పెరుగుతోంది..

భారత్ లో ఏడాదికేడాది వ్యవసాయ భూమి క్రమక్రమంగా తగ్గిపోతోంది. పొలాలన్నీ ఇళ్ల స్థలాలకోసం ఏర్పాటు చేసిన లే అవుట్లుగా మారిపోతున్నాయి. నగరీకరణ, పట్టణీకరణ పెరిగిపోతోంది. వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాలతో వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో పంట భూమిని కాస్తా నివాసయోగ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు అన్నదాతలు. అది లాభసాటి కూడా కావడంతో వ్యవసాయ భూమి తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. అయితే భారత్ లో సాగు భూమి తగ్గుతున్నా దిగుబడులు పెరగడం మాత్రం విశేషం. వరి అత్యథికం.. గతంలో ఎప్పుడూ […]

వ్యవసాయ భూమి తగ్గుతోంది.. ఉత్పత్తి పెరుగుతోంది..
X

భారత్ లో ఏడాదికేడాది వ్యవసాయ భూమి క్రమక్రమంగా తగ్గిపోతోంది. పొలాలన్నీ ఇళ్ల స్థలాలకోసం ఏర్పాటు చేసిన లే అవుట్లుగా మారిపోతున్నాయి. నగరీకరణ, పట్టణీకరణ పెరిగిపోతోంది. వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాలతో వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో పంట భూమిని కాస్తా నివాసయోగ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు అన్నదాతలు. అది లాభసాటి కూడా కావడంతో వ్యవసాయ భూమి తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. అయితే భారత్ లో సాగు భూమి తగ్గుతున్నా దిగుబడులు పెరగడం మాత్రం విశేషం.

వరి అత్యథికం..
గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ స్థాయిలో దిగుబడులు వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. 2021-22 ముందస్తు అంచనాల ప్రకారం ఈసారి దిగుబడులు 316.06 మిలియన్ టన్నులకు చేరుకుంటాయి. వీటిలో అత్యథికంగా వరి దిగుబడి కనిపిస్తోంది. ఈ ఏడాది 127.93 మిలియన్ టన్నుల వరి దిగుబడి అవుతుందని అంచనా. ఆ తర్వాతి స్థానం గోధుమలది. దేశవ్యాప్తంగా 111.32 మిలియన్ టన్నుల గోధుమలు ఈ ఏడాది చేతికందుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ చెబుతోంది. నూనె గింజలు 37.15 మిలియన్ టన్నులు, మొక్కజొన్న 32.42 మిలియన్ టన్నులు, పప్పు దినుసులు 26.96 మిలియన్ టన్నులుగా ఉంటాయని అంచనా. దేశవ్యాప్తంగా తృణ ధాన్యాల వినియోగం పెరగడంతో ఈ ఏడాది వాటి ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. తృణధాన్యాల దిగుబడి 49.86 మిలియన్ టన్నులుగా ఉంటుందని అంచనా.

రికార్డ్ బ్రేక్..
గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో పంటల దిగుబడి లేదని చెబుతోంది కేంద్రం. కరోనా కష్టకాలం ఎదురైనా రైతులు వ్యవసాయానికి దూరం కాలేదని, వ్యవసాయ కూలీల కొరత ఏర్పడినా, కమతాల విస్తీర్ణం తగ్గినా కూడా దిగుబడుల విషయంలో ఆశాజనక ఫలితాలు ఉంటాయని చెబుతోంది.

వ్యవసాయ కమతాలకు, దిగుబడులకు పోలిక ఎలా లేదో.. ఆహార పదార్థాల ధరల పెరుగుదలకు, సగటు కుటుంబ బడ్జెట్ కేటాయింపులకు కూడా అలాగే పోలిక లేకపోవడం విశేషం. గతంలో భారత్ లోని ఓ సగటు గ్రామీణ కుటుంబం తమ ఆదాయంలో 72 శాతాన్ని ఆహార అవసరాలకోసం ఖర్చు పెడితే.. ఇప్పుడది 50శాతం కంటే దిగువకు పడిపోయింది. పట్టణాల్లో సగటున ఓ కుటుంబం 50ఏళ్ల క్రితం ఆహారంకోసం 64.5 శాతం ఖర్చు పెడితే.. ఇప్పుడది 40శాతం కంటే దిగువకు చేరుకుంది. ఆహార పదార్థాల ఉత్పత్తి, వినియోగం, వాటిపై ప్రజలు పెడుతున్న ఖర్చు విషయంలో గణాంకాల మధ్య పొంతన ఎప్పుడూ కుదరదనేది మాత్రం వాస్తవం. అయితే కరోనావంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత్ లో ఆహార పదార్ధాల దిగుబడి కొత్త రికార్డులను అందుకోబోతుండటం మాత్రం సంతోషకరమైన విషయం.

First Published:  16 Feb 2022 9:29 PM GMT
Next Story