Telugu Global
National

పండగల ఎఫెక్ట్: మూడు రెట్లు పెరిగిన విమాన చార్జీలు

గతంలో భారత్ లో పండగల సీజన్ వచ్చిందంటే.. ముఖ్యంగా బస్సు, రైలు చార్జీల గురించి మాట్లాడుకునేవారు. అప్పట్లో పండగల సమయంలో కూడా విమాన ప్రయాణంలో పెద్దగా రద్దీ ఉండేది కాదు. కానీ కాలం మారింది. అవకాశం ఉంటే విమాన ప్రయాణాలపైనే ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ దేశీయ విమానయాన సంస్థల సంఖ్య, సర్వీసుల సంఖ్య పెరగడంతో ప్రయాణాలు కూడా పెరిగాయి. తాజాగా పండగల సీజన్ మొదలు కావడంతో విమాన చార్జీల సంఖ్య భారీగా పెరిగింది. దక్షిణాదిన ఒక […]

పండగల ఎఫెక్ట్: మూడు రెట్లు పెరిగిన విమాన చార్జీలు
X

గతంలో భారత్ లో పండగల సీజన్ వచ్చిందంటే.. ముఖ్యంగా బస్సు, రైలు చార్జీల గురించి మాట్లాడుకునేవారు. అప్పట్లో పండగల సమయంలో కూడా విమాన ప్రయాణంలో పెద్దగా రద్దీ ఉండేది కాదు. కానీ కాలం మారింది. అవకాశం ఉంటే విమాన ప్రయాణాలపైనే ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ దేశీయ విమానయాన సంస్థల సంఖ్య, సర్వీసుల సంఖ్య పెరగడంతో ప్రయాణాలు కూడా పెరిగాయి. తాజాగా పండగల సీజన్ మొదలు కావడంతో విమాన చార్జీల సంఖ్య భారీగా పెరిగింది. దక్షిణాదిన ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి చార్జీలు తడిసి మోపెడవుతున్నాయి.

ఇప్పుడు క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ రద్దీతో విమాన చార్జీలు అమాంతం పెరిగిపోయాయి.. తమిళనాడులోని చెన్నై నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే విమానాల్లో చార్జీలు భారీగా పెరిగాయి. చెన్నై నుంచి తూత్తుకుడి, మదురై, తిరుచ్చి వైపుగా వెళ్లే విమాన సర్వీసులపై ఆయా విమానయాన సంస్థలు రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నాయి. గతంలో ఆన్ లైన్ లో ఉన్న ధరలతో పోలీస్తే ఇప్పుడు మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు.

క్రిస్మస్‌ సందర్భంగా చెన్నై నుంచి తూత్తుకుడి, మదురై, తిరునవంతపురం, కొచ్చి వైపుగా వెళ్లే విమానాల టికెట్లు నెలరోజుల ముందుగానే బుక్ అయిపోయాయి. చెన్నై నుంచి ఆయా ప్రాంతాలకు రోజూ 14 విమాన సర్వీసులున్నాయి. సాధారణ సమయాల్లో చెన్నై నుంచి తూత్తుకుడికి టికెట్‌ ధర రూ.3,500గా ఉంటే.. ప్రస్తుతం అది రూ.10,500 నుంచి రూ.12 వేలుగా ఉంది. చెన్నై నుంచి మదురైకి రూ.3,500 ఉన్న చార్జీ.. ఇప్పుడు రూ.9,800కి పెరిగింది. చెన్నై నుంచి తిరువనంతపురం చార్జి 4వేల రూపాయలనుంచి 9వేలకు పెరిగింది. చెన్నై నుంచి కొచ్చికి కూడా మూడురెట్లు పెరిగింది. దీంతో ప్రయాణికులపై భారం పెరిగింది.

ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో దాదాపుగా ప్రయాణాలకోసం అందరూ వ్యక్తిగత వాహనాలనే వినియోగిస్తున్నారు. దూరప్రాంతాలయితే బస్సు, రైళ్లలో రద్దీని తట్టుకోలేమనే భయంతో ఉన్నారు చాలామంది. ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలు కూడా విమానయానంపై ఆసక్తి చూపిస్తున్నారు. రద్దీ పెరగడంతో సహజంగానే టికెట్ల రేట్లకు రెక్కలొచ్చాయి.

First Published:  24 Dec 2021 12:55 AM GMT
Next Story