Telugu Global
National

దేశ భద్రతకు ఇదో హెచ్చరిక -సుబ్రహ్మణ్య స్వామి..

సమకాలీన అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేసే ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి బిపిన్ రావత్ సహా 13మంది చనిపోయిన హెలికాప్టర్ దుర్ఘటనపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు దేశ భద్రతకు పెద్ద హెచ్చరిక అని అన్నారు. తమిళనాడులాంటి సేఫ్ జోన్ లో ఉన్నా కూడా మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ పేలడం ఆశ్చర్యకరం అని అన్నారాయన. అదే మార్గం ఎందుకు..? మరోవైపు ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. హెలికాప్టర్ ప్రమాదం జరిగిన […]

దేశ భద్రతకు ఇదో హెచ్చరిక -సుబ్రహ్మణ్య స్వామి..
X

సమకాలీన అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేసే ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి బిపిన్ రావత్ సహా 13మంది చనిపోయిన హెలికాప్టర్ దుర్ఘటనపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు దేశ భద్రతకు పెద్ద హెచ్చరిక అని అన్నారు. తమిళనాడులాంటి సేఫ్ జోన్ లో ఉన్నా కూడా మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ పేలడం ఆశ్చర్యకరం అని అన్నారాయన.

అదే మార్గం ఎందుకు..?
మరోవైపు ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతానికి చెన్నై, ఢిల్లీకి చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు చేరుకుని వివిధ అంశాలు పరిశీలిస్తున్నారు. ఆకాశమార్గంలో రెండు వేర్వేరు దారులున్నా ఈ మార్గాన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారని ఆరా తీస్తున్నారు. బిపిన్ రావత్.. వెల్లింగ్టన్ క్యాంప్ కి, రోడ్డు మార్గంలో వెళ్లడానికి కూడా ఏర్పాట్లు జరిగాయి. ఎయిర్ ఫోర్స్ ప్రొటోకాల్ అధికారులు, కాన్వాయ్ తోపాటు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కూడా సిద్ధం చేశారు. కానీ చివరి 10నిముషాల్లో హెలికాప్టర్లో వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై కూడా ఇంటెలిజెన్స్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

రావత్ దంపతుల మృతదేహాలకు నేడు అంత్యక్రియలు..
జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులిక మృతదేహాలను ప్రజల సందర్శనార్థం ఢిల్లీలోని కామరాజ్‌ మార్గ్‌ లోని రావత్‌ నివాసం వద్ద ఉంచుతారు. సాయంత్రం ఢిల్లీ కంటోన్మెంట్‌ లో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.

కష్టంగా మారిన మృతదేహాల గుర్తింపు..
ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా తగలబడిపోవడంతో.. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి. కొంతమంది శరీర భాగాలు చెల్లాచెదరయ్యాయి. దీంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. రక్తసంబంధీకుల డీఎన్ఏ ఆధారంగా మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలను మాత్రమే అధికారికంగా గుర్తించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మిగతా వారి విషయంలో డీఎన్ఏ రిపోర్ట్ కీలకంగా మారింది.

మృత్యువుతో పోరాడుతున్న కెప్టెన్ వరుణ్ సింగ్
హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక వ్యక్తి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కెప్టెన్ వరుణ్ సింగ్. తీవ్ర గాయాలపాలైన ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఈ ఏడాది శౌర్య చక్ర అవార్డు కూడా వరుణ్ సింగ్ అందుకున్నారు. వరుణ్ సింగ్ కోలుకున్న తర్వాత ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.

First Published:  9 Dec 2021 8:23 PM GMT
Next Story