Telugu Global
National

యూపీలో మురిగిపోతున్న కరోనా టీకాలు..

ఇప్పటి వరకూ కేంద్రం ఇచ్చిన నిధుల్ని వాడకుండా మురగబెట్టి వృథా చేసిన రాష్ట్రాలను చూశాం. కానీ తొలిసారిగా కేంద్రం ఇచ్చిన కొవిడ్ వ్యాక్సిన్ డోసుల్ని కూడా మురగబెట్టిన రాష్ట్రాలను చూసి బాధపడాల్సిన సందర్భం. వ్యాక్సిన్ వృథాలో బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్ అగ్రస్థానంలో ఉండటం మరీ విశేషం. అవును.. యూపీలో కొవిడ్ వ్యాక్సిన్ వృథా తారా స్థాయిలో ఉందని గణాంకాలు చెబుతున్నాయి. క‌రోనా వ్యాక్సిన్లను ఐదు రాష్ట్రాలు స‌రిగా ఉప‌యోగించుకోవ‌డం లేద‌ని, అందులో యూపీ మొదటి స్థానంలో […]

యూపీలో మురిగిపోతున్న కరోనా టీకాలు..
X

ఇప్పటి వరకూ కేంద్రం ఇచ్చిన నిధుల్ని వాడకుండా మురగబెట్టి వృథా చేసిన రాష్ట్రాలను చూశాం. కానీ తొలిసారిగా కేంద్రం ఇచ్చిన కొవిడ్ వ్యాక్సిన్ డోసుల్ని కూడా మురగబెట్టిన రాష్ట్రాలను చూసి బాధపడాల్సిన సందర్భం. వ్యాక్సిన్ వృథాలో బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్ అగ్రస్థానంలో ఉండటం మరీ విశేషం. అవును.. యూపీలో కొవిడ్ వ్యాక్సిన్ వృథా తారా స్థాయిలో ఉందని గణాంకాలు చెబుతున్నాయి. క‌రోనా వ్యాక్సిన్లను ఐదు రాష్ట్రాలు స‌రిగా ఉప‌యోగించుకోవ‌డం లేద‌ని, అందులో యూపీ మొదటి స్థానంలో ఉందని తేలింది.

కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఐదు రాష్ట్రాలు వ్యాక్సిన్ల‌ను సమర్థంగా ఉప‌యోగించుకోవ‌డం లేద‌ని తేలింది. అందులో మొద‌టి స్థానం సీఎం యోగి నేతృత్వంలోని యూపీదే. ఆ త‌ర్వాత మ‌హారాష్ట్ర‌, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, రాజ‌స్థాన్ రాష్ట్రాలున్నాయి. యూపీలో అత్య‌ధికంగా 2.9 కోట్ల వ్యాక్సిన్లు మురిగిపోయాయ‌ని తేలింది. సరైన సమయంలో వ్యాక్సిన్లను సమర్థంగా వాడకపోవడం, వయల్స్ ని ఓపెన్ చేసిన తర్వాత అనుమతించిన సమయంలోగా వాటిని పూర్తి చేయకపోవడం వల్ల ఇలా కొవిడ్ వ్యాక్సిన్లు వృథా అవుతాయి.

పశ్చిమ బెంగాల్ లో 2.5 కోట్ల వ్యాక్సిన్లు, మ‌హారాష్ట్ర‌లో 2.2 కోట్లు, బీహార్‌ లో 1.80 కోట్లు, రాజ‌స్థాన్‌లో 1.4 కోట్లు, త‌మిళ‌నాడులో 1.35 కోట్లు, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లో 1.1 కోట్ల వ్యాక్సిన్లు వాడకుండా మిగిలిపోయాయని, ఎక్స్ పయిరీ డేట్ అయిపోవడంతో వాటిని తిరిగి వాడే అవకాశం లేదని తేలింది.

మొద‌టి డోసు కూడా తీసుకోని ప్ర‌జ‌లు సైతం ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ‌గా ఉన్నార‌ని ప్ర‌భుత్వ గ‌ణాంకాల ద్వారా తెలుస్తోంది. దేశంలోనే ఎక్కువ జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్ లో 3.50 కోట్ల మంది ప్రజలు ఇంకా మొద‌టి డోసు తీసుకోలేదు. బీహార్‌లో 1.89 కోట్ల మంది, మ‌హారాష్ట్ర‌లో 1.71కోట్లు, త‌మిళ‌నాడులో 1.24 కోట్ల మంది ఇంకా మొద‌టి డోసును తీసుకోలేద‌ని తేలింది. టీకా అవసరం ఉన్నవారు ముందుకు రారు, మరోవైపు టీకాలు వృథాగా మిగిలిపోతున్నాయి. దీనిపై కొన్ని నెలల ముందే ఆరోగ్య శాఖ హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. వృథా టీకాలు ప్రభుత్వ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వెక్కిరిస్తున్నాయి.

First Published:  7 Dec 2021 9:51 PM GMT
Next Story