Telugu Global
National

థర్డ్ వేవ్ కి బెంగళూరులో బీజం..! భారత్ లో ఒమిక్రాన్ భయం భయం..

విదేశాలకే పరిమితం అనుకుంటున్న ఒమిక్రాన్ భారత్ లో కూడా తన ఉనికి చాటుకుంది. ఇప్పటికే రెండు కేసులు నిర్థారణ కాగా.. వారితో సన్నిహితంగా ఉన్న మరో ఐదుగురికి కొవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. అయితే ఈ ఐదుగురిలో ఉంది ఒమిక్రాన్ వేరియంటా కాదా అనేది నిర్థారణ కావాల్సి ఉంది. భారత్ లో థర్డ్ వేవ్ కి ఒమిక్రాన్ కారణం అయితే దానికి బీజం బెంగళూరులో పడినట్టే లెక్క. ఫస్ట్ వేవ్ సమయంలో అందరూ ఢిల్లీని టార్గెట్ చేశారు. […]

థర్డ్ వేవ్ కి బెంగళూరులో బీజం..! భారత్ లో ఒమిక్రాన్ భయం భయం..
X

విదేశాలకే పరిమితం అనుకుంటున్న ఒమిక్రాన్ భారత్ లో కూడా తన ఉనికి చాటుకుంది. ఇప్పటికే రెండు కేసులు నిర్థారణ కాగా.. వారితో సన్నిహితంగా ఉన్న మరో ఐదుగురికి కొవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. అయితే ఈ ఐదుగురిలో ఉంది ఒమిక్రాన్ వేరియంటా కాదా అనేది నిర్థారణ కావాల్సి ఉంది. భారత్ లో థర్డ్ వేవ్ కి ఒమిక్రాన్ కారణం అయితే దానికి బీజం బెంగళూరులో పడినట్టే లెక్క. ఫస్ట్ వేవ్ సమయంలో అందరూ ఢిల్లీని టార్గెట్ చేశారు. మతపరమైన ఓ కార్యక్రమానికి వచ్చినవారిలో అత్యథికులకు కొవిడ్ నిర్థారణ కావడంతో ఢిల్లీ కేంద్రంగా కరోనా పుట్టపగిలిందనే ప్రచారం జరిగింది. సెకండ్ వేవ్ సమయంలో ముంబైలో ఎక్కువ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు థర్డ్ వేవ్ భయాలు వెంటాడుతున్న వేళ, బెంగళూరు వార్తల్లో నిలిచింది.

ఒమిక్రాన్ వేరియంట్ వచ్చినవారిలో ఒకరు బెంగళూరుకి చెందిన డాక్టర్. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా అతనికి వైరస్ సోకింది. ప్రస్తుతం అతను కొవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు. అతనితో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న ముగ్గురికి, సెకండరీ కాంటాక్ట్ లో ఉన్న మరో ఇద్దరికి కొవిడ్ నిర్థారణ అయింది. అయితే వారికి సోకిన వేరియంట్ ఒమిక్రానా కాదా అనేది తేలాల్సి ఉంది. ఇక దక్షిణాఫ్రికానుంచి వచ్చిన మరో వ్యక్తికి కూడా ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు నిర్థారణ అయింది. అతనికి లక్షణాలు పెద్దగా లేవు, ఓ ప్రైవేట్ ల్యాబ్ లో ఇచ్చిన నెగెటివ్ సర్టిఫికెట్ ఆధారంగా అతను తిరిగి దుబాయ్ వెళ్లిపోవడం విశేషం. ఇప్పుడతని ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ విషయంలో అధికారులు తలలు పట్టుకున్నారు.

భారత్ సహా 30 దేశాల్లో ఒమిక్రాన్..
నవంబర్‌ 24న తొలిసారి రెండు దేశాల్లోఒమిక్రాన్‌ గా పిలుస్తున్న B.1.1.529 వేరియంట్‌ ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తించింది. దక్షిణాఫ్రికా, బోట్స్‌ వానాలో ఒకేరోజు ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. నవంబర్‌ 26న దీన్ని వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌ గా WHO ప్రకటించింది. ఆ తర్వాత నెదర్లాండ్‌, ఇజ్రాయిల్‌, హాంగ్‌ కాంగ్‌, బెల్జియంలో కూడా కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 2న భారత్ లో కూడా రెండు కేసులు వెలుగులోకి రావడంతో.. ఇప్పటి వరకూ మొత్తం 30 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించినట్టయింది. ఒమిక్రాన్ వేరియంట్ పై ఆందోళన మొదలవుతున్న క్రమంలోనే భారత్ అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కట్టుదిట్టం చేసి, విదేశాలనుంచి వచ్చేవారిపై నిఘా పెట్టినా ఫలితం లేకపోయింది. భారత్ లో ఫైనల్ గా ఒమిక్రాన్ ప్రవేశించింది. భారత్ లో ఒమిక్రాన్ పై అధికారిక ప్రకటన డిసెంబర్-2న విడుదలైనా.. నవంబర్ 20, 21న నమోదైన కేసులు ఈ కొత్తవేరియంట్ ని కలిగి ఉన్నాయని తేలడంతో.. దక్షిణాఫ్రికాకంటే ముందే ఇక్కడ ఒమిక్రాన్ వ్యాప్తి మొదలైందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించక ముందే ఈ వేరియంట్ చాలా దేశాల్లో విస్తరించి ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.

First Published:  2 Dec 2021 8:59 PM GMT
Next Story