Telugu Global
National

భారత్ లో తగ్గిన సంతానోత్పత్తి.. పురుషులకంటే స్త్రీల జనాభా అధికం..

దేశంలో తొలిసారిగా పురుషుల కంటే స్త్రీల సంఖ్య అధికంగా నమోదైంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2015-16లో భారత్ లో వెయ్యి మంది పురుషులకుగాను 991 మంది మహిళలు మాత్రమే ఉండగా, ఇప్పుడు స్త్రీల సంఖ్య పురుషులను దాటి 1020కి చేరింది. గత ఐదేండ్లలో లింగ నిష్పత్తి మెరుగుపడినట్లు ఈ సర్వే తెలిపింది. 1991 గణాంకాల ప్రకారం వెయ్యి మంది పురుషులకు గాను 927 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. 2005-06లో ఈ […]

భారత్ లో తగ్గిన సంతానోత్పత్తి.. పురుషులకంటే స్త్రీల జనాభా అధికం..
X

దేశంలో తొలిసారిగా పురుషుల కంటే స్త్రీల సంఖ్య అధికంగా నమోదైంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2015-16లో భారత్ లో వెయ్యి మంది పురుషులకుగాను 991 మంది మహిళలు మాత్రమే ఉండగా, ఇప్పుడు స్త్రీల సంఖ్య పురుషులను దాటి 1020కి చేరింది. గత ఐదేండ్లలో లింగ నిష్పత్తి మెరుగుపడినట్లు ఈ సర్వే తెలిపింది. 1991 గణాంకాల ప్రకారం వెయ్యి మంది పురుషులకు గాను 927 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. 2005-06లో ఈ సంఖ్య సమానం కాగా, ఆ తరువాత మళ్లీ తగ్గుతూ వచ్చింది. తాజా సర్వేలో లింగనిష్పత్తి లక్షద్వీప్‌ లో అత్యధికంగా 1187 ఉండగా, తెలంగాణలో 1049, ఆంధ్రప్రదేశ్‌ లో 1045గా ఉంది. జాతీయ సగటు 1020గా ఉంది. కరోనా పరిస్థితుల కారణంగా రెండు విడతల్లో ఈ సర్వే చేపట్టారు. తొలి విడత సర్వే గణాంకాలు గతేడాది డిసెంబర్ లో విడుదల కాగా.. రెండో విడత సర్వే పూర్తయిన తర్వాత మొత్తం గణాంకాలను తాజాగా విడుదల చేశారు.

తగ్గుతున్న సంతానోత్పత్తి..
2019-21కి సంబంధించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5లో మరిన్ని ఆసక్తికర విషయాలు కూడా వెల్లడయ్యాయి. దేశంలో సంతానోత్పత్తి రేటు(టీఎఫ్‌ఆర్‌) తగ్గుముఖం పడుతున్నట్టు సర్వేలో తేలింది. 2015-16లో టీఎఫ్ఆర్ 2.2గా ఉండగా, 2019-21లో అది 2 శాతానికి తగ్గినట్టు తేలింది. సంతానోత్పత్తి రేటు తొలిసారిగా రీప్లేస్‌ మెంట్‌ రేటు (2.1) కంటే దిగువకు పడిపోవడం విశేషం. అంటే ఇకపై జనాభా నియంత్రణకు ప్రభుత్వం బలవంతపు చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని పాపులేషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) తన అభిప్రాయాన్ని తెలిపింది.

బీహార్‌లో అత్యధికంగా 3.0 సంతానోత్పత్తి రేటు ఉంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, యూపీ, బీహార్‌, మణిపూర్‌, మేఘాలయ రాష్ర్టాల్లో టీఎఫ్‌ఆర్‌, రీప్లేస్‌మెంట్‌ రేటు కంటే ఎక్కువగా ఉంది. ఇక సిక్కింలో జాతీయ సగటు 2 కంటే తక్కువగా.. అత్యల్పంగా 1.1గా టీఎఫ్ఆర్ రేటు నమోదైంది. 18 ఏండ్ల లోపు వివాహం అయ్యే వారి శాతం ఐదేళ్ల కిత్రం 26.6 ఉండగా, 2019-21లో 23.3 శాతానికి తగ్గింది. ఇక దేశంలో కుటుంబ నియంత్రణ సాధానాలు వాడే వారి సంఖ్య పెరిగిందని ఈ సర్వే తెలిపింది. 15-19 ఏండ్ల మధ్య వయసు వారిలో అప్పటికే తల్లి అయిన వారు, లేదా గర్భంతో ఉన్న వారి శాతం కూడా బాగా తగ్గింది.

పోషకాహార లోపం..
ప్రభుత్వాలు పలు పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ దేశంలో ఇంకా పోషకాహార లోపం వంటి అరోగ్యపరమైన సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయని సర్వే వెల్లడించింది. పేద, మధ్యతరగతి వారు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, వీరికి ప్రభుత్వ పథకాలు అందడంలో అంతరాలున్నాయని తెలిపింది.

First Published:  25 Nov 2021 9:36 PM GMT
Next Story