Telugu Global
Others

వాట్సప్ కి ఏమైంది.. తిరిగి ఎందుకొచ్చింది..?

ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ సేవలు నిలిచిపోవడంతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. వాట్సప్ తోపాటు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ కూడా ఆగిపోవడంతో సోషల్ మీడియా పక్షులకి ఏం చేయాలో తోచలేదు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఏకబిగిన 7 గంటలసేపు వాట్సప్, ఇన్ స్టా, ఫేస్ బుక్ సేవలు ఆగిపోయాయి. సరిగ్గా రాత్రి 9గంటల 17నిముషాల తర్వాత వాట్సప్ ఆగిపోయింది. ఈ తెల్లవారు ఝామున 4గంటలనుంచి తిరిగి కొత్త మెసేజ్ లు మొదలయ్యాయి. ఇలా వాట్సప్ తిరిగి […]

వాట్సప్ కి ఏమైంది.. తిరిగి ఎందుకొచ్చింది..?
X

ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ సేవలు నిలిచిపోవడంతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. వాట్సప్ తోపాటు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ కూడా ఆగిపోవడంతో సోషల్ మీడియా పక్షులకి ఏం చేయాలో తోచలేదు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఏకబిగిన 7 గంటలసేపు వాట్సప్, ఇన్ స్టా, ఫేస్ బుక్ సేవలు ఆగిపోయాయి. సరిగ్గా రాత్రి 9గంటల 17నిముషాల తర్వాత వాట్సప్ ఆగిపోయింది. ఈ తెల్లవారు ఝామున 4గంటలనుంచి తిరిగి కొత్త మెసేజ్ లు మొదలయ్యాయి. ఇలా వాట్సప్ తిరిగి మొదలవడంతో.. అందరూ స్టేటస్ లు పెట్టి సంతోషం వ్యక్తపరిచారు. పెద్ద విపత్తునుంచి బయటపడినట్టు మెసేజ్ లు పెట్టుకున్నారు.

అసలేమైంది..?
వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టా సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడటం ఇదేమీ కొత్త కాదు. కానీ గతంలో 5 నిమిషాలు, 10 నిమిషాలు.. మహా అయితే గంట.. ఇలా నెట్ వర్క్ లు పనిచేయని ఉదాహరణలున్నాయి. కానీ ఈసారి మాత్రం 7గంటలపాటు ప్రపంచ వ్యాప్తంగా నెట్ వర్క్ లన్నీ ఆగిపోయాయి. అందులోనూ భారత్ లో రాత్రి 9గంటల తర్వాత వాట్సప్ మంచి పీక్ స్టేజ్ లో ఉంటుంది. భోజనం చేసి మంచమెక్కి చివరి సారిగా వాట్సప్ చాట్ చూసుకుని అందరికీ గుడ్ నైట్ చెప్పేసి పడుకోవడం చాలామందికి అలవాటు. మన స్టేటస్ ఎంతమంది చూశారా అని అందరూ రివ్యూ చేసుకునేది కూడా ఆ టైమ్ లోనే. సరిగ్గా అదే సమయంలో వాట్సప్ ఆగిపోవడంతో చాలామందికి పిచ్చెక్కినట్టైంది. టెక్నికల్ రీజన్ అని సర్దిచెప్పుకున్న నిర్వాహకులు తమ కస్టమర్లకు క్షమాపణలు చెప్పి, సహకరించినందుకు ధన్యవాదాలంటూ పోస్టింగ్ లు పెట్టారు.

“ప్రపంచ వ్యాప్తంగా మాపై ఆధారపడిన కోట్ల మంది ప్రజలకు, వ్యాపార కార్యకలాపాలు నడుపుతున్న వారికి క్షమాపణలు. నిలిచిపోయిన మా సేవలను పునరుద్ధరించడంతో తిరిగి ఆన్‌లైన్‌ కు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. మాతో సహకరించినందుకు ధన్యవాదాలు” అని ఫేస్‌బుక్‌ ట్విటర్‌లో పోస్టు చేయడం విశేషం.

ప్రత్యామ్నాయం ఏంటి..?
భారత్‌ లో దాదాపు 41 కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారులున్నారు. వాట్సప్‌ ను సుమారు 53 కోట్ల మంది వాడుతున్నారు. ఇన్‌ స్టాగ్రాం ఖాతాదారులు 21 కోట్ల పైనే ఉన్నారు. వీరంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఇవన్నీ ఆగిపోవడంతో అందరూ ఒక్కసారిగా ట్విట్టర్ లోకి వచ్చేశారు. ట్విట్టర్ అకౌంట్ ఉన్నా కూడా అందరూ ఎక్కువగా వాట్సప్, ఇన్ స్టా, ఫేస్ బుక్ ని మాత్రమే వాడుతుంటారు. కానీ అలాంటి వారంతా గంటలసేపు ట్విట్టర్ పైనే ఆధారపడాల్సిన సందర్భం వచ్చింది. ఫేస్ బుక్ పై లెక్కలేనన్ని ఫన్నీ మీమ్స్ వచ్చిపడ్డాయి. వాట్సప్ కి ప్రత్యామ్నాయం అయిన టెలిగ్రామ్ యాప్ ని కూడా చాటింగ్ కోసం చాలామంది వాడుకున్నారు. ఒక్కసారిగా మన ఫోన్లలోనుంచి ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టా మాయం అయితే ఎలా ఉంటుందో ఈ ఘటనతో ఓసారి అందరూ శాంపిల్ చూసేసినట్టయింది.

First Published:  4 Oct 2021 9:30 PM GMT
Next Story