Telugu Global
National

మోదీ వేవ్ ఒక్కటే సరిపోదు -యడ్డీ షాకింగ్ కామెంట్స్..

సీఎం పీఠం నుంచి దిగిపోయిన తర్వాత యడ్యూరప్పలో చాలా మార్పులొచ్చాయని చెబుతున్నారు కర్నాటక బీజేపీ నేతలు. తనని సీఎం కుర్చీనుంచి దించేసినా, తన కొడుక్కి మంత్రి పదవి వస్తుందని ఆశించి భంగపడ్డ యడ్యూరప్ప, రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలు పెట్టుకున్నారు. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన అధిష్టానంపై ధిక్కార ధోరణి ప్రదర్శిస్తూనే ఉన్నారు. తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ ఉన్నారు. ‘మోదీ వేవ్ ఒక్కటే సరిపోదు’ అంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కర్నాటక బీజేపీలో కలకలం రేపాయి. కర్నాటకలో […]

మోదీ వేవ్ ఒక్కటే సరిపోదు -యడ్డీ షాకింగ్ కామెంట్స్..
X

సీఎం పీఠం నుంచి దిగిపోయిన తర్వాత యడ్యూరప్పలో చాలా మార్పులొచ్చాయని చెబుతున్నారు కర్నాటక బీజేపీ నేతలు. తనని సీఎం కుర్చీనుంచి దించేసినా, తన కొడుక్కి మంత్రి పదవి వస్తుందని ఆశించి భంగపడ్డ యడ్యూరప్ప, రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలు పెట్టుకున్నారు. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన అధిష్టానంపై ధిక్కార ధోరణి ప్రదర్శిస్తూనే ఉన్నారు. తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ ఉన్నారు. ‘మోదీ వేవ్ ఒక్కటే సరిపోదు’ అంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కర్నాటక బీజేపీలో కలకలం రేపాయి. కర్నాటకలో త్వరలో జరగబోతున్న రెండు నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం వ్యూహ కమిటీ భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలతోపాటు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాలంటే మోదీ వేవ్ ఒక్కటే సరిపోదన్నారు యడ్యూరప్ప. రాష్ట్రంలో అభివృద్ది జరగాలని, అప్పుడే బీజేపీ గెలిచే అవకాశముంటుందని చెప్పారు.

ఆ రెండు చోట్ల బీజేపీకి కష్టమే.
కర్నాటకలో హనగల్, సింద్గి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒకటి బీజేపీ సిటింగ్ స్థానం కాగా, రెండోది గతంలో జేడీఎస్ గెలిచిన నియోజకవర్గం. ఈ రెండింటినీ ఇప్పుడు బీజేపీ కైవసం చేసుకోవాలనుకుంటోంది. సీఎంగా యడ్యూరప్ప తప్పుకున్న తర్వాత బీజేపీ ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికలివి. ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మై నాయకత్వానికి కూడా ఇది తొలిపరీక్ష. ఈ దశలో రెండు చోట్లా బీజేపీకి వ్యతిరేకంగా యడ్యూరప్ప వర్గం పనిచేయబోతోందని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఓడిపోతే.. అప్పుడు పార్టీకి తన అవసరం తెలిసొస్తుందనేది యడ్యూరప్ప అంచనా. అందుకే ఆయన ఇప్పటినుంచే వ్యతిరేక వ్యాఖ్యలతో కలకలం రేపుతున్నారు.

రాష్ట్రంలో బీజేపీ విజ‌యం సాధించాలంటే అభివృద్ది ప‌నులు త‌ప్ప‌నిస‌రి అంటున్నారు యడ్యూరప్ప. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ మేల్కొన్న‌ద‌ని, ఆ పార్టీ ఎత్తుల‌ను చిత్తుచేయాలంటే అభివృద్దితోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. కేవలం మోదీపైనే నమ్మకం పెట్టుకుంటే కుదరదని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌గ‌ల‌గాల‌ని అన్నారు యడ్యూరప్ప. రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడటం వరకు ఓకే కానీ, మోదీ పేరు ప్రస్తావిస్తూ మోదీ వేవ్ గురించి చర్చను మొదలు పెట్టడం మాత్రం కర్నాటక బీజేపీలో కలకలానికి కారణం అయింది.

First Published:  21 Sep 2021 11:15 PM GMT
Next Story