Telugu Global
NEWS

ఈ ఏడాది కూడా ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు..

తిరుమలలో సర్వ దర్శనాలకు నాంది పలకడం, రోజు రోజుకీ దర్శన టికెట్ల కోటా పెంచుకుంటూ పోతామని టీటీడీ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా వేడుకగానే జరుగుతాయని అంచనా వేశారు భక్తులు. స్వామివారి బ్రహ్మోత్సవ వైభవాన్ని కళ్లారా చూసేందుకు కొండకు వెళ్లాలని అనుకుంటున్నారు. అయితే టీటీడీ మాత్రం బ్రహ్మోత్సవాల విషయంలో కాస్త కట్టుదిట్టంగానే ఉంది. ఈ ఏడాది కూడా కొవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తామని ప్రకటించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. […]

ఈ ఏడాది కూడా ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు..
X

తిరుమలలో సర్వ దర్శనాలకు నాంది పలకడం, రోజు రోజుకీ దర్శన టికెట్ల కోటా పెంచుకుంటూ పోతామని టీటీడీ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా వేడుకగానే జరుగుతాయని అంచనా వేశారు భక్తులు. స్వామివారి బ్రహ్మోత్సవ వైభవాన్ని కళ్లారా చూసేందుకు కొండకు వెళ్లాలని అనుకుంటున్నారు. అయితే టీటీడీ మాత్రం బ్రహ్మోత్సవాల విషయంలో కాస్త కట్టుదిట్టంగానే ఉంది. ఈ ఏడాది కూడా కొవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తామని ప్రకటించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. తిరుమాడ వీధుల్లో ఊరేగింపులు లేకుండా వాహన సేవలను కేవలం మండపం వరకే పరిమితం చేస్తామని చెప్పారు. ఆన్ లైన్ టికెట్ల జారీలో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని, వారం లోగా ఆ సమస్యలను పరిష్కరించి సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం అయ్యేలా చర్యలు చేపడతామన్నారు.

అగరుబత్తీల వివాదంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
టీటీడీ పరిధిలోని దేవస్థానాల్లో ఉపయోగించిన పూలతో అగరుబత్తీలు తయారు చేసి ఇటీవల వాటిని భక్తులకు విక్రయిస్తున్నారు. అయితే ఇది ఆగమ విరుద్ధమని, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మేడూరి సాయికుమార్‌ అనే పూజారి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దేవతామూర్తులను పూజించిన పూలను మరో రకంగా వినియోగించడానికి వీల్లేదని, టీటీడీ చర్యలను కట్టడి చేసేలా కోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు.

పిటిషనర్‌ వాదనలను టీటీడీ తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. శ్రీవారికి వినియోగించిన పూలను పూల బావిలోనే వేస్తున్నారని, టీటీడీ ఆధ్వర్యంలోని ఇతర దేవస్థానాల్లో వినియోగించిన పూలను మాత్రమే అగరుబత్తీల తయారీకి వాడుతున్నామని వివరించారు. పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారం చేసుకుని ఈ వ్యాజ్యం వేశారని అన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. అగరు బత్తీల తయారీ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోబోదని ఉత్తర్వులిచ్చింది, పిల్‌ ను తోసిపుచ్చింది. ఇందులో ఎలాంటి ప్రజాప్రయోజనాలు లేవని స్పష్టం చేసింది. వినియోగించిన పూలతో అగరుబత్తీలు తయారుచేయడంపై అభ్యంతరం ఉంటే.. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లొచ్చని పిటిషనర్ కి చెప్పింది.

First Published:  17 Sep 2021 8:50 PM GMT
Next Story