Telugu Global
NEWS

రేవంత్​ దూకుడుకు కాంగ్రెస్​ చెక్​?

పీసీసీ అధ్యక్షుడయ్యాక రేవంత్​రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తొలుత రేవంత్​ వరుసగా సీనియర్​ నేతలను కలుసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు. అయితే రేవంత్​ వ్యవహార శైలి కొందరు కాంగ్రెస్​ సీనియర్​ నేతలకు నచ్చడం లేదని టాక్​. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. సొంత ఎజెండాను ఫిక్స్​ చేసుకొని ముందుకు సాగుతున్నారని.. సీనియర్లతో మాట మాత్రం కూడా చెప్పకుండా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని పలువురు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కాంగ్రెస్​ అధిష్ఠానం తాజాగా తీసుకున్న […]

రేవంత్​ దూకుడుకు కాంగ్రెస్​ చెక్​?
X

పీసీసీ అధ్యక్షుడయ్యాక రేవంత్​రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తొలుత రేవంత్​ వరుసగా సీనియర్​ నేతలను కలుసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు. అయితే రేవంత్​ వ్యవహార శైలి కొందరు కాంగ్రెస్​ సీనియర్​ నేతలకు నచ్చడం లేదని టాక్​. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. సొంత ఎజెండాను ఫిక్స్​ చేసుకొని ముందుకు సాగుతున్నారని.. సీనియర్లతో మాట మాత్రం కూడా చెప్పకుండా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని పలువురు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కాంగ్రెస్​ అధిష్ఠానం తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్​ అధిష్ఠానం తాజాగా టీపీసీసీ పరిధిలో రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)ని ప్రకటించింది. ఈ కమిటీకి మాణిక్కం ఠాగూర్​ చైర్మన్​గా వ్యవహరిస్తారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్‌ ఇందుకు సంబంధించి ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. కమిటీలో పలువురు సీనియర్లకు స్థానం కల్పించారు. రేవంత్​ వ్యతిరేకులుగా ముద్రపడ్డ కొందరికి ఈ కమిటీలో చోటు దక్కింది.

కమిటీ కన్వీనర్‌గా మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ, పీఏసీ సభ్యులుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పీసీసీ మాజీ చీఫ్‌లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, హన్మంతరావు, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు రేణుకా చౌదరి, బలరాం నాయక్‌, పోడెం వీరయ్య, సీతక్క, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, మహేష్ కుమార్‌గౌడ్‌, అజారుద్దీన్‌, గీతారెడ్డి, కమిటీల చైర్మన్లు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్‌, దామోదర్‌ రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్‌ కృష్ణన్‌, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్‌, వంశీచంద్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు.

గతంలో టీపీసీసీ సంబంధించిన కోర్​ కమిటీ ఉండేది. రాజకీయ నిర్ణయాలు ఈ కమిటీ ఆధ్వర్యంలో తీసుకొనేవారు. ప్రస్తుతం అధిష్ఠానం పీఏసీని నియమించింది. కాంగ్రెస్​ పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకొనేందుకు అవకాశం లేదని చెప్పేందుకే ఈ కమిటీని తీసుకొచ్చినట్టు సమాచారం.

మరోవైపు ఇటీవల రేవంత్​ వ్యవహారంపై కాంగ్రెస్​ సీనియర్ల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో వారిని బుజ్జగించేందుకు ఈ కమిటీని రూపొందించినట్టు టాక్​. కమిటీలో రేవంత్​ వ్యతిరేకులుగా ముద్రపడ్డ చాలా మందికి స్థానం దక్కడం గమనార్హం. ఇక నుంచి రేవంత్​ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకోలేడని.. కమిటీలో చర్చించాకే.. అక్కడ ఏకాభిప్రాయం సాధించాక ముందుకు వెళ్లాల్సి ఉంటుందని కొందరు సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్​ పార్టీలో ఈ కమిటీపై అంతర్గతంగా జోరుగా చర్చ నడుస్తోంది.

First Published:  13 Sep 2021 12:04 PM GMT
Next Story