Telugu Global
NEWS

తెలంగాణలో బోసిపోయిన బడి.. హాజరు అత్యల్పం..

తెలంగాణలో స్కూళ్ల పునఃప్రారంభంపై హైకోర్టు తీర్పు తీవ్ర ప్రభావం చూపింది. చివరి నిమిషంలో పిల్లలు, తల్లిదండ్రుల్ని బలవంతపెట్టొద్దంటూ హైకోర్టు తీర్పునివ్వడంతో.. చాలామంది స్వచ్ఛందంగా వెనకడుగు వేశారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో చాలా వరకు మూతపడే కనిపించాయి. మొత్తమ్మీద తొలిరోజు తెలంగాణలో బడి బోసిపోయింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 52.22 లక్షల మంది విద్యార్థులు ఉండాలి. అయితే పాఠశాలలు తిరిగి తెరుచుకున్న తొలిరోజు వీరిలో కేవలం 11.37 లక్షలమంది మాత్రమే హాజరయ్యారు. ప్రభుత్వ […]

తెలంగాణలో బోసిపోయిన బడి.. హాజరు అత్యల్పం..
X

తెలంగాణలో స్కూళ్ల పునఃప్రారంభంపై హైకోర్టు తీర్పు తీవ్ర ప్రభావం చూపింది. చివరి నిమిషంలో పిల్లలు, తల్లిదండ్రుల్ని బలవంతపెట్టొద్దంటూ హైకోర్టు తీర్పునివ్వడంతో.. చాలామంది స్వచ్ఛందంగా వెనకడుగు వేశారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో చాలా వరకు మూతపడే కనిపించాయి. మొత్తమ్మీద తొలిరోజు తెలంగాణలో బడి బోసిపోయింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 52.22 లక్షల మంది విద్యార్థులు ఉండాలి. అయితే పాఠశాలలు తిరిగి తెరుచుకున్న తొలిరోజు వీరిలో కేవలం 11.37 లక్షలమంది మాత్రమే హాజరయ్యారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతం కేవలం 27.45 కాగా, ప్రైవేటులో మరీ దారుణంగా ఉంది. కేవలం 18.35 శాతం మంది విద్యార్థులే ప్రైవేట్ స్కూళ్లకు హాజరయ్యారు. అటు ఏపీలో పాఠశాలలు తెరచిన తొలిరోజే దాదాపు 60శాతం హాజరు కనిపించగా, తెలంగాణలో మాత్రం 21.77 శాతం మంది పిల్లలు మాత్రమే తొలిరోజు స్కూల్ బ్యాగ్ తగిలించుకోవడం విశేషం.

తల్లిదండ్రుల్లో భయం..
హైస్కూల్ హాజరు ఓ మాదిరిగా ఉన్నా.. ప్రాథమిక పాఠశాల్లో మాత్రం హాజరు మరీ తక్కువగా ఉంది. కొన్నిచోట్ల తరగతికి ఒకరు, ఇద్దరు చొప్పున విద్యార్థులు హాజరయ్యారు. చాలామంది ఆన్ లైన్ లో పాఠాలు వినడానికే ఆసక్తి చూపించారు. ఆన్ లైన్ బోధన వల్ల కొంతమంది సొంత ఊళ్లలో ఉండిపోవడంతో స్కూళ్లు తెరిచినా వారంతా పాఠశాలలకు రాలేకపోయారు. ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీలలో దాదాపు 30శాతం తెరచుకోలేదు. ప్రైవేటు విద్యా సంస్థలు తెరవాలా వద్దా అనే విషయాన్ని యాజమాన్యాలకే వదిలేయాలని కోర్టు చెప్పడంతో.. వారంతా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. చాలా చోట్ల వ్యాన్ సౌకర్యం లేకపోవడంతో పిల్లలు స్కూళ్లకు వెళ్లలేకపోయారు.

కాలేజీ హాజరు మరీ దారుణం..
కాలేజీ విద్యార్థులు ఎప్పుడు బంక్ కొడదామా అనే ఉద్దేశంలోనే ఉంటారు. కాలేజీకని చెప్పి ఇంట్లోనుంచి బయలుదేరినా.. గమ్యస్థానం మాత్రం మధ్యలోనే మారిపోతుంది. ఈ క్రమంలో ఇప్పుడు కొవిడ్ తర్వాత ఇంటర్ కాలేజీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో తొలిరోజు 17 శాతం మంది మాత్రమే ఫస్ట్ ఇయర్ విద్యార్థులు హాజరయ్యారు. సెకండ్ ఇయర్ విషయానికొస్తే హాజరు శాతం 15కి పడిపోయింది. చాలామంది ఆన్ లైన్ క్లాసులనే ఇష్టపడుతుండటంతో హాజరు పూర్తిగా తగ్గిపోయింది. వారం రోజుల్లో ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు.

5కంటే ఎక్కువ కేసులు నమోదైతే స్కూల్ మూసేస్తాం..
కొవిడ్ తర్వాత పిల్లల్ని పాఠశాలలకు పంపించడంపై తల్లిదండ్రులకు ఎలాంటి భయాందోళనలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు. పిల్లలకు వైరస్‌ సోకినా తీవ్రత, ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం చాలా స్వల్పమని భరోసా ఇచ్చారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సహా ఎవరూ మాస్కు ధరించకుండా తరగతి గదిలోకి ప్రవేశించకూడదనే నిబంధనను కఠినంగా అమలుచేస్తున్నామని అన్నారు. విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ ఐదుమందికంటే ఎక్కువగా కొవిడ్ బారిన పడితే, ఆ పాఠశాలను 5రోజులపాటు మూసివేస్తామని చెప్పారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులున్న బడిలో ఇలాంటి పరిస్థితి తలెత్తితే.. ఆ తరగతి గది వరకూ కొవిడ్‌ నిబంధనలను అమలుచేస్తామన్నారు.

First Published:  1 Sep 2021 9:07 PM GMT
Next Story