Telugu Global
National

తస్మదీయులపై సీబీ'ఐ'

సీబీఐ పంజరపు చిలక అంటూ ఇటీవలే మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లాగా సీబీఐకి కూడా స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలంటూ, దానికోసం చట్టంలో తగిన మార్పులు చేయాలని కూడా కేంద్రానికి సూచించింది. అయితే సీబీఐని కేంద్రం ఏ అవసరాలకు, ఎలా వాడుతుందో అందరికీ తెలిసిన విషయమే. మద్రాస్ హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు చేసిన రెండ్రోజుల్లోనే, బీజేపీ వైరిపక్షాలు అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలపై సీబీఐ […]

తస్మదీయులపై సీబీఐ
X

సీబీఐ పంజరపు చిలక అంటూ ఇటీవలే మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లాగా సీబీఐకి కూడా స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలంటూ, దానికోసం చట్టంలో తగిన మార్పులు చేయాలని కూడా కేంద్రానికి సూచించింది. అయితే సీబీఐని కేంద్రం ఏ అవసరాలకు, ఎలా వాడుతుందో అందరికీ తెలిసిన విషయమే. మద్రాస్ హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు చేసిన రెండ్రోజుల్లోనే, బీజేపీ వైరిపక్షాలు అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలపై సీబీఐ ఫోకస్ పెట్టడం గమనార్హం.

బెంగాల్ అల్లర్లపై సీబీఐ విచారణ..
పశ్చిమ బెంగాల్‌ లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింస ఘటనల కేసులను సీబీఐకి అప్పగించి విచారణ జరిపించాలని కోల్‌ కతా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. అత్యాచారం, హత్య కేసులన్నీ సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశాలు జారీచేసింది. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని స్పష్టం చేసింది. కోర్టు తీర్పుని బీజేపీ స్వాగతించగా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామని చెప్పింది. బెంగాల్ అల్లర్లపై స్థానిక పోలీసులతో విచారణ జరిపిస్తున్నామని, సీబీఐ జోక్యం అనవసరం అని తృణమూల్ కాంగ్రెస్ నేతలంటున్నారు.

ఢిల్లీ ప్రభుత్వంపై సీబీఐ ఎంక్వయిరీ..
అటు ఢిల్లీ ప్రభుత్వంపై సీబీఐ దర్యాప్తుకి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. వెయ్యి సీఎన్జీ లో-ఫ్లోర్‌ బస్సుల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంపై ప్రాథమిక విచారణ జరపాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చే ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) గత ఏడాది మార్చిలో 1,000 సీఎన్జీ లో-ఫ్లోర్ బస్సుల కొనుగోలుకోసం టెండర్ పిలిచింది. నాలుగు నెలల తరువాత ఈ బస్సులకు వార్షిక నిర్వహణ ఒప్పందం కోసం మరో టెండర్ జారీ చేసింది. వెయ్యి బస్సుల కొనుగోలుకు రూ.875 కోట్లు, 12 ఏళ్ల పాటు వాటి నిర్వహణ కోసం రూ.3,500 కోట్లకు ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని ఢిల్లీలోని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ కు ఫిర్యాదు చేయగా ఆయన సిఫార్సు మేరకు విజిలెన్స్ దర్యాప్తు జరిగింది. ఈ దర్యాప్తులో ఢిల్లీ రవాణా సంస్థ తప్పేమీ లేదని తేలింది. టెండర్లు, బస్సుల కొనుగోలులో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పినా, విధాన పరమైన లోపాలున్నట్టు విజిలెన్స్ కమిటీ తేల్చింది. దీంతో ఈ లోపాలపై విచారణ జరపాలంటూ కేంద్ర హోంశాఖ సీబీఐని ఆదేశించింది.

అయితే ఇది కేంద్రం వేధింపుల్లో భాగమేనని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపించింది. బస్సుల కొనుగోలుపై బీజేపీ చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, దర్యాప్తు కమిటీ కూడా క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పింది. కక్షసాధింపులో భాగంగానే సీబీఐ విచారణ చేపట్టారని ఆరోపిస్తున్నారు ఆప్ నేతలు.

First Published:  19 Aug 2021 3:34 PM GMT
Next Story