Telugu Global
NEWS

తిరుమలలో ఇక సంప్రదాయ భోజనం..

తిరుమల అన్న ప్రసాద కేంద్రం లో అతి త్వరలో సంప్రదాయ భోజనాన్ని భక్తులకు అందించనున్నారు. భోజనాన్ని అందుబాటు ధరలతో ప్రారంభించనున్నట్లు టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మా రెడ్డి తెలిపారు. తిరుమలలో సుమారు ఐదు వందల ఏళ్ల కిందటే అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటిలా కాదు.. అప్పుడు తిరుమలకు వచ్చే భక్తులు తక్కువే. రోడ్డు సౌకర్యం లేకపోవడం.. మెట్లమార్గం కూడా సరిగా లేకపోవడంతో భక్తులు కొండలు, గుట్టలు ఎక్కుతూ తిరుమల కొండపైకి చేరుకునే […]

తిరుమలలో ఇక సంప్రదాయ భోజనం..
X

తిరుమల అన్న ప్రసాద కేంద్రం లో అతి త్వరలో సంప్రదాయ భోజనాన్ని భక్తులకు అందించనున్నారు. భోజనాన్ని అందుబాటు ధరలతో ప్రారంభించనున్నట్లు టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మా రెడ్డి తెలిపారు. తిరుమలలో సుమారు ఐదు వందల ఏళ్ల కిందటే అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటిలా కాదు.. అప్పుడు తిరుమలకు వచ్చే భక్తులు తక్కువే. రోడ్డు సౌకర్యం లేకపోవడం.. మెట్లమార్గం కూడా సరిగా లేకపోవడంతో భక్తులు కొండలు, గుట్టలు ఎక్కుతూ తిరుమల కొండపైకి చేరుకునే వారు. తిరుమల ప్రాంతాన్ని పాలించే రాజులు వారికి భోజన సౌకర్యం కల్పించేవారు.

ఆ తర్వాత తిరుమల మెట్ల మార్గాన్ని బాగు చేయడం, రోడ్డు సౌకర్యం ఏర్పడిన తర్వాత క్రమేణా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తిరుమలలో నిత్యన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పట్లో రోజుకు రెండు వేల మంది భక్తులకు అన్నదానం కోసం టోకెన్లు ఇచ్చేవారు. ఇక 2011లో తిరుమల ఆలయానికి సమీపంలో తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన భవనాన్ని ప్రారంభించారు. ఎంతో విశాలమైన ఈ భవనంలో రోజుకు లక్ష మందికి పైగా భక్తులకు అన్నదానం చేసేలా ఏర్పాట్లు చేశారు.

ఆ కేంద్రంలో రోజుకు 60 నుంచి 70 వేల మంది భక్తులకు అన్నదానం చేస్తుంటారు. వారాంతాల్లో లక్షకుపైగా భక్తులు వచ్చినా అన్నదానం చేస్తుంటారు. ప్రస్తుతం తిరుమలలో అన్నం, పప్పు, కొబ్బరి పచ్చడి, రసం, సాంబార్, మజ్జిగ, బిస్మిల్లా బాత్ అందిస్తుంటారు. ఉదయం పూట అల్పాహారంగా చపాతీ కూడా వడ్డిస్తున్నారు.

అందుబాటు ధరల్లో సంప్రదాయ భోజనం

తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన భవనం లో అతి త్వరలో సంప్రదాయం భోజనం కూడా ప్రారంభించనున్నారు. అతి తక్కువ ధరకే ఈ భోజనాన్ని అందిస్తారు. గో ఆధారిత సాగు ద్వారా పండించిన సరుకులతో తయారు చేసే సంప్రదాయం భోజనం అందుబాటులోకి రానుంది. ఈ కార్యక్రమం మరో మరో 15 రోజుల నుంచి నెల రోజుల్లోగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

First Published:  16 Aug 2021 2:54 AM GMT
Next Story