Telugu Global
National

పుస్తకాలు చదివితే దేశభక్తి పెరుగుతుందా..?

దేశనాయకులకు సంబంధించిన సినిమాలు చూస్తేనో, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నవారి జీవిత చరిత్రలు చదివితేనో రోమాలు నిక్కబొడుచుకోవడం సహజం, అప్పటికప్పుడు దేశభక్తి ఉప్పొంగడం అంతకంటే సహజం. అయితే అలాంటి ప్రేరణ, ఉద్రేకం కాసేపటి తర్వాత చల్లబడుతుంది. చదివింది అయినా, చూసింది అయినా నిజ జీవితానికి అన్వయించుకుంటేనే ఎవరికైనా ఉపయోగం. అయితే కనీసం అలాంటి ప్రయత్నం కూడా చేయకపోతే ఎలా అంటున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా దేశభక్తి అనే పాఠ్యాంశాన్ని ప్రవేశపెడుతున్నారు. రెండేళ్ల […]

పుస్తకాలు చదివితే దేశభక్తి పెరుగుతుందా..?
X

దేశనాయకులకు సంబంధించిన సినిమాలు చూస్తేనో, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నవారి జీవిత చరిత్రలు చదివితేనో రోమాలు నిక్కబొడుచుకోవడం సహజం, అప్పటికప్పుడు దేశభక్తి ఉప్పొంగడం అంతకంటే సహజం. అయితే అలాంటి ప్రేరణ, ఉద్రేకం కాసేపటి తర్వాత చల్లబడుతుంది. చదివింది అయినా, చూసింది అయినా నిజ జీవితానికి అన్వయించుకుంటేనే ఎవరికైనా ఉపయోగం. అయితే కనీసం అలాంటి ప్రయత్నం కూడా చేయకపోతే ఎలా అంటున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా దేశభక్తి అనే పాఠ్యాంశాన్ని ప్రవేశపెడుతున్నారు. రెండేళ్ల క్రితమే దీనికి సంబంధించిన పాఠ్యప్రణాళిక రూపొందించారు. ఇప్పుడు దాన్ని అమలులో పెట్టారు.

జ్ఞానం, విలువలు, ప్రవర్తన అనే మూడు ఈ దేశభక్తి కరికులమ్ లో ఉంటాయి. దేశభక్తి ని బోధించేందుకు ప్రత్యేక పీరియడ్ ఉంటుంది. సోషల్ సైన్స్ టీచర్ కి ఇది అదనపు సబ్జెక్ట్ గా ఇస్తారు. చిన్నప్పటినుంచే విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యంగా దీన్ని ప్రవేశ పెట్టారు. ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నవారికి నేరుగా రాత పరీక్ష ఉండదు. విద్యార్థుల ప్రవర్తన ఆధారంగానే మార్కులు ఉంటాయి.

ప్రస్తుత కాంపిటీటివ్ యుగంలో పరీక్షలు, మార్కులే విద్యార్థి ప్రతిభకు కొలమానం. దానికి అనుగుణంగానే విద్యాబోధన జరుగుతోంది. పరీక్షల్లో రాదు అనే అంశం ఏదయినా పక్కనపెట్టేస్తారు. మార్కుల అవసరం లేదు అనే ఏ విషయాన్ని కూడా స్కూల్ లో చెప్పరు. అందుకే ప్రైవేట్ స్కూల్స్ లో డ్రిల్ పీరియడ్ ఉండదు. డ్రాయింగ్, క్రాఫ్ట్.. లాంటి సబ్జెక్ట్ లు క్రమక్రమంగా కనుమరుగయ్యాయి. ఈ దశలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దేశభక్తి పేరుతో కొత్త ప్రయత్నం చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో స్వాతంత్రోద్యమ చరిత్ర పాఠ్యాంశంగా ఉంది. స్థానిక భాషల్లో స్వాతంత్రోద్యమ నాయకుల పరిచయం ఉంది. దేశానికి వారు చేసిన సేవలు, త్యాగాలు కూడా అందులో బోధిస్తారు. అయితే దేశభక్తి పేరుతో కొత్తగా ఓ సబ్జెక్ట్ ప్రవేశ పెట్టే విషయంలో కేజ్రీవాల్ ముందడుగు వేశారు. పుస్తకాలు చదివితే దేశభక్తి పెరుగుతుందా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే, కేజ్రీవాల్ సరికొత్త ప్రయత్నం చేశారని అంటున్నారు.

First Published:  15 Aug 2021 1:17 AM GMT
Next Story