Telugu Global
National

బాంబే హైకోర్టుకి సోనూసూద్ వివరణ..

కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న రోజులవి. ప్రాణాపాయ స్థితిలో రెమిడిసెవిర్ దివ్యౌషధం అనే ప్రచారం జోరుగా సాగడంతో చాలామంది ఆ ఇంజెక్షన్లకోసం నానా అగచాట్లు పడ్డారు. వేల రూపాయలు ఖర్చు చేసినా బ్లాక్ మార్కెట్లో దొరకని స్థితి. చివరకు కలెక్టర్లు, మంత్రుల సిఫార్సులు కూడా పనిచేయని పరిస్థితి. అలాంటిది సోనూ సూద్ కి ఒక్క ట్వీట్ వేస్తే చాలు రెమిడిసెవిర్ గంటల వ్యవధిలో వచ్చేసేది. ఏంటీ మాయాజాలం. ఎవరికీ దొరకని ఆ ఇంజెక్షన్లు సోనూ సూద్ […]

బాంబే హైకోర్టుకి సోనూసూద్ వివరణ..
X

కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న రోజులవి. ప్రాణాపాయ స్థితిలో రెమిడిసెవిర్ దివ్యౌషధం అనే ప్రచారం జోరుగా సాగడంతో చాలామంది ఆ ఇంజెక్షన్లకోసం నానా అగచాట్లు పడ్డారు. వేల రూపాయలు ఖర్చు చేసినా బ్లాక్ మార్కెట్లో దొరకని స్థితి. చివరకు కలెక్టర్లు, మంత్రుల సిఫార్సులు కూడా పనిచేయని పరిస్థితి. అలాంటిది సోనూ సూద్ కి ఒక్క ట్వీట్ వేస్తే చాలు రెమిడిసెవిర్ గంటల వ్యవధిలో వచ్చేసేది. ఏంటీ మాయాజాలం. ఎవరికీ దొరకని ఆ ఇంజెక్షన్లు సోనూ సూద్ ఎలా సంపాదించగలిగారు. వాటిని అంత విరివిగా ఎలా ఇవ్వగలిగారు అనే విషయంపై బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విచారణ చేపట్టిన హైకోర్టు సోనూ సూద్ సహా, మహారాష్ట్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీషన్‌ సిద్ధిఖీ కి కూడా నోటీసులిచ్చింది. ఈ నోటీసులకి స్పందించిన సోనూ సూద్.. తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చుతూ అభ్యర్థన పిటిషన్ దాఖలు చేశారు.

కరోనా కష్టకాలంలో అందరి సహకారం తీసుకుని రెమెడిసెవిర్ ఇంజక్షన్లు అవసరమైనవారికి సమకూర్చానని వివరించారు సోనూ సూద్. పేషెంట్ల ఆధార్‌ కార్డ్‌, కోవిడ్‌ రిపోర్ట్‌, డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌, ఇలా.. అన్ని పరిశీలించామని, ఆస్పత్రులను సంప్రదించి.. కన్ఫర్మ్ చేసుకున్నామని, ఆ తర్వాత తమ వాలంటీర్లు మరోసారి ధృవీకరించుకున్నారని వెల్లడించారు. బహిరంగ మార్కెట్ లో మందులు దొరక్కపోతే.. జిల్లా కలెక్టర్‌, ఎంపీలను, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్లను సంప్రదించామని చెప్పారు. ఆస్ప్రతులు, ఫార్మసీ ఫ్రాంచైజీలు కూడా తమకు సహకరించాయని వివరించారు. తమ సంస్థ కేవలం మధ్యవర్తిగానే వ్యవహరించిందని, సమాచారాన్ని సంబంధిత అధికారులకు, నేతలకు అందించడం ద్వారా అవసరం ఉన్నవాళ్లకు సాయం చేస్తున్నామని చెప్పారు సోనూ సూద్. సోనూసూద్‌ అభ్యర్థనపై పిటిషనర్‌ అభ్యంతరాలను వినేందుకు కేసుని వాయిదా వేసింది కోర్టు.

కోర్టుకి సమర్పించిన అఫిడవిట్ లో తన ఫౌండేషన్ పనితీరుని సాయం అందిస్తున్న తీరుని కూడా సోనూ సూద్ వివరించారు. మందుల కొనుగోలు, నిల్వ, పంపిణీ చేయడం.. ఇలా ఏ విషయంలోనూ తాను తప్పుడు దారిలో వెళ్ల లేదని సోనూసూద్‌, బాంబే కోర్టుకు వివరించారు. కరోనా మొదటి వేవ్‌ టైంలో చేసిన సాయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘శక్తి అన్నదానం’ కార్యక్రమం ద్వారా 45 వేల మందికి రోజూ భోజన సదుపాయం కల్పించామని వెల్లడించారు. వివిధ కంపెనీల సహకారంతో 3 లక్షల ఉద్యోగాలు ఇప్పించినట్టు తెలిపారు. సోషల్‌ మీడియా ద్వారా కాంటాక్ట్ అవుతున్న వాళ్లకు సాయం ఎలా అందుతున్నదీ వివరంగా తెలిపాడు.

First Published:  1 July 2021 4:33 AM GMT
Next Story