Telugu Global
National

యూపీలో ఎంఐఎం ఎంట్రీ.. ఎవరికి కలిసొచ్చేను..?

వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అధికార బీజేపీ పట్టు కోల్పోయే పరిస్థితి వచ్చిందన్న వార్తల నేపథ్యంలో అన్ని పార్టీలు అక్కడ ఫోకస్ పెంచాయి. ఎప్సీ, బీఎస్పీ, కాంగ్రెస్ కుమ్ములాటలో.. అంతిమంగా తమదే పైచేయి అవుతోందని భావిస్తోంది బీజేపీ. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో అక్కడ ఎంఐఎం ఎంట్రీ ప్రతిపక్షాలకు షాకిచ్చేలా ఉంది. ఎంఐఎం ఎంట్రీ ఇస్తే, దళితులు, మైనార్టీల […]

యూపీలో ఎంఐఎం ఎంట్రీ.. ఎవరికి కలిసొచ్చేను..?
X

వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అధికార బీజేపీ పట్టు కోల్పోయే పరిస్థితి వచ్చిందన్న వార్తల నేపథ్యంలో అన్ని పార్టీలు అక్కడ ఫోకస్ పెంచాయి. ఎప్సీ, బీఎస్పీ, కాంగ్రెస్ కుమ్ములాటలో.. అంతిమంగా తమదే పైచేయి అవుతోందని భావిస్తోంది బీజేపీ. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో అక్కడ ఎంఐఎం ఎంట్రీ ప్రతిపక్షాలకు షాకిచ్చేలా ఉంది.

ఎంఐఎం ఎంట్రీ ఇస్తే, దళితులు, మైనార్టీల ఓటు బ్యాంకు బలంగా ఉన్న బీఎస్పీకి ఎక్కువ నష్టం కలుగుతుందనే అంచనాలు మొదలయ్యాయి. అయితే బీఎస్పీ, ఎంఐఎం ‘భాగీదారీ సంకల్ప్‌ మోర్చా’ పేరిట కూటమి కట్టి పోటీ చేయాలనే ప్రతిపాదనలు గతంలో వినిపించాయి. ఒంటరి పోరుకే బీఎస్పీ మొగ్గు చూపడంతో.. ఎంఐఎం ఎంట్రీపై తాజాగా క్లారిటీ ఇచ్చారు అసదుద్దీన్ ఒవైసీ. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించామని, 100 సీట్లలో పోటీ చేస్తామని స్పష్టం చేశారాయన. ఓంప్రకాశ్‌ రాజ్‌ భర్‌ సారథ్యంలోని సుహేల్‌ దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ (SBSP)తో కలిసి ఎంఐఎం యూపీ ఎన్నికల బరిలో దిగుతుందని చెప్పారాయన.

తెలంగాణతోపాటు.. ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంఐఎం ను విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్న అసదుద్దీన్ ఒవైసీ, ఆమధ్య మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సీట్లు సాధించుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 20చోట్ల పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థులు ఐదు స్థానాలు దక్కించుకున్నారు. ఇదే ఊపుతో ఈ ఏడాది పశ్చిమబెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచినా ఆ పార్టీకి ఒక్క స్థానం కూడా రాలేదు.

పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఎంఐఎం ఎంట్రీ సంచలనంగా మారింది. బీజేపీ బీ టీమ్ గా తమ రాష్ట్రంలో ఎంఐఎం పోటీ చేస్తోందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా విమర్శించారు. ఎంఐఎం రాకతో ముప్పు ఉందని గ్రహించిన ఆమె, మైనార్టీ ఓట్లను చీల్చేందుకు బీజేపీ ఎత్తుగడ వేసింద‌నే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అదే సమయంలో కీలక నేతల్ని తమవైపు తిప్పుకుని బెంగాల్ లో ఎంఐఎంని ఎన్నికలకు ముందే బలహీన పరిచారు. ఆ విధంగా ఆమె అసదుద్దీన్ ని నిలువరించగలిగారు.

ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో కూడా ఎంఐఎం ఎంట్రీ అధికార బీజేపీకి పరోక్షంగా లాభం చేకూర్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బీఎస్పీ, కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్న మైనార్టీలు, గుంపగుత్తగా ఎంఐఎంకు ఓట్లు వేస్తే ప్రతిపక్షాల బలం తగ్గుతుందనే అంచనాలున్నాయి. అందుకే ఎంఐఎం, ప్రధాన ప్రతిపక్షాలతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా 100 స్థానాల్లో బరిలో దిగుతుందని అంటున్నారు. యూపీలో యోగి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, అధికార మార్పిడి తప్పదని అనుకుంటున్న టైమ్ లో ఎంఐఎం ఎంట్రీ ఎవరికి, ఎంతమేరకు ఉపయోగపడుతుందనే విషయం ఎన్నికలనాటికి తేలిపోతుంది.

First Published:  27 Jun 2021 10:37 PM GMT
Next Story