అల్లోపతిని.. మిక్సోపతితో అభాసుపాలు చేయొద్దు..
కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి, ఆస్పత్రికి రావాల్సిన అవసరం లేనివారికి చాలా రాష్ట్రాలు హోమ్ కిట్ లను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. పారాసెట్మాల్ మాత్రలు, విటమిన్ ట్యాబ్లెట్లు ఇందులో ఉంటాయి. అయితే దాదాపు అన్ని ప్రభుత్వాలు అల్లోపతి మెడిసిన్స్ నే ఇస్తున్నాయి. కానీ ఉత్తరాఖండ్ లోని బీజేపీ ప్రభుత్వం మాత్రం పతంజలి ప్రోడక్ట్ ని కరోనా హోమ్ కిట్ లో చేర్చి కలకలం రేపింది. పతంజలి తయారు చేసిన కరోనిల్ గతంలో ఎంతటి వివాదానికి కారణమైందో తెలిసిన విషయమే. […]
కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి, ఆస్పత్రికి రావాల్సిన అవసరం లేనివారికి చాలా రాష్ట్రాలు హోమ్ కిట్ లను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. పారాసెట్మాల్ మాత్రలు, విటమిన్ ట్యాబ్లెట్లు ఇందులో ఉంటాయి. అయితే దాదాపు అన్ని ప్రభుత్వాలు అల్లోపతి మెడిసిన్స్ నే ఇస్తున్నాయి. కానీ ఉత్తరాఖండ్ లోని బీజేపీ ప్రభుత్వం మాత్రం పతంజలి ప్రోడక్ట్ ని కరోనా హోమ్ కిట్ లో చేర్చి కలకలం రేపింది. పతంజలి తయారు చేసిన కరోనిల్ గతంలో ఎంతటి వివాదానికి కారణమైందో తెలిసిన విషయమే. కరోనా మందు అంటూ మార్కెట్లోకి కరోనిల్ ప్రవేశపెట్టి విమర్శలు మూటగట్టుకున్నారు బాబా రామ్ దేవ్. దానిపై ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. ఆ తర్వాత దాన్ని కరోనా మందులా కాకుండా ఇమ్యూనిటీ బూస్టర్ అంటూ ప్రచారం చేపట్టి ఎట్టకేలకు మార్కెట్లోకి దించారు. అయితే ఇప్పుడు దీన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అధికారికంగా పంపిణీ చేయడం మరో విమర్శకు దారి తీసింది.
ఐఎంఏ అభ్యంతరం..
తేలిక పాటి లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులకు ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ ఇచ్చే కొవిడ్ కిట్ లో థర్మా మీటర్, పారాసెటమాల్ మాత్రలు, విటమిన్ డీ, జింక్, ఐవర్ మెక్టిన్ మాత్రలతోపాటు కరోనిల్ కూడా ఉంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కరోనిల్ మందుని హోమ్ కిట్ లో చేర్చి పంపిణీ చేయడంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. అల్లోపతి మందులు ఉండే కరోనా కిట్ లో ఆయుర్వేదానికి చెందిన ‘కరోనిల్’ను చేర్చడంతో అది ‘మిక్సోపతి’ అవుతుందని ఎద్దేవా చేసింది. కరోనిల్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం లభించలేదని ఈ సందర్భంగా గుర్తు చేసింది. కేంద్రం జారీ చేసిన కొవిడ్ మార్గదర్శకాల్లో సైతం ఆయుర్వేద ఔషధాలను చేర్చలేదని చెప్పింది. గతంలో సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన ఆదేశాల్లో అల్లోపతి, ఆయుర్వేదాన్ని కలపడం ఆమోదయోగ్యం కాదని చెప్పినట్టు ఐఏంఏ పేర్కొంది.
ఇటీవల అల్లోపతి వైద్యంపై బాబా రాందేవ్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బాబా రామ్ దేవ్, ఐఎంఏ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రామ్ దేవ్ వ్యాఖ్యలకు నిరసనగా.. ఐఎంఏ ఆందళన కార్యక్రమాలు కూడా చేపడుతోంది. ఈ నేపథ్యంలో.. కరోనిల్ ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొవిడ్ కిట్ తో కలిపి రోగులకు పంపిణీ చేయడం మరో వివాదానికి దారి తీసింది.