Telugu Global
National

టిట్ ఫర్ టాట్.. గట్టిగానే బదులిచ్చిన మమత..

ఆమధ్య ప్రధాని మోదీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పలుమార్లు తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటప్పుడు తమను సమావేశాలకు హాజరు కావాలని చెప్పడం ఎందుకని ప్రశ్నించేవారు. ముఖ్యమంత్రులతో పెట్టిన సమావేశాల్లో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని కూడా ఆరోపించారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఆ అవకాశం మమతా బెనర్జీకి వచ్చింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసేందుకు, తుపాను నష్టంపై సమీక్ష […]

టిట్ ఫర్ టాట్.. గట్టిగానే బదులిచ్చిన మమత..
X

ఆమధ్య ప్రధాని మోదీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పలుమార్లు తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటప్పుడు తమను సమావేశాలకు హాజరు కావాలని చెప్పడం ఎందుకని ప్రశ్నించేవారు. ముఖ్యమంత్రులతో పెట్టిన సమావేశాల్లో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని కూడా ఆరోపించారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఆ అవకాశం మమతా బెనర్జీకి వచ్చింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసేందుకు, తుపాను నష్టంపై సమీక్ష నిర్వహించేందుకు ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ వచ్చారు. అయితే ఆయనను ఏకంగా అరగంటసేపు వేచి చూసేలా చేశారు మమతా బెనర్జీ. సమీక్ష సమావేశానికి ప్రధాని, గవర్నర్ హాజరైన అరగంట తర్వాత మమత సమావేశ మందిరానికి వచ్చారు. వచ్చీరాగానే ప్రధానికి ఓ వినతి పత్రాన్ని ఇచ్చి, అర్జంట్ పనులున్నాయి, వెంటనే వెళ్లిపోతానంటూ అనుమతి అడిగి అక్కడినుంచి వెళ్లిపోయారు మమతా బెనర్జీ.

అధికారులూ లేరు..
సీఎం మమతా బెనర్జీ సమావేశానికి హాజరు కాకపోవడం ఒకెత్తు అయితే.. అధికారులు కూడా ఆ సమీక్షలో పాల్గొనకపోవడం మరో ఎత్తు. అధికారులందర్నీ ఆ మీటింగ్ కి దూరంగా ఉండాలని మమత సూచించినట్టు తెలుస్తోంది. దీంతో మోదీ, గవర్నర్, ప్రతిపక్ష బీజేపీ నేతలు మాత్రమే సమీక్షలో పాల్గొన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ పై ఇప్పుడు గవర్నర్ సహా బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం..
ప్రధాని ఏర్పాటు చేసిన సమావేశానికి మమతా బెనర్జీ గైర్హాజరు కావడంపై గవర్నర్‌ జగ్‌ దీప్‌ ధనకర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చర్య రాజ్యాంగ, సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వాటివల్ల ప్రజలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను దెబ్బతింటాయని చెప్పారు.

ప్రధానికే అవమానమా..?
మమతా బెనర్జీ నియంతృత్వ పోకడలకు తాజా సంఘటన ఓ నిదర్శనమని పశ్చిమ బెంగాల్‌ ప్రతిపక్ష నేత సువేందు అధికారి విమర్శించారు. ప్రధానిని అవమానించడానికే మమత ఇలా చేశారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం ప్రధానితో కలసి పనిచేయాల్సిన సమయంలో.. రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. అటు బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు కూడా ఈ ఘటనపై మండిపడుతున్నారు. మమతా బెనర్జీది నియంతృత్వ పోకడ అంటూ విమర్శిస్తున్నారు.

First Published:  28 May 2021 9:51 PM GMT
Next Story