Telugu Global
NEWS

ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా..

ఏపీలో జూన్ 7వతేదీనుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. తదుపరి తేదీని జూలైలో సమీక్ష నిర్వహించి ప్రకటిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కేసులు పూర్తి స్థాయిలో తగ్గకపోవడం, వ్యాక్సినేషన్ అనుకున్న విధంగా ఊపందుకోకపోవడం, కొన్ని పాఠశాలల్లో కొవిడ్ కేంద్రాలు నిర్వహిస్తుండటంతో.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మేలో జరగాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలను గతంలో ప్రభుత్వం వాయిదా వేసింది. జూన్ 7నుంచి మొదలవ్వాల్సిన పదో తరగతి పరీక్షలను మాత్రం యథాతథంగా నిర్వహించాలనే ఉద్దేశంతోటే ఇప్పటి […]

ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా..
X

ఏపీలో జూన్ 7వతేదీనుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. తదుపరి తేదీని జూలైలో సమీక్ష నిర్వహించి ప్రకటిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కేసులు పూర్తి స్థాయిలో తగ్గకపోవడం, వ్యాక్సినేషన్ అనుకున్న విధంగా ఊపందుకోకపోవడం, కొన్ని పాఠశాలల్లో కొవిడ్ కేంద్రాలు నిర్వహిస్తుండటంతో.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మేలో జరగాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలను గతంలో ప్రభుత్వం వాయిదా వేసింది. జూన్ 7నుంచి మొదలవ్వాల్సిన పదో తరగతి పరీక్షలను మాత్రం యథాతథంగా నిర్వహించాలనే ఉద్దేశంతోటే ఇప్పటి వరకూ ప్రభుత్వం ఉంది. పది పరీక్షల తర్వాత ఇంటర్ పరీక్షలు కూడా నెలాఖరులో లేదా జూలైలో నిర్వహించాలనుకుంటోంది. దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ, జూన్ 7నాటికి పరిస్థితి మరింత చక్కబడుతుందని ప్రభుత్వం ఆశించింది. అయితే ఇటీవల విద్యాశాఖ అధికారులు పరీక్షల సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చారు. ఇప్పటికే ఎన్నికల విధులకు హాజరైన కొంతమంది ఉపాధ్యాయులు కొవిడ్ కారణంగా మరణించారని, పరీక్షల విధుల విషయంలో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలో ఉన్నట్టు వారు ఆ నివేదికలో తెలిపారు. జూన్ లో కూడా కర్ఫ్యూ కొనసాగే అవకాశం ఉండటంతో పరీక్షల నిర్వహణ కష్టసాధ్యమని, నెలరోజులపాటు వాయిదా వేయాలని కోరారు. దీనిపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ పరీక్షలు వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నారు. జూలైలో అప్పటి పరిస్థితి సమీక్షించి పది పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పది పరీక్షలు రద్దు చేసి ఆల్ పాస్ అంటూ గ్రేడ్లు కూడా ఇచ్చేసింది. ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకే కట్టుబడి ఉండటంతో.. కేవలం వాయిదాతోనే సరిపెట్టింది.

టీచర్లకు టీకాలు వేగవంతం..
మరోవైపు టీచర్లందరికీ టీకాలు ఇచ్చిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ప్రతివాదిగా ఉన్న ప్రభుత్వం తరపున న్యాయవాదులు పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు కోర్టుకి తెలిపారు. పాఠశాలలు తిరిగి తెరిచేలోగా టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు వారు చెప్పారు.

First Published:  27 May 2021 2:53 AM GMT
Next Story