Telugu Global
NEWS

తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న భక్తులు..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా భయం తగ్గేకొద్దీ.. తిరుమల కొండకు భక్తుల రాక పెరుగుతోంది. వరుసగా మూడోరోజూ తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కనిపించిన ఓ దశలో మే 12వ తేదీన కేవలం 2,141 మంది భక్తులు మాత్రమే తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం కూడా ఎప్పుడూ లేని విధంగా రూ.10లక్షల కంటే తక్కువకు పడిపోయింది. కోవిడ్ ఉధృతి పెరిగిన తర్వాత, యాత్రికుల రద్దీతో కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం […]

తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న భక్తులు..
X

తెలుగు రాష్ట్రాల్లో కరోనా భయం తగ్గేకొద్దీ.. తిరుమల కొండకు భక్తుల రాక పెరుగుతోంది. వరుసగా మూడోరోజూ తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కనిపించిన ఓ దశలో మే 12వ తేదీన కేవలం 2,141 మంది భక్తులు మాత్రమే తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం కూడా ఎప్పుడూ లేని విధంగా రూ.10లక్షల కంటే తక్కువకు పడిపోయింది.

కోవిడ్ ఉధృతి పెరిగిన తర్వాత, యాత్రికుల రద్దీతో కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉండటంతో.. ఉచిత, కాలినడక దర్శనాలను ఆపివేసి, కేవలం 300రూపాయల ప్రత్యేక దర్శనాలకు మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు అధికారులు. అప్పటికీ దర్శనాల సంఖ్య తగ్గలేదు. రోజుకి పాతికవేలకంటే ఎక్కువమంది భక్తులు వచ్చేవారు. అయితే కోవిడ్ భయం ప్రజల్లో పెరిగిపోవడం, కేసుల సంఖ్య, మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుండటంతో.. తిరుమల యాత్రికుల సంఖ్య పూర్తిగా పడిపోయింది.

తెలుగు రాష్ట్రాల్లో కర్ఫ్యూ విధించిన తర్వాత యాత్రికుల సంఖ్య మరింత తగ్గింది. 10వేలకు లోపు వచ్చేసింది. ఆ తర్వాత 5వేలు, 4వేలు, చివరకు 2వేలకు కూడా చేరుకుంది. మే 12న అత్యల్పంగా 2,141 మంది స్వామివారి దర్శనానికి వచ్చారు. ఇక ఇప్పుడు కరోనా కేసులు తగ్గుతుండటంతో యాత్రికుల సంఖ్య మూడు రోజులుగా పెరుగుతోంది. కొవిడ్ తగ్గిన తర్వాత ముడుపులు చెల్లించుకునేందుకు కూడా భక్తులు కొండకి వస్తున్నారు. ఇటీవలే ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు కోవిడ్ నుంచి కోలుకుని తిరుమల దర్శనానికి వచ్చారు. క్రమంగా భక్తుల సంఖ్య పెరుగుతూ దాదాపు 10వేలకు చేరుకుంది. ఆదివారం 9,204 మంది భక్తులు స్వామి దర్శనానికి రాగా.. సోమవారం 10వేల మార్కు దాటింది. కర్ఫ్యూ సడలిస్తే.. భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అన్ని రకాల కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.

First Published:  25 May 2021 7:08 AM GMT
Next Story