Telugu Global
NEWS

ఈటల కొడుకుపై కబ్జా ఆరోపణలు..

ఈటల రాజేందర్ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు జరిగాయో.. సరిగ్గా ఇప్పుడు ఈటల రాజేందర్ కొడుకు ఎపిసోడ్ అలాగే మొదలవుతోంది. అవును.. ఈటల తర్వాత ఇప్పుడు ఆయన కొడుకు నితిన్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. గతంలో ఈటలపై ప్రజలు నేరుగా సీఎం కేసీఆర్ కి ఫిర్యాదు చేయడం, ఆయన వెంటనే ఏసీబీ, విజిలెన్స్, కలెక్టర్ విచారణకు ఆదేశించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఓ పద్ధతి ప్రకారం ఈటలను మంత్రి వర్గం నుంచి తప్పించడం, అధికారుల నివేదిక […]

ఈటల కొడుకుపై కబ్జా ఆరోపణలు..
X

ఈటల రాజేందర్ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు జరిగాయో.. సరిగ్గా ఇప్పుడు ఈటల రాజేందర్ కొడుకు ఎపిసోడ్ అలాగే మొదలవుతోంది. అవును.. ఈటల తర్వాత ఇప్పుడు ఆయన కొడుకు నితిన్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. గతంలో ఈటలపై ప్రజలు నేరుగా సీఎం కేసీఆర్ కి ఫిర్యాదు చేయడం, ఆయన వెంటనే ఏసీబీ, విజిలెన్స్, కలెక్టర్ విచారణకు ఆదేశించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఓ పద్ధతి ప్రకారం ఈటలను మంత్రి వర్గం నుంచి తప్పించడం, అధికారుల నివేదిక గంటల వ్యవధిలో బయటకు రావడం, అంతా జెడ్ స్పీడ్ లో జరిగింది. ఈ స్పీడ్ కి గతంలో హైకోర్టు బ్రేక్ వేయడంతో విచారణ వ్యవహారం నెమ్మదించింది.

తాజాగా ఈటల కొడుకు నితిన్ వ్యవహారంలో కూడా కబ్జా ఆరోపణలు రావడం, ఆ వెంటనే కేసీఆర్ విచారణకు ఆదేశాలివ్వడం చకచకా జరిగిపోయాయి. తన భూమిని ఈటల కొడుకు నితిన్‌ కబ్జా చేశారంటూ మేడ్చల్‌ మండలం రావల్‌ కోల్ గ్రామస్తుడు మహేష్ ఫిర్యాదు చేశారు. అక్కడా, ఇక్కడా ఎందుకని.. ఆయన నేరుగా సీఎం కేసీఆర్ దగ్గరే పంచాయతీ పెట్టారు. తనకు న్యాయం చేయాలంటూ సీఎంకు విన్నవించుకున్నారు. మహేష్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ చేపట్టాలని సీఎస్‌ సోమేష్ కుమార్‌, ఏసీబీ, విజిలెన్స్‌ విభాగాన్ని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలన్నారు.

భగ్గుమన్న ఈటల వర్గం..
తనపై కక్షసాధింపులకి దిగారని, తనని టార్గెట్ చేసి బయటకు పంపించారంటూ ఈటల ఇప్పటికే సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సకల జనులంతా తమవైపే ఉన్నారని, బెదిరించి తన అనుచరుల్ని టీఆర్ఎస్ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అటు కేసీఆర్ కూడా హుజూరాబాద్ లో ఈటలను ఒంటరి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈటల మద్దతుదారులు, ఆయన సానుభూతి పరులందర్నీ మంత్రి గంగుల కమలాకర్ చేరదీస్తున్నారు. ఈ క్రమంలో కొడుకు నితిన్ పై భూకబ్జా ఆరోపణలు రావడంతో ఈటల వర్గం భగ్గుమంది. అసలు కబ్జా ఆరోపణలు సీఎం దగ్గరకు ఎందుకెళ్తాయని, వాటిపై ఏసీబీ, విజిలెన్స్ దర్యాప్తుకి సీఎం ఎలా ఆదేశిస్తారని ప్రశ్నించారు. కింది స్థాయి సిబ్బంది చేయాల్సిన పనిని సీఎస్ సోమేష్ కుమార్ ని పురమాయించడం వెనక రాజకీయ కుట్రకోణం ఉందని అంటున్నారు ఈటల వర్గీయులు. ఆయన్ను నైతికంగా దెబ్బతీసేందుకే కేసీఆర్ కుటిల పన్నాగాలు పన్నుతున్నారని మండిపడ్డారు.

First Published:  23 May 2021 3:11 AM GMT
Next Story