Telugu Global
National

కేంద్రంతో ఢిల్లీ వ్యాక్సిన్ వార్..

ఢిల్లీకి కొవాక్సిన్ టీకా సరఫరా చేసేందుకు ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ నిరాకరించిందంటూ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా చేసిన ట్వీట్లు తీవ్ర కలకలం రేపాయి. దీనికి పరోక్ష కారణం కేంద్రమేనంటూ ఆయన నిందలు వేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే.. టీకా నిల్వలు తక్కువగా ఉన్నాయని చెబుతూ సదరు కంపెనీ, టీకా సరఫరా చేయట్లేదని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం మనీశ్. కేంద్ర ప్రభుత్వం టీకాలను దుర్వినియోగం చేస్తోందని, కష్టకాలంలో కూడా విదేశాలకు టీకాలు ఎగుమతి చేస్తూ.. భారత […]

కేంద్రంతో ఢిల్లీ వ్యాక్సిన్ వార్..
X

ఢిల్లీకి కొవాక్సిన్ టీకా సరఫరా చేసేందుకు ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ నిరాకరించిందంటూ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా చేసిన ట్వీట్లు తీవ్ర కలకలం రేపాయి. దీనికి పరోక్ష కారణం కేంద్రమేనంటూ ఆయన నిందలు వేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే.. టీకా నిల్వలు తక్కువగా ఉన్నాయని చెబుతూ సదరు కంపెనీ, టీకా సరఫరా చేయట్లేదని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం మనీశ్. కేంద్ర ప్రభుత్వం టీకాలను దుర్వినియోగం చేస్తోందని, కష్టకాలంలో కూడా విదేశాలకు టీకాలు ఎగుమతి చేస్తూ.. భారత పౌరులను మరణం అంచులకు నెడుతోందని మండిపడ్డారు. తాజాగా కేంద్రం 6.6 కోట్ల వ్యాక్సిన్‌ లను విదేశాలకు ఎగుమతి చేయడం క్రూరమైన నేరమంటూ ఆయన ధ్వజమెత్తారు.

వ్యాక్సిన్‌ సరఫరా లేకపోవడంతో ఢిల్లీలో 100 టీకా సెంటర్లను మూసివేయాల్సి వస్తోందని మనీస్ సిసోడియా ట్విట్టర్ లో పేర్కొన్నారు. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు వారికి టీకాలు వేయడానికి 1.34 కోట్ల డోసులు కావాలని ఢిల్లీ ప్రభుత్వం భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్ స్టిట్యూట్ లను కోరిందని తెలిపారు.

కేంద్రంపై ఢిల్లీ ప్రభుత్వం చేసిన విమర్శలకు బీజేపీ అధికార ప్రతినిధి సంబీత్ పాత్ర అంతే ఘాటుగా బదులిచ్చారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో భాగంగానే భారత్ ఇతర దేశాలకు వ్యాక్సిన్ పంపించిందని, దానికి బదులుగా వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి సరుకులు ఆయా దేశాలు భారత్ కు సరఫరా చేశాయని గుర్తు చేశారు సంబీత్ పాత్ర. విదేశాల్లోని భారతీయులకు కూడా ఆయా దేశాలు వ్యాక్సిన్ అందజేశాయని చెప్పారు. వ్యాక్సినేషన్ పై కేజ్రీవాల్ ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. వ్యాక్సిన్లు కొనుగోలుకోసం ఆర్డరు, అడ్వాన్స్ ఇవ్వకుండా కేజ్రీవాల్ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. సంక్షోభ సమయంలో రాజకీయాలు మానుకుని ఏకతాటిపై నడవాలన్నారు.

కొవిషీల్డ్ ఫార్ములా, లైసెన్స్ విదేశాల చేతిలో ఉందని, లైసెన్స్ ఫ్రీ చేయడానికి భారత్, ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రయత్నం చేస్తోందని చెప్పారు సంబీత్. కొవాక్సిన్ లో సజీవ వైరస్ ఉండడంవల్ల దాని తయారీలో కట్టుదిట్టమైన వ్యవస్థ అవసర ఉందని చెప్పారు. ఈ వ్యవస్థ భారత్ బయోటెక్ తోపాటు భారత్ లో మరో కంపెనీ వద్ద మాత్రమే ఉందని, ఆ కంపెనీలో కూడా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ పై ఢిల్లీ ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేయడం తగదన్నారు.

First Published:  12 May 2021 9:42 AM GMT
Next Story