Telugu Global
NEWS

ఏపీలో మొదలైన ఫీవర్ సర్వే..

కోవిడ్ సెకండ్ వేవ్ కట్టడికోసం కర్ఫ్యూతో ప్రజల కదలికలను కట్టడి చేసిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు ఇంటింటా ఫీవర్ సర్వే చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 వేల మంది ఆశా కార్యకర్తలు, 19 వేల మంది ఏఎన్‌ఎంలు ఈరోజు జరిగిన ఫీవర్ సర్వేలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి జ్వర బాధితులను గుర్తించి వారి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో తొలిదశ కరోనా విజృంభించిన సమయంలో కూడా ఇలాగే ఇంటింటి సర్వే జరిగింది. రెండో దశలో.. కర్ఫ్యూ అమలు […]

ఏపీలో మొదలైన ఫీవర్ సర్వే..
X

కోవిడ్ సెకండ్ వేవ్ కట్టడికోసం కర్ఫ్యూతో ప్రజల కదలికలను కట్టడి చేసిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు ఇంటింటా ఫీవర్ సర్వే చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 వేల మంది ఆశా కార్యకర్తలు, 19 వేల మంది ఏఎన్‌ఎంలు ఈరోజు జరిగిన ఫీవర్ సర్వేలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి జ్వర బాధితులను గుర్తించి వారి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో తొలిదశ కరోనా విజృంభించిన సమయంలో కూడా ఇలాగే ఇంటింటి సర్వే జరిగింది. రెండో దశలో.. కర్ఫ్యూ అమలు చేపట్టిన తర్వాత ఫీవర్ సర్వే మొదలుపెట్టారు అధికారులు.

అవసరమైనవారికి ఐసోలేషన్ కిట్..
ఫీవర్‌ సర్వేలో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఆశా కార్యకర్త తన పరిధిలో ఉన్న ఇళ్లకు వెళ్లి, జ్వరం లక్షణాలు ఉన్నవారి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆ వివరాలను ఏఎన్ఎంలు ప్రత్యేక యాప్ లో నమోదు చేస్తారు. జ్వర లక్షణాలు ఉన్నవారికి వెంటనే ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ నిర్వహించి కరోనా నిర్థారిస్తారు. కరోనా పాజిటివ్‌ గా తేలితే.. వెంటనే 104 కాల్‌ సెంటర్‌ కు ఫోన్‌ చేసి హోం ఐసొలేషన్‌ కిట్‌ ఇస్తారు. అవసరమైనవారిని కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలిస్తారు, పరిస్థితి చేయిదాటేలా ఉంటే వెంటనే ఆస్పత్రికి రిఫర్ చేస్తారు.

ఫీవర్ సర్వేతో కోవిడ్ నివారణ దిశగా మరో ముందడుగు పడినట్టు తెలిపారు అధికారులు. సర్వే చేయడం వల్ల బాధితులను ముందుగానే గుర్తించి కోవిడ్ కేర్ సెంటర్లకు లేదా ఆస్పత్రులకు తరలించే అవకాశం ఉందని చెబుతున్నారు. పరిస్థితి విషమించక ముందే కోవిడ్ రోగులకు వైద్యం మొదలు పెడితే ఆక్సిజన్ ఆధారపడే స్థితి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ప్రస్తుతం ఆస్పత్రులకు వచ్చేవారంతా ఆక్సిజన్ అందించాల్సిన స్థితిలో, వ్యాధి ముదిరిపోయిన దశలో వస్తున్నారు. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపట్టింది. వ్యాధిని తొలి దశలోనే గుర్తించి ఐసోలేషన్ కిట్ ద్వారా చికిత్స అందిస్తారు.

ఒకరకంగా ఈ సర్వేతో అనుమానితుల్ని ముందుగానే గుర్తించి సమూహాల్లో కలవకుండా చేసే అవకాశం కూడా ఉంది. తెలిసో తెలియకో వైరస్ క్యారియర్లుగా ఉన్న చాలామంది ఇంటింటి సర్వేలో బయటపడతారు. వైరస్ కట్టడికి ఇది ఎంతగానే ఉపయోగపడుతుంది. దీంతోపాటు రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్ లుగా ప్రకటించి.. అక్కడ ఫీవర్ క్లినిక్స్ ఏర్పాటు చేసి ఏపీ ప్రభుత్వం వైద్యం అందించబోతోంది.

First Published:  7 May 2021 3:41 AM GMT
Next Story