Telugu Global
National

బీహార్ లో అన్నీ బంద్.. పూర్తి స్థాయి లాక్ డౌన్..

పాక్షిక లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ, పగటిపూట 144 సెక్షన్ అంటూ చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ తరహా నిబంధనలు అమలు చేస్తున్న వేళ, బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. బీహార్ లో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్. మే 15వరకు అక్కడ లాక్ డౌన్ అమలులో ఉంటుంది. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో మంత్రులు, అధికారులతో చర్చించిన అనంతరం మే 15 వరకు లాక్ […]

బీహార్ లో అన్నీ బంద్.. పూర్తి స్థాయి లాక్ డౌన్..
X

పాక్షిక లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ, పగటిపూట 144 సెక్షన్ అంటూ చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ తరహా నిబంధనలు అమలు చేస్తున్న వేళ, బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. బీహార్ లో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్. మే 15వరకు అక్కడ లాక్ డౌన్ అమలులో ఉంటుంది. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో మంత్రులు, అధికారులతో చర్చించిన అనంతరం మే 15 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టు సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు.

ధైర్యం చేస్తున్న రాష్ట్రాలు..
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాలని నిపుణులు కేంద్రానికి సూచిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా అడుగులు వేయడానికి వెనకాడుతోంది. బీహార్ లాంటి రాష్ట్రాలు కఠిన నిర్ణయాలకు సిద్ధపడి, పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. అటు మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, ఒడిశా, గోవా లో లాక్ డౌన్ తరహా నిబంధనలు అమలులో ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌, జమ్మూ, హరియాణా, గుజరాత్‌ లలో పాక్షిక లాక్ డౌన్, వీకెండ్ లాక్ డౌన్ అమలులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. బుధవారం నుంచి ఏపీలో పగటిపూట కూడా 12 గంటల వరకే నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయి. ప్రజా రవాణాపై కూడా ఏపీ ఆంక్షలు విధించింది.

ఢిల్లీ ప్రభుత్వం ఆర్థిక సాయం..
అటు ఢిల్లీలో ఈనెల 10 వరకు కర్ఫ్యూ ఆంక్షలు పొడిగించిన కేజ్రీవాల్ ప్రభుత్వం, పేదల ఆకలి తీర్చేందుకు రెండు నెలలపాటు ఉచిత రేషన్ ఇస్తామని ప్రకటించింది. రాష్ట్రంలోని 72 లక్షల కార్డు దారులకు ఉచిత రేషన్ సరకుల ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపింది. లాక్‌ డౌన్‌ వల్ల ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ.5వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు కూడా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా తొలి దశ లాక్ డౌన్ అమలులో ఉన్నప్పుడు కూడా ఢిల్లీ సర్కారు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించింది. సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న ఈ దశలో, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న దాదాపు లక్షన్నర మంది డ్రైవర్లు ఢిల్లీ ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో ఊరట పొందుతారు.

First Published:  4 May 2021 5:18 AM GMT
Next Story