Telugu Global
NEWS

కాలం చెల్లిన వృద్ధ మాంత్రికుడు చంద్రబాబు " సజ్జల ధ్వజం..

సంక్షోభ సమయంలో రాజకీయాలు పక్కనపెట్టి ప్రజలకు చేతనైన సాయం చేయాల్సిన ప్రతిపక్షనేత.. నీచ‌ రాజకీయాలు చేస్తూ రాష్ట్రానికి చీడలా మారారని మండిపడ్డారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చివరికి ఉద్యోగుల్ని కూడా వదిలి పెట్టకుండా అందర్నీ రెచ్చగొడుతున్నారని, ఎల్లో మీడియా అండతో విషప్రచారం చేస్తున్నారని అన్నారు. ఉద్యోగుల్ని పనిచేసేలా ప్రోత్సహించాల్సింది పోయి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని, ఉద్యోగులపై బండలు వేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు కుంగిపోయిన, కాలం చెల్లిన వృద్ధ మాంత్రికుడిలా తన ప్రపంచంలో తానుండి […]

కాలం చెల్లిన వృద్ధ మాంత్రికుడు చంద్రబాబు  సజ్జల ధ్వజం..
X

సంక్షోభ సమయంలో రాజకీయాలు పక్కనపెట్టి ప్రజలకు చేతనైన సాయం చేయాల్సిన ప్రతిపక్షనేత.. నీచ‌ రాజకీయాలు చేస్తూ రాష్ట్రానికి చీడలా మారారని మండిపడ్డారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చివరికి ఉద్యోగుల్ని కూడా వదిలి పెట్టకుండా అందర్నీ రెచ్చగొడుతున్నారని, ఎల్లో మీడియా అండతో విషప్రచారం చేస్తున్నారని అన్నారు. ఉద్యోగుల్ని పనిచేసేలా ప్రోత్సహించాల్సింది పోయి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని, ఉద్యోగులపై బండలు వేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు కుంగిపోయిన, కాలం చెల్లిన వృద్ధ మాంత్రికుడిలా తన ప్రపంచంలో తానుండి పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి రావడానికి సైతం బాబు భయపడుతున్నారని, అందుకే హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడుతున్నారని అన్నారు. కనీసం చంద్రబాబు తన కొడుకునయినా ప్రజల వద్దకు పంపించొచ్చు కదా అని ప్రశ్నించారు సజ్జల.

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే కోవిడ్‌ సమస్యలు రాష్ట్రాన్ని చుట్టుముట్టినా, ప్రభుత్వాదాయం పడిపోయినా, పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్న ఏపీ సీఎం జగన్, దేశంలోనే మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు సజ్జల. నిబ్బరంతో అడుగులు ముందుకు వేస్తూ, తక్కువ నష్టంతో ఏపీ బయటపడగలిగిందంటే దానికి కారణం సీఎం జగన్ దార్శనికత అని కొనియాడారు. పూర్తి మెజార్టీతో ఎన్నుకున్న ప్రజలు జగన్ పై పూర్తి విశ్వాసం ఉంచడం వల్లే స్థానిక ఎన్నికల్లో సైతం ప్రజలు వైసీపీని గెలిపించారని, తిరుపతి ఉప ఎన్నికల్లోనూ తమ పార్టీకి అదే స్థాయి ఘన విజయం దక్కుతుందని చెప్పారు.

లాక్‌ డౌన్‌ అవసరం లేకుండా..
తొలి దశలో లాక్ డౌన్ తో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అందుకే రెండో దశలో లాక్ డౌన్ లేకుండా.. వ్యాక్సినేషన్ ని సమర్థంగా పూర్తి చేసి ఈ కష్టాలనుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు సజ్జల. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేకపోయినా.. తమవంతు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో రోజువారీ కార్యకలాపాలు ఆగిపోకుండా, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, వీలైనంత వరకు భద్రతా చర్యలు పాటిస్తూ, ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేలా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. అందులో భాగంగానే అన్ని జాగ్రత్తలు తీసుకుని టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు.

ఏపీకి చీడలా చంద్రబాబు..
గతంలో జగన్‌ ఏనాడూ.. టీడీపీ విఫలమైందని విమర్శించలేదని, కానీ చంద్రబాబు మాత్రం పొద్దున లేచింది మొదలు అందరినీ రెచ్చగొడుతున్నారని, ప్రభుత్వ సిబ్బందిని సైతం పనిచేయొద్దని చెబుతూ ఎల్లో మీడియాలో విషపు రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ లో కూర్చుని, జూమ్‌ కాన్ఫరెన్స్‌ లో రోజుకో మెసేజ్‌ ఇస్తున్నారని, ఆ మెసేజ్ లను తీసుకుని, రసగుళికలుగా తయారు చేసి ఒక సెక్షన్‌ మీడియా జనం మీదకు తోస్తుంటే అసహ్యం వేస్తోందని చెప్పారు సజ్జల.

ఆన్ లైన్ తో ఏం జరుగుతుంది..?
కరోనా నివారణకు ఆన్ లైన్ వ్యవస్థ ఏర్పాటు చేశామంటూ చంద్రబాబు చెప్పడాన్ని తప్పుబట్టారు సజ్జల. ఆన్ లైన్ లో వ్యవసాయం చేయొచ్చా? పండించిన పంటలను రవాణా చేయొచ్చా? మార్కెట్‌ లోని సరుకులు ఆన్‌ లైన్‌ లోకి వస్తాయా..? ఇంట్లో వంట ఆన్ లైన్ లో చేయొచ్చా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి చంద్రబాబు ఒక విలన్‌ లా తయారయ్యారని మండిపడ్డారు.

ఏపీలో కొవిడ్‌ నియంత్రణ, నివారణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని, ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచుతున్నామని చెప్పారు. ప్రజలంతా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు ధరించాలని, గుంపులుగా చేరొద్దని సూచించారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించకూడదనే ఉద్దేశంతోనే మేడే కార్యక్రమం నిర్వహించలేదని చెప్పారు.

కార్మికుల గురించి మాట్లాడే అర్హత బాబుకి ఉందా..?
1999–2004 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 104 సంస్థలను ప్రైవేటీకరిస్తే.. ఏపీలో అధికారంలో ఉన్న బాబు.. ఏకంగా 54 సంస్థలను అమ్మేశారని గుర్తు చేశారు సజ్జల. ఆల్విన్, రిపబ్లిక్‌ ఫోర్జ్, స్పిన్నింగ్‌ మిల్లులు, చక్కెర ఫ్యాక్టరీలు, సహకార డైయిరీలు మూతబడేలా చేశారని చెప్పారు. అలాంటి చంద్రబాబుకి కార్మికుల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. అవకాశం ఉంటే చంద్రబాబు ఆర్టీసీని సైతం అమ్మేసేవారని, ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కార్మికుల గురించి ఆయన మాట్లాడటం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు సజ్జల.

First Published:  1 May 2021 10:10 AM GMT
Next Story