Telugu Global
NEWS

తిరుపతి బరిలో గాజు గ్లాసు.. బీజేపీలో టెన్షన్..

తిరుపతి ఉప ఎన్నికలో సత్తా చూపించడానికి చెమటోడుస్తున్న బీజేపీ నాయకులకు నిజంగా ఇది షాకింగ్ న్యూసే. పవన్ కల్యాణ్ ప్రచారంతో కాస్తో కూస్తో ఊపు వచ్చిందనుకుంటున్న దశలో సడన్ గా గాజు గ్లాసు తెరపైకి వచ్చింది. గాజు గ్లాసు గుర్తుపై నవతరం పార్టీ తరపున గోదా రమేష్ కుమార్ అనే వ్యక్తి బరిలో నిలిచారు. ఆల్రడీ ప్రచారం చేసుకుంటున్నారు కూడా. ఆయన వాల్ పోస్ట‌ర్లు చూసే వరకు అసలు గాజు గ్లాసు గుర్తుని వేరేవారికి కేటాయించారనే విషయం […]

తిరుపతి బరిలో గాజు గ్లాసు.. బీజేపీలో టెన్షన్..
X

తిరుపతి ఉప ఎన్నికలో సత్తా చూపించడానికి చెమటోడుస్తున్న బీజేపీ నాయకులకు నిజంగా ఇది షాకింగ్ న్యూసే. పవన్ కల్యాణ్ ప్రచారంతో కాస్తో కూస్తో ఊపు వచ్చిందనుకుంటున్న దశలో సడన్ గా గాజు గ్లాసు తెరపైకి వచ్చింది. గాజు గ్లాసు గుర్తుపై నవతరం పార్టీ తరపున గోదా రమేష్ కుమార్ అనే వ్యక్తి బరిలో నిలిచారు. ఆల్రడీ ప్రచారం చేసుకుంటున్నారు కూడా. ఆయన వాల్ పోస్ట‌ర్లు చూసే వరకు అసలు గాజు గ్లాసు గుర్తుని వేరేవారికి కేటాయించారనే విషయం కూడా ఎవరికీ తెలియదు. దీంతో బీజేపీ నేతలు రచ్చ చేస్తున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకు గాజు గ్లాసు గుర్తుని కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే జనసేనకు ఇంకా గుర్తింపు రాకపోవడం, తిరుపతి ఉప ఎన్నికలో గ్లాసు గుర్తు పొందిన జనసేన పోటీలో లేకపోవడంతో.. ఇప్పుడా గుర్తుని నవతరం పార్టీకి కేటాయించారు. నవతరం పార్టీకి కూడా గుర్తింపు లేకపోవడంతో ప్రస్తుతానికి గాజు గ్లాసు గుర్తుని ఆ పార్టీ అభ్యర్థికి కేటాయించారు. దీంతో బీజేపీ, జనసేనలో టెన్షన్ మొదలైంది.

జనసేన అభ్యర్థులు పొరపాటున గ్లాసు గుర్తుపై ఓటు వేస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు బీజేపీ నేతలు. వైసీపీ కావాలని కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. అధికారులు కావాలనే ఇలా గుర్తు కేటాయించారని విమర్శిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు కొట్టివేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల ప్రకారమే గుర్తుల్ని కేటాయించామని చెబుతున్నారు.

న్యాయపోరాటానికి సిద్ధం..
ప్రచారాన్ని పక్కనపెట్టి ముందు గుర్తు వ్యవహారం తేల్చుకోవాలని చూస్తున్నారు బీజేపీ నేతలు. రెండు రోజులుగా గుర్తుపై తెగ ఇదైపోతున్నారు. ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని, అక్కడ న్యాయం జరక్కపోతే కోర్టుకి వెళ్తామని అంటున్నారు. అయితే కేటాయించిన గుర్తుని రద్దు చేస్తే నవతరం పార్టీ అభ్యర్థి ఊరుకుంటారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఆల్రడీ ప్రచారం చేసుకుంటున్నానని, ఇప్పుడు ఇబ్బంది పెట్టడం సరికాదని ఆయన కూడా న్యాయపోరాటానికి దిగే అవకాశం ఉంది. మొత్తమ్మీద తిరుపతి బరిలో బీజేపీకి పవన్ కల్యాణ్ మద్దతిచ్చినా.. ఈవీఎంలలో కమలంతో గ్లాసు పోటీకి దిగుతోందనమాట.

First Published:  4 April 2021 10:23 PM GMT
Next Story