Telugu Global
National

తొలిదశ ముగిసింది.. ఆడియో వార్ మొదలైంది..

8దశల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ జరగాల్సిన పశ్చిమబెంగాల్ లో తొలిదశ ముగిసింది. 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్ లో భారీగా 82శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఘర్షణలు కూడా అదే స్థాయిలో జరిగాయి. బీజేపీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురికాగా.. సువేందు అధికారి సోదరుడి కారుని వైరి వర్గం ధ్వంసం చేసి, భయాందోళనలు సృష్టించింది. ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. […]

తొలిదశ ముగిసింది.. ఆడియో వార్ మొదలైంది..
X

8దశల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ జరగాల్సిన పశ్చిమబెంగాల్ లో తొలిదశ ముగిసింది. 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్ లో భారీగా 82శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఘర్షణలు కూడా అదే స్థాయిలో జరిగాయి. బీజేపీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురికాగా.. సువేందు అధికారి సోదరుడి కారుని వైరి వర్గం ధ్వంసం చేసి, భయాందోళనలు సృష్టించింది. ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఏప్రిల్ 1న జరగాల్సిన మలిదశ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్ స్థానం కూడా ఉంది. బీజేపీనుంచి సువేందు అధికారి బరిలో ఉండటంతో.. నందిగ్రామ్ టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది.

ఆడియో టేప్స్ కలకలం..
తొలిదశ జరిగిన రోజే.. బెంగాల్ లో నాటకీయ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. బీజేపీ, టీఎంసీ మధ్య ఆడియో వార్‌ మొదలైంది. మమతా బెనర్జీపై ఆరోపణలతో బీజేపీ ఓ ఆడియో విడుదల చేయగా.. టీఎంసీ నేతలు సైతం పోటీగా మరో ఆడియోని బయటపెట్టి మాటల యుద్ధానికి తెరతీశారు. నందిగ్రామ్‌ ఎన్నికల్లో మద్దతివ్వాలంటూ సాక్షాత్తూ మమతా బెనర్జీ తనకు ఫోన్ చేశారని, బీజేపీ నేత ప్రళయ్ పాల్ ఓ ఆడియో విడుదల చేశారు. “నందిగ్రామ్ లో నన్ను గెలిపించు, నీకు ఏం కావాలో నేను చూసుకుంటా” అంటూ తనకు ఫోన్ చేసిమరీ మమత అభయం ఇచ్చారని, అయితే తాను మాత్రం సువేందు అధికారితోనే ఉంటానన్నానని ప్రళయ్ చెప్పుకొచ్చారు. ఈమేరకు సోషల్ మీడియాలో విడుదల చేసిన ఆడియో వైరల్ గా మారింది. మమతకు ఓటమి భయం పట్టుకుందని విమర్శలు ఎక్కుపెట్టారు బీజేపీ నేతలు.

టీఎంసీ రివర్స్‌ అటాక్‌..
బీజేపీ నేతల నుంచి ఆడియో రికార్డింగ్ బయటకొచ్చిన కొన్ని గంటలకే టీఎంసీ మరో అస్త్రాన్ని సంధించింది. బీజేపీ సీనియర్‌ నేత ముకుల్‌ రాయ్‌, మరో నేత శిశిర్‌ బజోరియాతో మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఆ ఆడియో టేప్ లో ఏకంగా ఎన్నికల కమిషన్ ని ప్రభావితం చేసే అంశాలున్నాయని టీఎంసీ ఆరోపించింది. స్థానికేతరుల్ని కూడా బూత్‌ ఏజెంట్లుగా నియమించుకోవడానికి ఈసీని సంప్రదించాలని ముకుల్‌ రాయ్‌ అన్నట్లుగా ఆడియో ఉందని, ఆ ఫోన్ టాక్ కి అనుగుణంగానే ఈసీ సైతం నిబంధనలు సడలించిందని విమర్శించారు తృణమూల్ నేతలు. కేవలం బూత్ పరిధిలోని వ్యక్తులనే ఏజెంట్లుగా నియమించేలా నిబంధనలు మార్చాలని ఈసీకి విన్నవించారు. మొత్తమ్మీద తొలిదశలోనే బీజేపీ ఎన్నికల వేడి అందరికీ తెలిసొచ్చింది. ఘర్షణలతో కొన్ని ప్రాంతాలు వణికిపోయాయి. మిగిలిన ఏడు దశలు ఎలా ఉంటాయో అనే ఆందోళన ప్రజల్లో నెలకొంది.

ప్రధాని మోదీ వీసా క్యాన్సిల్ చేయాలి..
బంగ్లా దేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. పశ్చిమ బెంగాల్ ఎన్నికలను ప్రభావితం చేసేలా మాట్లాడారని, ఆయన వీసా రద్దు చేయాలని డిమాండ్ చేశారు మమతా బెనర్జీ. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బంగ్లాదేశ్ నటుడు టీఎంసీ తరపున రోడ్ షో లో పాల్గొంటే.. ఆ దేశ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి మరీ ఆయన వీసా క్యాన్సిల్ చేయించారని, ఇప్పుడు ప్రధాని చేసిన పనేంటని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మోదీపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు మమత.

First Published:  28 March 2021 7:10 AM GMT
Next Story