Telugu Global
NEWS

ఏప్రిల్ 17న తిరుపతి, సాగర్ ఉప ఎన్నిక..

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల నగారా మోగింది. సరిగ్గా నేటికి నెలరోజుల తర్వాత ఏప్రిల్ 17న ఉప ఎన్నిక జరుగుతుంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రెండు నియోజకవర్గాలున్నాయి. ఏపీలోని తిరుపతి లోక్ సభ నియోజకవర్గంతోపాటు, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ని తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈనెల 23న నోటిఫికేషన్ విడుదలవుతుంది. అప్పటినుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. మార్చి […]

ఏప్రిల్ 17న తిరుపతి, సాగర్ ఉప ఎన్నిక..
X

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల నగారా మోగింది. సరిగ్గా నేటికి నెలరోజుల తర్వాత ఏప్రిల్ 17న ఉప ఎన్నిక జరుగుతుంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రెండు నియోజకవర్గాలున్నాయి. ఏపీలోని తిరుపతి లోక్ సభ నియోజకవర్గంతోపాటు, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ని తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈనెల 23న నోటిఫికేషన్ విడుదలవుతుంది. అప్పటినుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. మార్చి 30వరకు నామినేషన్లు వేయడానికి ఆఖరి గడువు. ఈనెల 31న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఏప్రిల్ 3న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఏప్రిల్ 17న ఓటింగ్ జరిపితే, మే 2న కౌంటింగ్, అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు. దేశవ్యాప్తంగా 2 లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాలకు అదే రోజు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది.

తిరుపతిలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణంతో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అందరికంటే ముందుగా ఉప ఎన్నికలకోసం టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఇక్కడ టీడీపీ తరపున పోటీలో దిగుతారు. ఇక వైసీపీ తరపున ఫిజియో థెరపిస్ట్ గురుమూర్తిని ఆ పార్టీ ఖరారు చేసింది. అయితే అధికారికంగా ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇక బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి కమలం గుర్తుపై బరిలో దిగాల్సి ఉంది. మరోవైపు ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాట సమితి తరపున కూడా తిరుపతిలో అభ్యర్థిని నిలబెడతామంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.

అటు తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి నోముల నర్సింహయ్య మరణంతో ఉప ఎన్నిక వస్తోంది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి పేరు ఖరారైంది. బీజేపీ, టీఆర్ఎస్ లు ఇంకా అభ్యర్థికోసం వెదుకుతూనే ఉన్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల నేపత్యంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశాలున్నాయి.

First Published:  16 March 2021 8:35 AM GMT
Next Story