Telugu Global
NEWS

భయపడ్డారా..? రాజీ పడ్డారా..? కేటీఆర్ కి రేవంత్ బహిరంగ లేఖ..

ప్రధాని మోదీకి తెలంగాణ సర్కారు భయపడుతోందని, ఆయనతో రాజీ మంత్రం జపిస్తోందని మండిపడ్డారు ఎంపీ రేవంత్ రెడ్డి. ఎన్నికల సమయంలో హక్కులకోసం మాట్లాడటం, ఆ తర్వాత వాటిని మరచిపోవడం టీఆర్ఎస్ నేతలకు అలవాటైందని విమర్శించారు. విభజన హామీలకోసం కేంద్రంతో పోరాడాల్సింది పోయి, విశాఖ ఉక్కుకోసం పోరాటానికి మద్దతు తెలుపుతామనడం వారి రాజకీయ దురుద్దేశాలను బహిర్గతం చేస్తోందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెటిలర్లను ఆకట్టుకోడానికే విశాఖ ఉక్కు నినాదాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు రేవంత్ రెడ్డి. ఈమేరకు మంత్రి […]

భయపడ్డారా..? రాజీ పడ్డారా..? కేటీఆర్ కి రేవంత్ బహిరంగ లేఖ..
X

ప్రధాని మోదీకి తెలంగాణ సర్కారు భయపడుతోందని, ఆయనతో రాజీ మంత్రం జపిస్తోందని మండిపడ్డారు ఎంపీ రేవంత్ రెడ్డి. ఎన్నికల సమయంలో హక్కులకోసం మాట్లాడటం, ఆ తర్వాత వాటిని మరచిపోవడం టీఆర్ఎస్ నేతలకు అలవాటైందని విమర్శించారు. విభజన హామీలకోసం కేంద్రంతో పోరాడాల్సింది పోయి, విశాఖ ఉక్కుకోసం పోరాటానికి మద్దతు తెలుపుతామనడం వారి రాజకీయ దురుద్దేశాలను బహిర్గతం చేస్తోందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెటిలర్లను ఆకట్టుకోడానికే విశాఖ ఉక్కు నినాదాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు రేవంత్ రెడ్డి. ఈమేరకు మంత్రి కేటీఆర్ కు రేవంత్ రెడ్డి ఓ బహిరంగ లేఖ రాశారు.

‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధికోసమే ఈ ఎత్తుగడ వేశారు. విభజన చట్టంలో రాష్ట్రానికి రావాల్సిన వాటిపై పోరాడరు కానీ విశాఖ ఉక్కు కోసం పోరాడతారా? మీ ఎంపీలు పార్లమెంటులో పోరాడరు. మీరు జంతర్ మంతర్ వద్ద దీక్షకు కూడా రారు, కానీ ఎన్నికలు వచ్చినప్పుడు హక్కుల గురించి గొంతు చించుకోవడం మాత్రం వచ్చా..? ఎన్నికలయ్యాక ఇచ్చిన హామీలను మరచిపోవడం మీకు, మీ పార్టీకి అలవాటుగా మారింది. పెరిగిన నిత్యవసరాలు, గ్యాస్, పెట్రోల్‌ ధరల పెరుగుదలపై పార్లమెంట్‌ లో పోరాటానికి మీ ఎంపీలు ముఖం చాటేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అంటే భయపడుతున్నారా? రాజీ పడుతున్నారా?’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీపై టీఆర్ఎస్ గల్లీలో మాటలకు ఢిల్లీలో చేతలకు పొంతన కుదరడం లేదని అన్నారు రేవంత్ రెడ్డి.

బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై స్పందించడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఈరోజు విశాఖ ఉక్కు విషయంలో రాజీ పడితే రేపు తెలంగాణలోని బీహెచ్ఈఎల్, సింగరేణి విషయంలో కూడా అలాగే చేస్తారని, అందుకే అందరం కలసి పోరాడాలని అన్నారాయన. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి టీఆర్ఎస్ మద్దతు ఉంటుందని, అవసరమైతే విశాఖకు వచ్చి ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటామని కూడా చెప్పారాయన. అయితే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆయన ఏపీకి అనుకూలంగా మాట్లాడారనే విమర్శలు వినిపించాయి. హైదరాబాద్ లోని సెటిలర్ల ఓట్లకోసమే కేటీఆర్ ఈ ఎత్తుగడ వేశారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో బహిరంగంగానే కేటీఆర్ ని విమర్శిస్తూ రేవంత్ రెడ్డి లేఖాస్త్రాన్ని సంధించారు. విశాఖ ఉక్కుపై స్పందించిన కేటీఆర్, విభజన హామీల విషయం ఎందుకు మరచిపోయారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

First Published:  11 March 2021 5:50 AM GMT
Next Story