Telugu Global
National

'బంగారు బంగ్లా'కు మోదీ హామీలు.. దీదీపై కొత్తగా మిథునాస్త్రం..

పశ్చిమబెంగాల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ఆ రాష్ట్రంలో పర్యటించారు. కోల్ కతా లోని ప్రఖ్యాత బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో పాల్గొన్న మోదీ.. మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బంగారు బంగ్లా నిర్మాణం బీజేపీతో సాధ్యమని అన్నారు. మార్పు తెస్తానంటూ గద్దెనెక్కిన మమతా బెనర్జీ బెంగాలీల విశ్వాసాన్ని వమ్ము చేశారని, ఆమె చేతిలో మోసపోయిన జనం ఇప్పుడు బీజేపీని ఆదరిస్తున్నారని చెప్పారు. టీఎంసీ, లెఫ్ట్, […]

బంగారు బంగ్లాకు మోదీ హామీలు.. దీదీపై కొత్తగా మిథునాస్త్రం..
X

పశ్చిమబెంగాల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ఆ రాష్ట్రంలో పర్యటించారు. కోల్ కతా లోని ప్రఖ్యాత బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో పాల్గొన్న మోదీ.. మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బంగారు బంగ్లా నిర్మాణం బీజేపీతో సాధ్యమని అన్నారు. మార్పు తెస్తానంటూ గద్దెనెక్కిన మమతా బెనర్జీ బెంగాలీల విశ్వాసాన్ని వమ్ము చేశారని, ఆమె చేతిలో మోసపోయిన జనం ఇప్పుడు బీజేపీని ఆదరిస్తున్నారని చెప్పారు. టీఎంసీ, లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు ఒకవైపు, బెంగాల్ ప్రజలంతా మరోవైపు నిలబడి ఉన్నారని అన్నారు. ఏ రాష్ట్రానికి వెళ్తే.. అక్కడి ప్రజల్ని ఆకాశానికెత్తేయడం అలవాటున్న మోదీ.. తన సుదీర్ఘ ప్రస్థానంలో ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు ఆదరించడం తానెన్నడూ చూడలేదని కోల్ కతా బహిరంగ సభలో జనాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘బంగారు బంగ్లా’ కలలు సాకారం చేసేందుకే తాను కోల్ కతా వచ్చానని, బెంగాల్ అభివృద్ధికి, పెట్టుబడులు పెరిగేందుకు, బెంగాల్ సంస్కృతి పరిరక్షణకు, మార్పు తీసుకువచ్చేందుకు భరోసా ఇస్తున్నానని హామీ ఇచ్చారు.

మిథున్ చక్రవర్తి రాకతో బీజేపీ ఫేట్ మారేనా..?
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రీపోల్ సర్వేలన్నీ మమతా బెనర్జీకే ఎడ్జ్ ఉన్నట్టు స్పష్టం చేశాయి. బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా మేజిక్ ఫిగర్ సొంతం చేసుకునే అదృష్టం మాత్రం దీదీదే నని తేల్చేశాయి. దీంతో బీజేపీ సర్వశక్తులూ ఒడ్డేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వలసల్ని విపరీతంగా ప్రోత్సహించి టీఎంసీని బలహీన పరిచబోతోంది. తాజాగా సినీ నటుడు మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరారు. ప్రధాని మరేంద్ర మోదీ బెంగాల్ పర్యటన సందర్భంగా మిథున్ చేరిక కీలక మలుపుగా భావిస్తున్నారు బెంగాల్ బీజేపీ నాయకులు. అందరూ ఊహించినట్టుగానే మిథున్ తొలి సభలోనే ఘాటు వ్యాక్యలతో ఆకట్టుకున్నారు. ‘నేనే అసలైన కోబ్రా, నాకు ఒక్క కాటు చాలు’ అని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో నివసించేవారంతా బెంగాలీలేనని అన్నారు. టీఎంసీ తరపున రాజ్య సభ సభ్యుడిగా పనిచేసిన మిథున్ చక్రవర్తి శారదా కుంభకోణం తర్వాత తెరమరుగయ్యారు. తాజాగా ఇప్పుడు బీజేపీలో చేరి, మమతాకు వ్యతిరేకంగా పనిచేయబోతున్నారు.

ప్రధాని పర్యటనరోజు బెంగాల్ లో నిరసనలు..
పెరిగిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా టీఎంసీ నాయకులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా సీఎం మమతా బెనర్జీ ఈ ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఊరూవాడా గ్యాస్ సిలిండర్ల బొమ్మలు పెట్టుకుని వీధుల్లోకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు టీఎంసీ కార్యకర్తలు. ధరల పెంపుతో ప్రజల్ని దగా చేస్తున్న బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు మమతా బెనర్జీ.

First Published:  7 March 2021 9:02 PM GMT
Next Story