Telugu Global
NEWS

ఫలించిన భూమన మంత్రాంగం.. తిరుపతి మేయర్ పీఠం ఆమెకేనా?

పుణ్యక్షేత్ర పట్టణమైన తిరుపతిలో ఎట్టకేలకు 19 ఏళ్ల తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. తిరుపతి మున్సిపాలిటీగా ఉన్న సమయంలో 2002లో చివరి సారిగా ఎన్నికలు జరిగాయి. అప్పుడు తెలుగుదేశం నుంచి శంకర్‌రెడ్డి చైర్మన్‌గా గెలిచారు. అప్పట్లో చైర్మన్ కోసం నేరుగా ఎన్నికలు జరిగేవి. చంద్రబాబు సన్నిహితుడు కావడం, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండటంతో ఆయన సులభంగానే విజయం సాధించారు. 2007లో తిరుపతిని మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే […]

ఫలించిన భూమన మంత్రాంగం.. తిరుపతి మేయర్ పీఠం ఆమెకేనా?
X

పుణ్యక్షేత్ర పట్టణమైన తిరుపతిలో ఎట్టకేలకు 19 ఏళ్ల తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. తిరుపతి మున్సిపాలిటీగా ఉన్న సమయంలో 2002లో చివరి సారిగా ఎన్నికలు జరిగాయి. అప్పుడు తెలుగుదేశం నుంచి శంకర్‌రెడ్డి చైర్మన్‌గా గెలిచారు. అప్పట్లో చైర్మన్ కోసం నేరుగా ఎన్నికలు జరిగేవి. చంద్రబాబు సన్నిహితుడు కావడం, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండటంతో ఆయన సులభంగానే విజయం సాధించారు.

2007లో తిరుపతిని మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే విలీన గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు హైకోర్టులో కేసులు వేశారు. ఆ కేసులన్నీ 15 ఏళ్ల పాటు కోర్టుల్లో విచారణ జరుపుకున్నాయి. ఇటీవలే హైకోర్టు ఒకేసారి ఆ కేసులన్నింటినీ పరిష్కరించడంతో తిరుపతి కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలతో పాటే తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ పలు డివిజన్లను ఏకగ్రీవం చేసుకున్నది. ప్రత్యర్థి టీడీపీ పోటీ పడటానికి బలమైన అభ్యర్థులు కరువయ్యారు. కాగా, ఈ సారి మేయర్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో ఇద్దరి పేర్లు మేయర్ పదవికి బలంగా వినిపిస్తున్నాయి.

తిరుపతిలో యాదవులు బలమైన సామాజిక వర్గంగా ఉన్నారు. బీసీకి ఈ పీఠం కేటాయించడంతో యాదవ వర్గం నుంచి ఇద్దరు మహిళలు మేయర్ స్థానానికి పోటీ పడుతున్నారు. వైసీపీ పార్టీలో మొదటి నుంచి చురుకుగా ఉన్న జల్లి తులసి యాదవ్ వదిన శిరీష పేరు పలువురు ప్రతిపాదిస్తున్నారు. ఆమె ఇప్పటికే 27వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఏకగ్రీవం అయ్యారు. మరోవైపు ఇదే పదవికి అన్నా రామచంద్రయ్య కుటుంబం పోటీ పడుతున్నది.

2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నా రామచంద్రయ్య కుటుంబం టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు. ఇప్పటికీ వారిపై తిరుపతి ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు అన్నా రామచంద్రయ్య కూతురు అనిత మేయర్ పదవిపై పట్టుదలగా ఉన్నారు. ఆ కుటుంబానికి మేయర్ పదవి ఇస్తే వైసీపీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

దీంతో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రంగంలోకి దిగారు. అన్నా రామచంద్రయ్య వర్గీయులతో మంతనాలు జరిపిన భూమన.. శిరీషకు మేయర్ పీఠం దక్కేలా ఒప్పించారు. దీంతో వైసీపీ తరపున శిరీషనే మేయర్ పీఠం ఎక్కుతారని స్పష్టమవుతున్నది. ఆమెకు రెండున్నర ఏళ్లు మేయర్ పదవి కేటాయించి.. మిగిలిన సమయం అనితకు ఇవ్వాలని భూమన రాజీ కుదిర్చినట్లు తెలుస్తున్నది.

ఇక డిప్యూటీ మేయర్‌గా భూమన కుమారుడు అభియన్ రెడ్డి అయ్యే అవకాశం ఉన్నది. ఆయన ఇప్పటికే 4వ డిమిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఏకగ్రీవం అయ్యారు.

First Published:  6 March 2021 3:15 AM GMT
Next Story